Gama Awards: దుబాయ్లో గామా టాలీవుడ్ అవార్డ్స్.. తెలుగు హీరోకు ప్రత్యేక సత్కారం.. ఎప్పుడంటే?
20 December 2023, 7:38 IST
Gama Tollywood Awards 2024: ప్రతి సంవత్సరం దుబాయ్లో జరిగే ప్రతిష్టాత్మక గామా టాలీవుడ్ మూవూ అవార్డ్స్ను 2024 సంవత్సరంలో మరింత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో తెలుగు హీరోకు ప్రత్యేక సత్కారంతోపాటు స్పెషల్ అవార్డ్ అందించనున్నారు. గామా అవార్డ్స్ వివరాల్లోకి వెళితే..
దుబాయ్లో గామా టాలీవుడ్ అవార్డ్స్.. తెలుగు హీరోకు ప్రత్యేక సత్కారం.. ఎప్పుడంటే?
Gama Tollywood Movie Awards At Dubai: దుబాయ్లో ప్రతి సంవత్సరం వైభవంగా జరిగే గామా అవార్డ్స్ గల్ఫ్ తెలుగు సినీ అవార్డ్స్ వచ్చే ఏడాది నిర్వహించనున్నారు. 2024 మార్చి 3న మరింత భారీగా గామా అవార్డ్స్ కార్యక్రమం జరిపించనున్నారు. ఈ వేడుకకు నేషనల్ అవార్డ్ విన్నర్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రత్యేక అతిథిగా విచ్చేయనున్నారు.
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యధిక కలెక్షన్లు సాధించడంతో పాటు 57 ఏళ్ల నేషనల్ అవార్డ్ చరిత్రలో జాతీయ స్థాయిలో మొట్టమొదటి సారి, ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు అందుకున్న తెలుగు తేజం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కి, వేలాదిమంది తెలుగు, తమిళ, మళయాల సినీ ప్రేమికుల మధ్యలో దుబాయ్ గామా వేదిక పై ప్రత్యేక సత్కారం చేయాలని, "గామా నేషనల్ ఐకాన్ అవార్డ్" అందించాలని భావిస్తున్నట్లు గామా అవార్డ్స్ చైర్మన్ శ్రీ కేసరి త్రిమూర్తులు తెలిపారు.
మార్చి 3, 2024న దుబాయిలో జరగబోయే ఈ గామా అవార్డ్స్ కార్యక్రమానికి తెలుగు సినిమా రంగానికి చెందిన పలువురు ప్రముఖులు హాజరవుతున్నారు. 2021, 2022, 2023 సంవత్సరంలో ఉత్తమ చిత్రాలు, నటులు, దర్శకులు, సంగీతం విభాగాలలో ప్రతిష్టాత్మకమైన గామా అవార్డ్స్ అందజేయనున్నట్టు, అదేవిధంగా గామా స్థాపించినప్పటి నుంచి సహాయ, సహకారాలు అందిస్తున్న ఈనాడు, ఈటీవీ (ETV) యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సారి కూడా గామా అవార్డు ఫంక్షన్ ను ఈటీవీలో ప్రసారం చేయడం సంతోషంగా ఉందని గామా అవార్డ్స్ సీఈఓ సౌరభ్ కేసరి తెలిపారు.
గామా టాలీవుడ్ మూవీ అవార్డ్స్ 2024 కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు సుకుమార్, బాబీ, బుచ్చిబాబు సాన, శ్రీ వీ.ఎన్.ఆదిత్య, మెగా బ్రదర్ నాగబాబు, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత శ్రీ నవీన్, వైజయంతి మూవీస్ వారసురాళ్లు శ్రీమతి స్వప్న దత్, ప్రియాంక దత్, డీవీవీ దానయ్య, టీజీ విశ్వప్రసాద్, నిర్మాత బన్నీ వాసు, ప్రముఖ సంగీత దర్శకులు ఎమ్ఎమ్ కీరవాణి, డా. కోటి, దేవి శ్రీ ప్రసాద్, ఎస్ఎస్ తమన్, ఎమ్ఎమ్ శ్రీలేఖ, రఘు కుంచె, అనూప్ రుబెన్స్, హేషం అబ్దుల్ వహాబ్, గాయకులు మనో, ధనుంజయ్, చంద్రబోస్ అతిథులుగా హాజరుకానున్నారు.