IND W vs AUS W: పోరాడి ఓడిన టీమిండియా.. ఆసీస్దే సిరీస్
30 December 2023, 23:52 IST
- IND W vs AUS W: ఆస్ట్రేలియాతో రెండో వన్డేలోనూ భారత మహిళల జట్టు ఓటమి పాలైంది. చివరి వరకు పోరాడిన రిచా ఘోష్ అద్భుత ఇన్నింగ్స్ వృథా అయింది. కాస్తలో టీమిండియా పరాజయం చవిచూసింది.
రిచా ఘోష్
IND W vs AUS W: ఆస్ట్రేలియాతో టెస్టులో సత్తాచాటిన భారత మహిళల జట్టు.. వన్డేల్లో సిరీస్లో నిరాశ పరుస్తోంది. మూడు వన్డేల సిరీస్లో వరుసగా రెండో మ్యాచ్లో ఓడిపోయింది. సిరీస్ను టీమిండియా చేజార్చుకుంది. ముంబై వేదికగా నేడు జరిగిన రెండో వన్డేలో కేవలం 3 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో భారత్ పరాజయం పాలైంది. చివరి వరకు పోరాడి ఓడింది టీమిండియా. భారత బ్యాటర్ రిచా ఘోశ్ (96) అద్భుత పోరాటం వృథా అయింది. వివరాలివే..
ఈ మ్యాచ్లో ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగింది ఆస్ట్రేలియా మహిళల జట్టు. 50 ఓవర్లలో 8 వికెట్లకు 258 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాటర్లలో ఓపెనర్ ఫోయెబ్ లిచ్ఫీల్డ్ (63), ఎలీస్ పెర్రీ (50) అర్ధ శతకాలతో అదరగొట్టారు. భారత స్పిన్నర్ దీప్తి శర్మ ఐదు వికెట్లు తీసుకొని.. ఆస్ట్రేలియాను కట్టడి చేశారు. స్నేహ్ రాణా, శ్రేయాంక పాటిల్, పూజా వస్త్రాకర్ చెరో వికెట్ తీసుకున్నారు.
మోస్తరు లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా చివరి వరకు పోరాడి ఓడింది. 50 ఓవర్లలో 8 వికెట్లకు 255 పరుగులు చేయగలిగింది. రిచా ఘోష్ అద్భుతంగా ఆడి.. సెంచరీకి నాలుగు పరుగుల దూరంలో ఔటయ్యారు. 117 బంతుల్లో 13 ఫోర్లతో మొత్తంగా 96 పరుగులు చేశారు. జెమీమా రోడ్రిగ్స్ (44), స్మృతి మంధాన (34) పర్వాలేదనిపించగా.. చివర్లో దీప్తి శర్మ (24 నాటౌట్) నిలిచారు. అయితే, గెలుపుకు 3 పరుగుల దూరంలో భారత మహిళల జట్టు ఆగిపోయింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ (5), అమన్ జోత్ కౌర్ (4) విఫలమయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో అనాబెల్ సదర్ల్యాండ్ మూడు, జార్జియా వెరెహామ్ రెండు వికెట్లతో రాణించారు.
గెలుపు కోసం చివరి రెండు ఓవర్లలో భారత్కు 19 పరుగులు కావాల్సి ఉంది. ఆ దశలో ఆస్ట్రేలియా బౌలర్ గార్డ్నర్ 49వ ఓవర్లో మూడు పరుగులు మాత్రమే ఇచ్చి హర్లీన్ డియోల్ (1)ను ఔట్ చేశారు. చివరి ఓవర్లో 16 పరుగులు భారత్కు అవసరమమయ్యాయి. దీప్తి శర్మ రెండు ఫోర్లు బాదడం సహా దూకుడుగా ఆడి చివరి వరకు పోరాడారు. అయితే, చివరి ఓవర్లో 12 రన్స్ వచ్చాయి. దీంతో భారత్కు ఓటమి తప్పలేదు.
ఈ గెలుపుతో 2-0తో ఈ వన్డే సిరీస్ను ఆస్ట్రేలియా పక్కా చేసుకుంది. ఈ సిరీస్లో చివరిదైన ఆఖరి వన్డే జనవరి 2న ముంబైలోని వాంఖడే స్టేడియంలోనే జరగనుంది.
టాపిక్