IND vs SA: రాహుల్ ద్రవిడ్ నిర్ణయాన్ని తప్పుబట్టిన టీమిండియా మాజీ ప్లేయర్
25 December 2023, 14:22 IST
- IND vs SA Test Series: భారత్, దక్షిణాఫ్రికా మధ్య టెస్టు సిరీస్ రేపు (డిసెంబర్ 26) మొదలుకానుంది. సెంచూరియన్లో తొలి టెస్టు జరగనుంది. ఈ సందర్భంగా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఓ నిర్ణయాన్ని చెప్పగా.. ఓ మాజీ ఆటగాడు అసంతృప్తి వ్యక్తం చేశారు.
రాహుల్ ద్రవిడ్
IND vs SA Test Series: దక్షిణాఫ్రికాతో భారత్ టెస్టు సిరీస్కు రెడీ అయింది. సెంచూరియన్ వేదికగా భారత్, ఆతిథ్య దక్షిణాఫ్రికా మధ్య రేపు (డిసెంబర్ 26) తొలి టెస్టు మొదలుకానుంది. అయితే, పేస్కు సహకరించే సెంచూరియన్ పిచ్పై తుది జట్టు ఎలా ఉండాలనే కసరత్తును టీమిండియా మేనేజ్మెంట్ తీవ్రంగా చేస్తోంది. ఈ సందర్భంగా ఈ సిరీస్లో తమ ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్ గురించి భారత హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ చెప్పారు.
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్లో కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ చేస్తాడని రాహుల్ ద్రవిడ్ వెల్లడించారు. ఇషాన్ కిషన్ ఈ సిరీస్ నుంచి తప్పుకోవటంతో కేఎస్ భరత్ను బీసీసీఐ ఎంపిక చేసింది. అయితే, భరత్కు ఫస్ట్ టెస్టులో ఛాన్స్ లేదన్నట్టుగా రాహుల్ చెప్పారు. కేఎల్ రాహుల్ వైపే మొగ్గుచూపుతున్నట్టు వెల్లడించారు. అయితే, ఈ విషయంపై భారత మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ స్పందించారు. రంజీ ట్రోఫీలు, ఫస్ట్ క్లాస్ క్రికెట్లో వికెట్ కీపింగ్ చేసిన వారే భారత టెస్టు జట్టులో కీపింగ్ చేస్తే బెస్ట్ అనేలా ట్వీట్ చేశారు.
“రంజీ ట్రోఫీలు, ఫస్ట్ క్లాస్ క్రికెట్లో రెగ్యులర్గా కీపింగ్ చేసే వారే.. భారత టెస్టు మ్యాచ్ల్లో వికెట్ కీపింగ్ చేయాలి” అని పార్థివ్ ట్వీట్ చేశారు. కేఎల్ రాహుల్ను టెస్టు మ్యాచ్ల్లో కీపింగ్ చేయించయం సరికాదనేలా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
భారత్ తరఫున వన్డేలు, టీ20ల్లో వికెట్ కీపింగ్ చేసిన కేఎల్ రాహుల్ మాత్రం.. టెస్టుల్లో ఇప్పటి వరకు కీపింగ్ బాధ్యతలను నిర్వర్తించలేదు. రాహుల్ ద్రవిడ్ వ్యాఖ్యలను బట్టి చూస్తే.. దక్షిణాఫ్రికాతో తొలి టెస్టుతోనే రెడ్ బాల్ క్రికెట్లో తొలిసారి కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. టీ20లు, వన్డేలతో పోలిస్తే సుదీర్ఘంగా సాగే టెస్టుల్లో వికెట్ కీపింగ్ చాలా సవాలుతో ఉంటుంది. అందుకే రెగ్యులర్ ఫస్ట్ క్లాస్ వికెట్ కీపర్ బెస్ట్ అనేలా పార్థివ్ అన్నారు.
వన్డేల్లో అద్భుతంగా వికెట్ కీపింగ్ చేసిన కేఎల్ రాహుల్పై తమకు నమ్మకం ఉందని, అందుకే అతడే ఈ టెస్టు సిరీస్లో ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్ అని ద్రవిడ్ చెప్పారు. ఆరు నెలలుగా కీపింగ్పై అతడు ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు.
భారత్, దక్షిణాఫ్రికా మధ్య రెండు టెస్టుల సిరీస్ జరగనుంది. ఈ పర్యటనలో టీ20లు, వన్డేలకు విశ్రాంతి తీసుకున్న రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ.. టెస్టు సిరీస్ ఆడనున్నారు. టీమిండియాకు సారథ్యం వహించనున్నారు.