Alia Bhatt Ramayan Saree: అయోధ్యలో ఆలియా.. అందరి కళ్లూ ఆమె చీరపైనే.. దానిపై ఏముందో చూడండి
22 January 2024, 14:35 IST
- Alia Bhatt Ramayan Saree: అయోధ్య రామ మందిరంలో బాల రాముడి ప్రాణ ప్రతిష్టకు వచ్చిన బాలీవుడ్ నటి ఆలియా భట్.. తన చీరతో అందరికీ అట్రాక్ట్ చేసింది. దానిపై రామాయణాన్ని వివరించే అంశాలు ఉండటమే దీనికి కారణం.
భర్త రణ్బీర్ కపూర్, డైరెక్టర్ రోహిత్ శెట్టిలతో ఆలియా భట్
Alia Bhatt Ramayan Saree: అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్టకు దేశంలోని ఎంతో మంది ప్రముఖులు హాజరయ్యారు. అందులో బాలీవుడ్ నటి ఆలియా భట్ కూడా ఉంది. ఆమె తన భర్త రణ్బీర్ కపూర్ తో కలిసి ఈ వేడుకకు వచ్చింది. అయితే ఆలియా అయోధ్యలో అడుగు పెట్టగానే అందరి కళ్లూ ఆమె చీరపైనే ఉన్నాయి.
ఆలియా చీరపై రామాయణం?
అయోధ్యలో భర్త రణ్బీర్ కపూర్ తో కలిసి ప్రత్యేక విమానంలో ఆలియా వచ్చింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఫొటోలు దిగారు. అయితే అక్కడ ప్రత్యక్షంగా ఉన్న వాళ్లు ఆలియా చీర ప్రత్యేకతను గుర్తించారు. ఆ తర్వాత ఆమె చీరను మరింత దగ్గర ఫొటోలు తీయడం మొదలు పెట్టారు. ఆలియా చీర కొంగుపై రామాయణాన్ని వివరించే అంశాలు ఉండటమే దీనికి కారణం.
పలువురు సోషల్ మీడియా యూజర్లు కూడా ఫొటోల్లో ఆలియా చీరను క్షుణ్నంగా గమనించి ఈ విషయాన్ని బయటపెట్టారు. ఓ సింపుల్ బ్లూ కలర్ శారీలో ఆలియా ఈ వేడుకకు వచ్చింది. అయితే చీర బోర్డర్ పైమాత్రం రామాయణాన్ని కళ్లకు కట్టే పలు చిత్రాలు, అక్షరాలు ఉన్నాయి. అంతేకాదు దానిపై రామసేతు, హనుమాన్ చిత్రాలు కూడా ఉన్నట్లు మరికొందరు గుర్తించారు.
వేడుకకు తగినట్లు తన ఫ్యాషన్ తో ఆకట్టుకునే ఆలియా.. అయోధ్యకు ఇలా రావడం చాలా మందికి నచ్చింది. సోషల్ మీడియాలో ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాదు కొందరైతే అలాంటి చీర ఎక్కడ దొరుకుతుందో అని నెట్ లో సెర్చ్ చేయడం కూడా మొదలు పెట్టారు. గతేడాది రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ మూవీలో నటించినప్పటి నుంచీ ఆలియా చాలా వరకూ చీరల్లోనే కనిపిస్తోంది.
గతేడాదే హార్ట్ ఆఫ్ స్టోన్ అనే మూవీతో హాలీవుడ్ అరంగేట్రం చేసిన ఆలియా.. సంజయ్ లీలా భన్సాలీతో బైజూ బావ్రా, జీ లే జరాలాంటి సినిమాలు చేస్తోంది. ఆమె భర్త రణ్బీర్ కపూర్ యానిమల్ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నాడు. అతడు నితేష్ తివారీ తీస్తున్న రామాయణం మూవీలో రాముడి పాత్ర పోషించనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో సీతగా సాయి పల్లవి నటిస్తోంది.
మూడు భాగాలుగా ఈ రామాయణం మూవీ రానుంది. ఇందులో రావణుడిగా యశ్ నటించబోతున్నాడన్న వార్తలు వస్తున్నాయి. ఇక కుంభకర్ణుడిగా బాబీ డియోల్, హనుమంతుడిగా సన్నీ డియోల్ నటిస్తే బాగుంటుందనుకున్న మేకర్స్.. ఇప్పటికే వాళ్లను సంప్రదించారు.
మరోవైపు అయోధ్యలో సోమవారం (జనవరి 22) బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులతోపాటు పలువురు మాజీ క్రికెటర్లు కూడా హాజరయ్యారు. టాలీవుడ్ నుంచి చిరంజీవి, రామ్ చరణ్, పవన్ కల్యాణ్ లాంటి వాళ్లు అయోధ్య వెళ్లారు. బాలీవుడ్ నుంచి కత్రినాకైఫ్, విక్కీ కౌశల్, కంగనా రనౌత్ లాంటి వాళ్లు హాజరయ్యారు.