INDW vs AUSW: విజృంభించిన టీమిండియా.. ఆస్ట్రేలియాపై ఘన విజయం
05 January 2024, 22:14 IST
- INDW vs AUSW 1st T20: ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్లో భారత మహిళల జట్టు అదిరే ఆరంభాన్ని అందుకుంది. అన్ని విభాగాల్లో సత్తాచాటి.. ఘన విజయాన్ని దక్కించుకుంది. సిరీస్లో 1-0తో ముందడుగు వేసింది హర్మన్ప్రీత్ సేన. వివరాలివే..
INDW vs AUSW: విజృంభించిన టీమిండియా.. ఆస్ట్రేలియాపై ఘన విజయం
INDW vs AUSW 1st T20: వన్డే సిరీస్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైన భారత మహిళల జట్టు.. టీ20 సిరీస్లో అద్భుత ఆరంభాన్ని అందుకుంది. తొలి టీ20లో విజృంభించిన టీమిండియా ఆసీస్ను చిత్తు చేసి ఘన విజయాన్ని సాధించింది. మూడు టీ20 సిరీస్లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో నేడు (జనవరి 5) జరిగిన తొలి టీ20లో భారత మహిళల జట్టు 9 వికెట్ల తేడాతో 14 బంతులు మిగిల్చి ఆస్ట్రేలియాపై గ్రాండ్గా గెలిచింది.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 19.2 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌటైంది. ఫోయిబే లిచ్ఫీల్డ్ (49), ఎలీస్ పెర్రీ (37) మినహా మిగిలిన ఆసీస్ బ్యాటర్లు విఫలమయ్యారు. భారత బౌలర్ టిటాస్ సంధు నాలుగు వికెట్లతో సత్తాచాటారు. 4 ఓవర్లు వేసిన సంధు.. కేవలం 17 పరుగులే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టి.. ఆస్ట్రేలియాను దెబ్బ తీశారు. శ్రేయాంక పాటిల్, దీప్తి శర్మ చెరో రెండు తీయగా.. అమన్జోత్ కౌర్, రేణుకా సింగ్ చెరో వికెట్ తీసుకున్నారు.
చివరి ఐదు ఓవర్లలో వరుసగా వికెట్లు తీసి ఆసీస్ను భారత బౌలర్లు కట్టడి చేశారు. చివరి ఐదు ఓవర్లలో టపటపా వికెట్లు కూల్చారు. ఓ దశలో 112 పరుగులకు 5 వికెట్ల వద్ద ఉన్న ఆసీస్.. చివరికి 19.2 ఓవర్లలో 141 పరుగులకే కుప్పకూలింది.
మోస్తరు టార్గెట్ను టీమిండియా సునాయసంగా ఛేదించింది. 17.4 ఓవర్లలోనే కేవలం ఒక వికెట్ కోల్పోయి 145 పరుగులు చేసి గెలిచింది టీమిండియా. భారత్ యంగ్ ఓపెనర్ షెఫాలీ వర్మ (44 బంతుల్లో 64 పరుగులు; నాటౌట్) మెరుపు అజేయ అర్ధ శతకం చేయగా.. స్మృతి మంధన (52 బంతుల్లో 54 పరుగులు) హాఫ్ సెంచరీతో సత్తాచాటారు. ఆస్ట్రేలియా బౌలర్లలో జార్జియా వారెహామ్ ఆ ఒక్క వికెట్ దక్కించుకున్నారు.
రఫ్ఫాడించిన షెఫాలీ, స్మృతి
లక్ష్యఛేదనలో భారత ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలీ వర్మ ఆరంభం నుంచే దూకుడుగా ఆడారు. బౌండరీలతో చెలరేగారు. వన్డే సిరీస్ కసినంతా కూడగట్టుకొని ఆస్ట్రేలియా బౌలర్లను బాదేశారు. దీంతో ఆరు ఓవర్లలోనే వికెట్ కోల్పోకుండా 59 పరుగులు చేసింది భారత్. ఆ తర్వాత కూడా అదే జోరు కొనసాగించారు. ముఖ్యంగా షెఫాలీ వర్మ దూకుడుగా ఆడారు.
ఓపెనర్ల దూకుడుతో 11.2 ఓవర్లలోనే భారత్ స్కోరు 100 పరుగులకు చేరింది. షెఫాలీ వర్మ 32 బంతుల్లోనే హాఫ్ సెంచరీకి చేరుకుంది. స్మృతి మంధాన 50 బంతుల్లో అర్ధ శతకం చేశారు. అయితే, కాసేపటికే 16వ ఓవర్లో స్మృతి ఔటయ్యారు. తొలి వికెట్కు షెఫాలీ, స్మృతి 137 పరుగుల భాగస్వామ్యం జతచేశారు. గెలుపు సమీపించిన సమయంలో స్మృతి ఔటయ్యారు. షెఫాలీ చివరి వరకు నిలిచి, జట్టును గెలుపు తీరాన్ని దాటించారు. చివర్లో షెఫాలీకి జెమీమా రోడ్రిగ్స్ (6 నాటౌట్) సహకరించారు.
భారత్, ఆస్ట్రేలియా మహిళల జట్ల మధ్య రెండో టీ20 ఆదివారం (జనవరి 7) డీవై పాటిల్ స్టేడియంలోనే జరగనుంది.
టాపిక్