Taraka Ratna Health : బెంగళూరుకు తారకరత్న.. నారాయణ హృదయాలయలో చికిత్స
28 January 2023, 8:25 IST
- Taraka Ratna Health Update : ఏపీలోని కుప్పంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభించారు. ఈ పాదయాత్రలో పాల్గొన్న నందమూరి తారకరత్న అస్వస్థతకు గురయ్యారు. ఆ తర్వాత గుండెపోటుగా వైద్యులు నిర్ధారించారు.
తారకరత్న
నటుడు, రాజకీయ నాయకుడు నందమూరి తారకరత్న(Taraka Ratna) శుక్రవారం (జనవరి 28) గుండెపోటుకు గురయ్యారు. ఆంధ్రప్రదేశ్లోని కుప్పంలో పాదయాత్రలో పాల్గొన్న ఆయనకు ఛాతి నొప్పి వచ్చింది. వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. నందమూరి తారకరత్నను తదుపరి చికిత్స నిమిత్తం బెంగళూరులోని నారాయణ హృదయాలయకు తీసుకొచ్చి చికిత్స కొనసాగిస్తున్నారు.
కుప్పంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్(Nara Lokesh) పాదయాత్ర ప్రారంభించారు. ఇందులో పాల్గొన్న తారకరత్న అస్వస్థతకు గురయ్యారు. ఆ తర్వాత అతనికి గుండెపోటు వచ్చిందని తెలిసింది. అతడిని ఆస్పత్రికి తరలించిన వీడియో చూసిన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. మొదట్లో క్షీణించిన ఆయన ఆరోగ్యం ఇప్పుడు కాస్త కోలుకున్నట్లు చెబుతున్నారు.
తొలుత కుప్పంలోని ఆసుపత్రిలో చికిత్స పొందారు. తదుపరి చికిత్స కోసం బెంగళూరుకు తరలించారు. ప్రస్తుతం ఆయన నారాయణ హృదయాలయలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. తారకరత్న ఆరోగ్యంపై ఆసుపత్రి నుంచి వచ్చే హెల్త్ బులెటిన్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.
నారా లోకేశ్ పాదయాత్ర ప్రారంభం నాడు.. కుప్పం పట్టణం లక్ష్మీపురంలోని మసీదులో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో లోకేశ్, నందమూరి బాలకృష్ణ తో పాటుగా తారకరత్న పాల్గొన్నారు. ఆ సమయంలో ఒక్క సారిగా కుప్పకూలారు. వెంటనే.. అతడిని కుప్పంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు. తారకరత్న గుండెపోటుకు గురైనట్లుగా నిర్దారించారు. యాంజియోగ్రామ్ చేశారు. బెంగుళూరు నుంచి మెడికల్ టీంలు ప్రత్యేక ఏర్పాట్లతో అర్ద్రరాత్రి కుప్పం నుంచి తీసుకెళ్లారు.
మరోవైపు బాలయ్య బెంగళూరులోని నారాయణ హృదయాలయ వైద్యులతోనూ మాట్లాడినట్టుగా తెలుస్తోంది. డాక్టర్లు శక్తి మేర చికిత్స అందించారని.. తెలిపారు. బెంగళూరు తరలించామని, ఆందోళన అసవరం లేదని వెల్లడించారు. బెంగళూరు నారాయణ హృదయాలయ వైద్యులు కుప్పం నుంచి తారకరత్నను పరిశీలించారు. పూర్తి స్థాయి వైద్య ఏర్పాట్లతో అర్ద్రరాత్రిపూట తారకరత్నను బెంగళూరుకు తరలించారు.
తారకరత్న 2002లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 'ఒకటో నంబర్ కుర్రాడు' ఆయన మొదటి సినిమా. 'యువరత్న', 'తారక్', 'భద్రాది రాముడు', 'నందీశ్వరుడు' వంటి సినిమాల్లో నటించారు.