Shreyas Iyer: ఎన్సీఏ ఫిట్ అన్నది - శ్రేయస్ గాయమంటున్నాడు - అసలు ఏం జరుగుతోంది?
22 February 2024, 9:47 IST
Shreyas Iyer: ఎన్సీఏ ఫిట్ అంటూ ప్రకటించిన తర్వాత రోజు శ్రేయస్ అయ్యర్ గాయంతో రంజీ మ్యాచ్కు దూరం కావడం క్రికెట్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. గాయం సాకు చూపించే అయ్యర్ రంజీ మ్యాచ్ ఆడటం లేదని అంటోన్నారు.
శ్రేయస్ అయ్యర్
Shreyas Iyer: పూర్తి ఫిట్ అంటూ నేషనల్ క్రికెట్ అకాడెమీ సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాతి రోజే శ్రేయస్ అయ్యర్ గాయంతో రంజీ ట్రోపీ క్యార్టర్ ఫైనల్ మ్యాచ్ నుంచి తప్పుకోవడం క్రికెట్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఇంగ్లండ్తో జరుగుతోన్న టెస్ట్ సిరీస్లో తొలి రెండు టెస్ట్ మ్యాచ్లలో శ్రేయస్ అయ్యర్కు చోటు దక్కింది. పేలవమైన ఆటతీరు కారణంగా తుది మూడు టెస్ట్ల నుంచి అతడిని సెలెక్టర్లు పక్కనపెట్టారు. శ్రేయస్ అయ్యర్ గాయంతో ఇబ్బందిపడుతున్నాడని, అందుకే అతడిని సెలెక్ట్ చేయలేదని బీసీసీఐప్రకటించింది.
ఇటీవలే బీసీసీఐ కాంట్రాక్ట్ పొందిన క్రికెటర్లు అందరూ దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందేనని రూల్ తీసుకొచ్చారు.ఈ రూల్ కారణంగా ముంబాయి క్రికెట్ అసోసియేషన్ శ్రేయస్ అయ్యర్ పేరును రంజీ ట్రోపీ కోసం పరిశీలనలోకి తీసుకున్నది. రంజీ క్యార్టర్ ఫైనల్ మ్యాచ్లో బరోడాతో ముంబాయి తలపడనుంది. ఈ మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ బరిలో దిగితే తమకు లాభం చేకూరుతుందని ముంబాయి క్రికెట్ అసోసియేషన్ భావించింది.
గాయంతో తప్పుకున్న అయ్యర్...
శ్రేయస్ అయ్యర్ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడని, ఫిట్గా ఉన్నాడని నేషనల్ క్రికెట్ అకాడెమీ హెడ్ నితీన్ పటేల్ కూడా ప్రకటించాడు. ఈ మెయిల్ ద్వారా బీసీసీఐకి అయ్యర్ ఫిట్గా ఉన్న విషయాన్ని తెలిపాడు. ఫిట్ అంటూ ఎన్సీఏ ప్రకటించిన తర్వాతే రోజే వెన్నునొప్పి గాయంతో తాను రంజీ మ్యాచ్ ఆడటం లేదని శ్రేయస్ అయ్యర్ ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడటం ఇష్టం లేకనే గాయం సాకు చూపి శ్రేయర్ అయ్యర్ రంజీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ నుంచి తప్పుకున్నట్లు క్రికెట్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
గాయం అబద్ధమేనా...
ఎన్సీఏ రిపోర్ట్లలో తప్పు ఉండటం అసంభవమని అంటున్నారు. క్రికెట్ ఆడకుండా శ్రేయస్ ఎలా గాయపడుతాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. టీమిండియా కాంట్రాక్ట్ పొందిన చాలా మంది క్రికెటర్లు ప్రస్తుతం దేశవాళీగా దూరంగా ఉంటోన్నారు. ఐపీఎల్ మినహా రంజీ, ఇరానీ, దులీప్ ట్రోఫీ వంటి దేశవాళీ సిరీస్లు ఆడటం లేదు. పర్సనల్ ప్రాబ్లెమ్స్తో ఇంగ్లండ్ సిరీస్కు తన పేరును పరిశీలించవద్దని బీసీసీఐకి తెలిపిన ఇషాన్ కిషన్ దుబాయ్లో స్నేహితులతో జల్సాలు చేసిన వీడియోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. డొమెస్టిక్ క్రికెట్ ఆడటానికి కూడా అతడు ఆసక్తి చూపకపోవడంపై బీసీసీఐ ఫైర్ అయ్యింది. కాంట్రాక్ట్ క్రికెటర్టు అందరూ డొమెస్టిక్ క్రికెట్ ఆడాల్సిందేనని రూల్ విధించింది.
నాలుగు ఇన్నింగ్స్లలో 104 రన్స్...
ఇంగ్లండ్తో వైజాగ్, హైదరాబాద్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్లలో తుది జట్టులో శ్రేయస్ అయ్యర్ చోటు దక్కించుకున్నాడు. నాలుగు ఇన్నింగ్స్లలో కలిపి 104 రన్స్ ( 27, 29, 35, 13 ) మాత్రమే చేసి నిరాశపరిచాడు. టెస్ట్ సిరీస్ ఆరంభానికి ముందు మిడిల్ ఆర్డర్లో శ్రేయస్ అయ్యర్ కీలకంగా నిలిచే అవకాశం ఉందని మాజీ క్రికెటర్లతో పాటు సెలెక్టర్లు భావించారు. ఫామ్ లేమితో వారి ఆశలను అయ్యర్ వమ్ము చేశాడు. శ్రేయస్ అయ్యర్ను పక్కనపెట్టిన సెలెక్టర్లు సర్ఫరాజ్ ఖాన్కు ఎంపికచేశారు. అరంగేట్రం టెస్ట్లోనే రెండు హాఫ్ సెంచరీలతో సర్ఫరాజ్ అదరగొట్టాడు.