Shoaib Akthar: టీమిండియా ఓటమి.. వారికి ఊరట: పాక్ మాజీ పేసర్ అక్తర్ వ్యాఖ్యలు
16 September 2023, 16:12 IST
- Shoaib Akthar: బంగ్లాదేశ్పై టీమిండియా ఓటమిపై పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ మాట్లాడాడు. ఈ పరాజయం టీమిండియాకు మేలుకొలుపు లాంటిదని అన్నాడు. మరిన్ని కామెంట్లు చేశాడు.
షోయబ్ అక్తర్
Shoaib Akthar: ఆసియాకప్ 2023 టోర్నీలో టీమిండియాకు బంగ్లాదేశ్ చేతిలో షాక్ ఎదురైంది. టోర్నీలో ఓటమి లేకుండా ఫైనల్కు చేరిన భారత్ కొలంబోలో శుక్రవారం జరిగిన సూపర్-4 ఆఖరి మ్యాచ్లో బంగ్లా చేతిలో ఆరు పరుగుల తేడాతో పరాజయం పాలైంది. అప్పటికే ఫైనల్ చేరటంతో స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రాకు బంగ్లాదేశ్తో మ్యాచ్కు టీమిండియా మేనేజ్మెంట్ విశ్రాంతి ఇచ్చింది. ఏకంగా తుదిజట్టులో ఐదు మార్పులు చేసి బెంచ్ బలాన్ని పరీక్షించింది. అయితే, శుభ్మన్ గిల్ సెంచరీ చేసినా, అక్షర్ పటేల్ పోరాడినా టీమిండియా గెలువలేకపోయింది.
బంగ్లాదేశ్తో మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 265 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో ఓపెనర్ శుభ్మన్ గిల్ (121) సెంచరీతో ఆకట్టుకున్నా 259 పరుగులకే భారత్ ఆలౌటైంది. కాగా, సూపర్-4లో పాకిస్థాన్ను టీమిండియా 228 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్తో భారత్ పరాజయం పాలయ్యాక తనతో పాటు పాకిస్థాన్ అభిమానులకు ఊరట కలిగిందని పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ అన్నాడు. అలాగే శ్రీలంకతో తుదిపోరుకు ముందు ఈ ఓటమి భారత్కు మేలుకొలుపు లాంటిదని తన యూట్యూబ్ ఛానెల్లో చెప్పాడు.
“ఇండియా మ్యాచ్ ఓడిపోయింది. ఇది కలవరపాటుకు గురి చేసే ఓటమే. బంగ్లాదేశ్ కూడా బాగా ఆడడానికే వచ్చింది. అందుకే ఈ పరజయాన్ని మరీ ఎక్కువగా విమర్శించాల్సిన అవసరం లేదు. పాకిస్థాన్ ఓడిపోయిందని (భారత్, శ్రీలంక చేతిలో) చాలా మంది విమర్శిస్తున్నారు. శ్రీలంక కూడా మంచి టీమ్. బంగ్లాదేశ్కు కూడా ఇదే వర్తిస్తుంది. వాళ్లందరూ అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నారు. చివరగా.. ఇండియా మ్యాచ్ ఓడిపోటంతో నాతో పాటు పాకిస్థాన్ అభిమానులకు కాస్త ఊరట కలిగింది” అని అక్తర్ అన్నాడు. అయితే, నవ్వుతూ ఈ వ్యాఖ్య చేయటంతో ఆయన సరదా అన్నట్టు అర్థం చేసుకోవచ్చు.
ఆసియాకప్ సూపర్-4లో తొలుత బంగ్లాదేశ్పై గెలిచిన పాకిస్థాన్.. టీమిండియా, శ్రీలంక చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. పాకిస్థాన్, శ్రీలంకను ఓడించిన టీమిండియా ఆసియాకప్ ఫైనల్ చేరింది. అయితే, నామమాత్రమైన మ్యాచ్లో బంగ్లాదేశ్ చేతిలో ఇండియా కాస్తలో పరాజయం చెందింది. కాగా, ఆసియాకప్ ఫైనల్లో టైటిల్ కోసం భారత్, శ్రీలంక రేపు (సెప్టెంబర్ 17, ఆదివారం) తలపడనున్నాయి. ఈ తరుణంలో బంగ్లాపై ఓటమి భారత్కు మేలుకొలుపు లాంటిదని అక్తర్ అన్నాడు. ఏ జట్టును తేలిగ్గా తీసుకోకూడదని చెప్పాడు.
“ఫైనల్కు ముందు టీమిండియా ఇది వేకప్ కాల్. కొన్ని మ్యాచ్లు గెలిచాం కదా అని.. ఏ జట్టును తేలికగా తీసుకోకూడదు” అని అక్తర్ అన్నాడు. వన్డే ప్రపంచకప్లో ఫేవరెట్ ఏ జట్టో స్పష్టంగా చెప్పలేమని అక్తర్ అన్నాడు.
టాపిక్