Election results 2023 : 'తగ్గేదేలే!'.. 3 రాష్ట్రాల్లో బీజేపీ హవా- కాంగ్రెస్కు భారీ షాక్!
03 December 2023, 11:09 IST
- Election results 2023 : అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. కాగా.. 3 రాష్ట్రాల్లో బీజేపీ హవా కనిపిస్తోంది.
'తగ్గేదేలే!'.. 3 రాష్ట్రాల్లో బీజేపీ హవా
Assembly Election results 2023 : మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో బీజేపీ హవా కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఇప్పటివరకు ఉన్న సమాచారాన్ని చూస్తుంటే.. మధ్యప్రదేశ్లో బీజేపీ మరోమారు ఆధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక రాజస్థాన్లో కాంగ్రెస్కు షాక్ తప్పేడట్టు లేదు. అటు ఛత్తీస్గఢ్లో కాస్త పోటీ-పోటీ కనిపిస్తున్నా.. బీజేపీ ముందంజలో ఉంది!
మధ్యప్రదేశ్లో ఇలా..
మధ్యప్రదేశ్లో మొత్తం 230 సీట్లు ఉండగా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కనీసం 116 స్థానాల్లో గెలవాల్సి ఉంటుంది. ఇక ఆదివారం ఉదయం 10:30 గంటల సమయానికి.. బీజేపీ 152 సీట్లల్లో లీడ్లో దూసుకెళుతోంది! కాంగ్రెస్ కేవలం 74 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇతరులు నాలుగు చోట్ల ఆధిక్యంలో ఉన్నారు.
Madhya Pradesh Assembly Election results 2023 : మధ్యప్రదేశ్లో కమలదళం విజయానికి దగ్గరవుతున్న నేపథ్యంలో.. ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆశిస్సులతో ఈసారి కూడా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
రాజస్థాన్లో ఇలా..
రాజస్థాన్లో బీజేపీ దూసుకెళుతోంది! 200 సీట్లకు 199చోట్ల ఎన్నికలు జరగ్గా.. ట్రెండ్స్ ప్రకారం.. ఆదివారం ఉదయం 10:30 గంటల సమయానికి కమలదళం 109 చోట్ల ఆధిక్యంలో దూసుకెళుతోంది. కాంగ్రెస్ 76 చోట్ల మాత్రమే లీడ్లో ఉంది.
రాజస్థాన్లో దశాబ్దాలుగా ఏ పార్టీ కూడా వరుసగా రెండోసారి అధికారంలోకి రాలేదు. ఇప్పుడు కూడా ఇదే రిపీట్ అవుతున్నట్టు కనిపిస్తోంది.
ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్కు షాక్..?
Chhattisgarh assembly election results : ఛత్తీస్గఢ్లో కాస్త హోరాహోరీ పోరు కనిపిస్తోంది. కానీ కాంగ్రెస్కు గట్టి షాక్ ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 90 సీట్లల్లో 46 స్థానాల మెజారిటీ కావాల్సి ఉండగా.. బీజేపీ ఇప్పటికే 48 చోట్ల ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ కేవలం 38 సీట్లల్లో ముందంజలో ఉంది. ఇతరులు 4 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు.
వాస్తవానకి ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని అందరు భావించారు. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా ఇదే విషయాన్ని చెప్పాయి. కానీ పరిస్థితులు తారుమారు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
తెలంగాణలో మాత్రం.. కాంగ్రెస్ పార్టీ విజయంవైపు దూసుకెళుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇక మిజోరంలో కూడా నేడు ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగాల్సి ఉంది. కానీ దీనిని సోమవారానికి వాయిదా వేశారు.