2022 Maruti Suzuki Brezza । భారత్లో అత్యధికంగా అమ్ముడవుతున్న SUV ఇదే!
06 September 2022, 23:27 IST
- మారుతి సుజుకి బ్రాండ్ నుంచి విడుదలైన 2022 Maruti Suzuki Brezza భారతదేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే SUVగా అవతరించింది. ఆ వివరాలు చూడండి.
2022 Maruti Suzuki Brezza
భారతదేశంలో మారుతి కార్లకు కస్టమర్ల నుంచి మంచి ఆదరణ ఉంటుంది. ప్రస్తుతం దేశీయంగా ఎన్నో బ్రాండ్ లకు చెందిన వాహనాలు వివిధ శ్రేణుల్లో అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా మిడ్-రేంజ్ SUVలకు మంచి మార్కెట్ ఉంది. ఈ క్రమంలో ప్రారంభించిన రెండు నెలల్లోనే, కొత్త తరం మారుతి సుజుకి బ్రెజా (Maruti Suzuki Brezza 2022) దేశంలో అత్యధికంగా అమ్ముడైన SUVగా అవతరించింది, ఒక ఆగస్టు నెలలోనే దేశవ్యాప్తంగా 15,193 మారుతి బ్రెజా వాహనాలు అమ్ముడయ్యాయి. ఇదే సమయంలో 15,085 యూనిట్ల విక్రయాలతో టాటా నెక్సాన్ రెండో స్థానంలో నిలిచింది. గత 9 నెలల కాలంలో అత్యధికంగా అమ్ముడవుతున్న Nexon కారును మారుతి Brezza సేల్స్ ఓవర్ టేక్ చేశాయి.
మరో విశేషం ఏమిటంటే.. 2022 బ్రెజా కోసం దాదాపు 1 లక్షకు పైగా బుకింగ్లను అందుకున్నట్లు మారుతీ సుజుకి ఇండియా (MSI) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ ఒక ప్రకటనలో తెలిపారు.
Maruti Suzuki Brezza 2022 హైలైట్స్
కొత్త తరం మారుతి సుజుకి బ్రెజా SUVలో 1.5-లీటర్ K15C పెట్రోల్ ఇంజన్తో వస్తుంది. ఈ ఇంజన్ 103bhp గరిష్ట శక్తిని అలాగే 137Nm గరిష్ట టార్కును ఉత్పత్తి చేస్తుంది.
మారుతి బ్రెజా ఆటోమేటిక్ లేదా మ్యాన్యువల్ ఆప్షన్లలో కొనుగోలు చేయవచ్చు. ఆటోమేటిక్ ఆప్షన్లో VXi, ZXi, ZXi డ్యూయల్-టోన్, ZXi + , ZXi డ్యూయల్-టోన్ అనే ఐదు వేరియంట్లలో లభిస్తుంది. వీటి ధరలు ఎక్స్- షోరూం వద్ద రూ. 10.96 లక్షల నుంచి మొదలుకొని రూ. 13.96 లక్షల వరకు ఉన్నాయి.
మాన్యువల్ వేరియంట్ల ధరలు రూ. 7.99 లక్షల నుంచి మొదలుకొని రూ. 12.46 లక్షల వరకు ఉన్నాయి. అలాగే, తమ బ్రాండ్ నుంచి ఇప్పటికే చాలా మోడళ్లను CNG వెర్షన్లో విడుదల చేసిన మారుతి సుజుకి త్వరలో Maruti Suzuki Brezza 2022లోనూ CNG మోడల్ను విడుదల చేసే అవకాశం ఉంది.