Ashwin: ఇంగ్లండ్ మ్యాచ్లో సిరాజ్ను తప్పించి అశ్విన్ను ఆడించాలి - హార్భజన్ సూచన
26 October 2023, 12:44 IST
Ashwin: వరల్డ్ కప్లో తదుపరి మ్యాచ్లో ఇంగ్లండ్తో తలపడనుంది టీమిండియా. ఈ మ్యాచ్లో ముగ్గురు స్పిన్నర్లతో టీమిండియా బరిలో దిగితే మంచిదని టీమిండియా మాజీ స్పిన్నర్ హార్భజన్ సింగ్ సలహా ఇచ్చాడు.
అశ్విన్
Ashwin: వరల్డ్ కప్లో బ్యాక్ టూ బ్యాక్ విక్టరీలతో ఓటమి లేని జట్టుగా టీమ్ ఇండియా దూసుకుపోతుంది. ఐదు విజయాలతో పది పాయింట్లు సొంతం చేసుకున్న టీమ్ ఇండియా పాయింట్స్ టేబుల్లో టాప్ ప్లేస్లో కొనసాగుతోంది. టీమిండియా తన తదుపరి మ్యాచ్లో ఇంగ్లండ్తో తలపడనుంది. అక్టోబర్ 29న ఆదివారం లక్నోవేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. మరోవైపు ఇప్పటివరకు నాలుగు మ్యాచ్లు ఆడిన ఇంగ్లండ్ కేవలం ఒకే ఒక విజయంతో పాయింట్స్ టేబుల్లో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది.
ఇంగ్లండ్పై ఘన విజయం సాధించి సెమీస్ బెర్త్ను దాదాపు ఖాయం చేసుకోవాలనే పట్టుదలతో టీమిండియా బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్లో టీమిండియా కూర్పుపై మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
ఇంగ్లాండ్ మ్యాచ్లో టీమిండియా ముగ్గురు స్పిన్నర్లను ఆడిస్తే మంచిదని అన్నాడు. కుల్దీప్ యాదవ్, జడేజాతో పాటు అశ్విన్ను జట్టులోకి తీసుకోవాలని హర్భజన్ సూచించాడు. స్పిన్ బౌలింగ్ను ఎదుర్కోవడంలో ఇంగ్లండ్ తడబాటు చాలా సార్లు నిరూపితమైందని,ఆ బలహీనతను టీమ్ ఇండియా వినియోగించుకోవాలంటే ముగ్గురు స్పిన్నర్లు తప్పకుండా జట్టులో ఉండాలని హర్భజన్ అన్నాడు.
సిరాజ్ కంటిన్యూగా మ్యాచ్లు ఆడుతున్నాడని, ఇంగ్లండ్తో మ్యాచ్కు అతడిని విశ్రాంతినివ్వడం మంచిదని హర్భజన్ తెలిపాడు. ఇంగ్లండ్తో మ్యాచ్లో టీమిండియా మార్పులను సూచిస్తూ హర్భజన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతోన్నాయి.