IND vs SA 3rd Odi: బ్యాటింగ్లో సంజూ, బౌలింగ్లో అర్షదీప్ జిగేల్ - మూడో వన్డేలో టీమిండియా విజయం - సిరీస్ సొంతం
22 December 2023, 7:16 IST
IND vs SA 3rd Odi: సంజూ శాంసన్ సెంచరీ, అర్షదీప్ సింగ్ బౌలింగ్ మెరుపులతో మూడో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్ను 2-1తో సొంతం చేసుకున్నది.
ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా
IND vs SA 3rd Odi: మూడో వన్డేలో సౌతాఫ్రికాను చిత్తు చేసిన కేఎల్ రాహుల్ సేన వన్డే సిరీస్ను కైవసం చేసుకున్నది. మూడో వన్డేలో 78 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 296 పరుగులు చేయడగా లక్ష్యఛేదనలో తడబడిన సౌతాఫ్రికా 45.5 ఓవర్లలో 218 పరుగులకే ఆలౌటైంది.
హెండ్రిక్స్, టోనీ జోర్జీ మెరుపులతో లక్ష్యఛేదనను ధాటిగానే ఆరంభించింది సౌతాఫ్రికా. హెండ్రిక్స్, వాండర్ డుసెస్ తొందరగానే ఔటైనా కెప్టెన్ మార్క్రమ్తో కలిసి జోర్జీ సౌతాఫ్రికాను గట్టెక్కించే ప్రయత్నం చేశాడు. ఫోర్లు, సిక్సర్లతో టీమిండియా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. ప్రమాదకరంగా మారిన ఈ జోడిని వాషింగ్టన్ సుందర్ విడదీశాడు. కెప్టెన్ మార్క్రమ్ను ఔట్ చేసి టీమిండియాకు బ్రేకిచ్చాడు. 41 బాల్స్లో ఒక సిక్సర్, రెండు ఫోర్లతో 36 రన్స్ చేశాడు మార్క్రమ్. అతడు ఔట్ తర్వాత సౌతాఫ్రికా వికెట్ల పతనం ఆరంభమైంది.
జోర్జీ ఒంటరి పోరాటం...
ఓ వైపు వికెట్లు పడుతోన్న జోర్జీ మాత్రం పట్టుదలగా క్రీజులో నిలదొక్కుకుంటూ భారీ షాట్లతో టీమిండియాను కలవరపెట్టాడు. సెంచరీకి చేరువైన అతడిని అర్షదీప్ సింగ్ ఔట్ చేశాడు. 87 బాల్స్లో ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లతో టోనీ జోర్జీ 81 రన్స్ చేశాడు. జోర్జీ పెవిలియన్ చేచడంతో సౌతాఫ్రికా ఓటమి ఖాయమైంది.
టీమిండియా బౌలర్లలో అర్షదీప్ సింగ్ తొమ్మిది ఓవర్లు వేసి 30 రన్స్ మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీసుకున్నాడు. ఆవేశ్ ఖాన్, సుందర్ తలో రెండు వికెట్లు తీయగా...అక్షర్ పటేల్, ముఖేష్ కుమార్లకు ఒక్కో వికెట్ దక్కింది.
సంజూ శాంసన్ సూపర్ సెంచరీ...
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా యాభై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. సంజూ శాంసన్ (108 రన్స్) వన్డేల్లో తొలి సెంచరీతో ఆకట్టుకున్నాడు. తిలక్ వర్మ 52 రన్స్, రింకు సింగ్ 38 రన్స్తో రాణించడంతో టీమిండియా భారీ స్కోరు చేసింది.
సిరీస్ సొంతం...
మూడు వన్డేల సిరీస్ను టీమిండియా 2-1తో సొంతం చేసుకున్నది. టీ20 సిరీస్ను సమం చేసిన సౌతాఫ్రికా వన్డేల్లో మాత్రం టీమిండియాను ఓడించలేకపోయింది. సెంచరీ హీరో సంజూ శాంసన్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కగా...ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ను అర్షదీప్ సింగ్ సొంతం చేసుకున్నాడు.