World Cup 2023: హార్దిక్ వస్తే అతడిని తప్పించాలి.. బౌలర్లను టచ్ చేయొద్దు: టీమిండియాకు అక్తర్ సూచన
31 October 2023, 22:57 IST
- ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియాకు పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ఓ సలహా ఇచ్చాడు. హార్దిక్ పాండ్యా తిరిగి భారత జట్టులోకి వస్తే ఎవరిని తప్పించాలో సూచన చేశాడు.
షోయబ్ అక్తర్
ODI World Cup 2023: స్వదేశంలో ప్రస్తుతం జరుగుతున్న వన్డే ప్రపంచకప్లో టీమిండియా దూసుకుపోతోంది. ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్ల్లోనూ గెలిచి సెమీ ఫైనల్కు అత్యంత సమీపంలో ఉంది. తదుపరి శ్రీలంకతో గురువారం (నవంబర్ 2) తలపడనుంది భారత్. స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం వల్ల గత రెండు మ్యాచ్లుగా టీమిండియాకు దూరమయ్యాడు. అయితే, అతడి స్థానంలో తుది జట్టులోకి వచ్చిన సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ అద్భుత ప్రదర్శన చేశాడు. రెండు మ్యాచ్ల్లో 9 వికెట్లతో అదరగొట్టాడు. కాగా, హార్దిక్ పాండ్యా ఫిట్నెస్ సాధించి మళ్లీ అందుబాటులోకి వస్తే భారత జట్టులో ఎవరిని తప్పించాలో పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ సూచించాడు.
వన్డే ప్రపంచకప్ టైటిల్ గెలిచేందుకు మరో ‘ఐదు మంచి రోజుల’ (ఐదు మ్యాచ్లు) దూరంలో భారత్ ఉందని షోయబ్ అక్తర్ అన్నారు. కాగా, ఇంగ్లండ్పై భారత్ తక్కువ టార్గెట్ను కాపాడుకొని 100 పరుగుల తేడాతో గెలవడంపై ప్రశంసలు కురిపించాడు అక్తర్. తన యూట్యూబ్ చానెల్లో ఈ విషయాలపై మాట్లాడాడు. ముఖ్యంగా భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను ప్రశంసించాడు.
“బ్యాటింగ్తో టీమిండియా గెలుస్తోందని చాలా మంది అంటుంటారు. కానీ, ఇప్పుడు చూడండి. 229 పరుగులను కాపాడుకొని.. ఏకంగా 100 పరుగుల తేడాతో గెలిచింది. ఇది చాలా పెద్ద విషయం. భారత బౌలింగ్కు హ్యాట్సాఫ్. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా.. చాలాచాలా తెలివైన ఫాస్ట్ బౌలర్” అని అక్తర్ అన్నాడు.
ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా టైటిల్ గెలిస్తే టీమిండియా చరిత్ర సృష్టిస్తుందని అక్తర్ చెప్పాడు. “ప్రపంచకప్ టైటిల్ గెలిచేందుకు ఐదు మంచి రోజుల దూరంలో ఇండియా ఉంది. అజేయంగా ఆ జట్టు పైనల్ చేరి.. టైటిల్ గెలిస్తే.. అది ప్రపంచ రికార్డ్ అవుతుంది. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఓ జట్టు ప్రపంచకప్ టైటిల్ గెలువడం నేను ఇప్పటి వరకు చూడలేదు. సెమీఫైనల్, ఫైనల్లో భారత్కు బ్యాడ్ లక్ ఎదురవదని నేను ఆశిస్తున్నా” అని అక్తర్ అన్నాడు.
హార్దిక్ పాండ్యా తిరిగి భారత జట్టులోకి వస్తే.. ఏ బౌలర్ను కూడా తుది జట్టు నుంచి టీమిండియా తప్పించకూడదని అక్తర్ అభిప్రాయపడ్డాడు. బ్యాటింగ్లో ఫామ్లో లేని శ్రేయస్ అయ్యర్ను పక్కన పెట్టాలని అన్నాడు. అలాగే, పూర్తి ఫిట్నెస్ సాధించాకే హార్దిక్ను తీసుకుంటే మేలని చెప్పాడు.
“సగం ఫిట్నెస్ సాధించాక హార్దిక్ పాండ్యాను తీసుకుంటే భారత బౌలింగ్కు అది మంచిది కాదు. ఎందుకంటే ఓ బౌలర్ను డ్రాప్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ హార్దిక్ పాండ్యాను తుది జట్టులోకి తీసుకోవాలంటే.. శ్రేయస్ అయ్యర్ను తుది జట్టు నుంచి తప్పించవచ్చు. బౌలింగ్ యూనిట్ నుంచి మాత్రం ఎవరినీ పక్కనపెట్టకూడదు” అని షోయబ్ అక్తర్ సూచించారు. ఈ ప్రపంచకప్లో శ్రేయస్ అయ్యర్ స్థాయికి తగ్గట్టుగా రాణించడం లేదు. ఇంగ్లండ్తో మ్యాచ్లోనూ 16 బంతుల్లో 4 పరుగులు చేసి.. మరోసారి షార్ట్ బాల్కు ఔటయ్యాడు.
ప్రపంచకప్లో టీమిండియా తదుపరి శ్రీలంకతో నవంబర్ 2వ తేదీన ముంబైలోని వాంఖడే స్టేడియంలో తలపడనుంది. ఈ మ్యాచ్ గెలిస్తే భారత్ సెమీస్ బెర్త్ ఖరారవుతుంది.
టాపిక్