Netflix: ఆ సిరీస్ను ఆపాలని కోర్టులో కేసు వేసిన సీబీఐ.. నెట్ఫ్లిక్స్ ఓటీటీకి నోటీసులు
18 February 2024, 21:19 IST
- The Indrani Mukerjea Story: The Buried Truth: ఓ డాక్యుమెంటరీ సిరీస్ స్ట్రీమింగ్కు రాకుండా ఆపాలని కోర్టును ఆశ్రయించింది సీబీఐ. బరీడ్ ట్రూత్ సిరీస్ను నిలుపుదల చేయాలని కోరింది. ఆ వివరాలివే..
ది ఇంద్రాణియా ముఖర్జియా: ది బరీడ్ ట్రూత్ వెబ్ సిరీస్
The Indrani Mukerjea Story: The Buried Truth: నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో రానున్న ఓ డాక్యుమెంటరీ వెబ్ సిరీస్పై అప్పుడే వివాదం మొదలైంది. ఈ సిరీస్ స్ట్రీమింగ్కు రాకుండా ఆపాలని ఏకంగా కేంద్ర దర్యాప్తు సంస్థ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) కోర్టులో కేసు వేసింది. ‘ది ఇంద్రాణి ముఖర్జియా: ది బరీడ్ ట్రూత్’ డాక్యు సిరీస్ను ఆపాలని ముంబైలోని ఓ ప్రత్యేక కోర్టును సీబీఐ ఆశ్రయించింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసు ఆధారంగా ‘ది ఇంద్రాణి ముఖర్జియా: ది బరీడ్ ట్రూత్’ వెబ్ సిరీస్ రూపొందింది. ఈ సిరీస్ ఫిబ్రవరి 23వ తేదీన నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కు రావాల్సి ఉంది. ఇప్పటికే ట్రైలర్ను కూడా ఆ ఓటీటీ రిలీజ్ చేసింది. ఈ తరుణంలో ఈ సిరీస్ను ఆపాలని సీబీఐ.. కోర్టుకు వెళ్లింది.
సీబీఐ ఏం చెప్పిందంటే..
షోనా బోరా హత్య కేసు విచారణ ముగిసే వరకు ది ‘ఇంద్రాణి ముఖర్జియా: ది బరీడ్ ట్రూత్’ డాక్యు సిరీస్ స్ట్రీమింగ్ కాకుండా ఆపాలని కోర్టును సీబీఐ కోరింది. సీబీఐ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ సీజే నందోడ్ పిటిషన్ వేశారు. కేసులో నిందితులుగా ఉన్న వారితో పాటు సంబంధం ఉన్న వారు ఉన్నందున ఈ సిరీస్ను ఆపేయాలని సీబీఐ కోరింది.
“నిందితులతో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న వారు ఉన్న ఈ సిరీస్ను ఆపేయాలి. విచారణ ముగిసే వరకు ఏ ప్లాట్ఫామ్లో కూడా ప్రసారం కాకుండా నిలుదల చేయాలి. ఆ విధంగా నెట్ఫ్లిక్స్తో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న వారికి ఆదేశాలు జారీ చేయాలి” అని ముంబైలోని ప్రత్యేక కోర్టును సీబీఐ కోరింది.
సీబీఐ పిటిషన్ వేయడంతో నెట్ఫ్లిక్స్ ఓటీటీతో పాటు సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేసింది కోర్టు. ఫిబ్రవరి 20వ తేదీలోగా స్పందన తెలియజేయాలని ఆదేశించింది. దీంతో ది ఇంద్రాణి ముఖర్జియా: ది బరీడ్ ట్రూత్.. స్ట్రీమింగ్కు వస్తుందా లేదా అనేది ఉత్కంఠగా మారింది. 20వ తేదీన స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
దేశాన్ని షాక్కు గురి చేసిన షీనా బోరా హత్య కేసుపైనే ఈ వెబ్ సిరీస్ రూపొందింది. 2012 ఏప్రిల్లో షీనా బోరా హత్యకు గురయ్యారు. అయితే, ఈ కేసులో నిందితురాలిగా ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియా మూడేళ్ల తర్వాత 2015లో అరెస్ట్ అయ్యారు. వేరే కేసులో అరెస్ట్ అయిన ఆమె డ్రైవర్ చెప్పిన విషయాలతో ఈ హత్య ఉదంతం బయటికి వచ్చింది. దీంతో షీనా మర్డర్ కేసులో ఆమె తల్లి ఇంద్రాణియా జైలుకు వెళ్లారు.
షీనా బోరా హత్య కేసులో ఎన్నో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఈ కేసులో ఇంద్రాణి మాజీ భర్త సంజీవ్ ఖన్నా కూడా అరెస్ట్ అయ్యారు. సీబీఐ వేగంగా విచారణ చేసింది. అయితే, 2022 మేలో ఇంద్రాణియా ముఖర్జీకి బెయిల్ వచ్చింది. దీంతో ఆమె ప్రస్తుతం బయట ఉన్నారు. అన్బ్రోకెన్: ది అన్టోర్డ్ స్టోరీ పేరుతో ఆమె గతేడాది ఓ బుక్ రాశారు. జైలు జీవితంతో పాటు పలు అంశాలను ఇంద్రాణి ఆ బుక్లో వెల్లడించారు.