Pakistan Team: పాకిస్థాన్ టీమ్లో విభేదాలు.. కెప్టెన్, స్టార్ పేసర్ మధ్య డ్రెస్సింగ్ రూమ్లో మాటల యుద్ధం!
16 September 2023, 20:40 IST
- Pakistan Team: ఆసియాకప్లో నిష్క్రమణ తర్వాత పాకిస్థాన్ జట్టులో విభేదాలు తలెత్తినట్టు సమాచారం బయటికి వచ్చింది. కెప్టెన్ బాబర్ ఆజమ్, పేసర్ షాహిన్ అఫ్రిది మధ్య మాటల యుద్ధం నడిచినట్టు తెలుస్తోంది
షాహిన్ అఫ్రిది, బాబర్ ఆజమ్
Pakistan Team: ఐసీసీ వన్డే ర్యాంకింగ్ల్లో టాప్ ర్యాంకర్గా ఆసియాకప్ 2023 టోర్నీలో అడుగుపెట్టిన పాకిస్థాన్.. సూపర్-4 దశలోనే నిష్క్రమించింది. పరాజయాలతో టాప్ ర్యాంకును కోల్పోయింది. ఆసియాకప్ సూపర్-4లో టీమిండియా చేతిలో చిత్తుగా ఓడిన పాకిస్థాన్.. ఆ తర్వాత శ్రీలంకతో పరాజయం పాలై టోర్నీ నుంచి ఔట్ అయింది. బాబర్ ఆజమ్ కెప్టెన్సీపై కూడా విమర్శలు వచ్చాయి. కాగా, ఆసియాకప్ నుంచి నిష్క్రమణ తర్వాత పాక్ జట్టులో విభేదాలు బయటపడ్డాయని రిపోర్టులు వస్తున్నాయి. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్, స్టార్ పేసర్ షహిన్ షా అఫ్రిది మధ్య డ్రెస్సింగ్ రూమ్లో మాటల యుద్ధం నడిచినట్టు తెలుస్తోంది. వివరాలివే..
శ్రీలంకతో ఓటమితో ఆసియాకప్ నుంచి నిష్క్రమించాక పాకిస్థాన్ డ్రెస్సింగ్ రూమ్లో మాటల యుద్ధం జరిగినట్టు పాక్ మీడియా బీఓఎల్ న్యూస్ రిపోర్ట్ చేస్తింది. టోర్నీలో సీనియర్లు సరిగా రాణించలేదని కెప్టెన్ బాబర్ ఆజమ్ అనగా.. స్టార్ పేసర్ షహిన్ అఫ్రిది అతడిని అడ్డుకున్నట్టు సమాచారం బయటికి వచ్చింది. “మీరు ఇలానే ఆడితే, మిమ్మల్ని త్వరలోనే మర్చిపోవాల్సి వస్తుంది. ప్రపంచకప్ మీకు లాస్ట్ చాన్స్ అవుతుంది” అని బాబర్ ఆజమ్ అన్నాడని ఆ రిపోర్ట్ తెలిపింది. అయితే, బాబర్ స్పీచ్ను షాహిన్ షా అఫ్రిది మధ్యలో అడ్డుకున్నాడు. “బాగా బౌలింగ్, బ్యాటింగ్ చేసిన వారినైనా కనీసం ప్రశంసించు” అని షాహిన్ అన్నాడట. “ఎవరు మంచి ప్రదర్శన చేస్తున్నారో.. ఎవరు చేయడం లేదో నాకు తెలుసు” అని బాబర్ ఆజమ్ అన్నాడని తెలిసింది.
ఇలా.. కెప్టెన్ బాబర్ ఆజమ్, పేసర్ షాహిన్ అఫ్రిది వాదించుకుంటుండటంతో పాకిస్థాన్ టీమ్ సపోర్టింగ్ స్టాఫ్, ప్లేయర్ మహమ్మద్ రిజ్వాన్ ఆపేందుకు ప్రయత్నించారట. ఆ తర్వాత బాబర్, అఫ్రిది వాదన ఆపారని రిపోర్ట్ వెల్లడించింది.
స్టేడియం నుంచి హోటల్కు వచ్చాక బాబర్ ఆజమ్ చాలా ముభావంగా కనిపించాడని తెలిసింది. ఎవరితోనూ అతడు మాట్లాడలేదని సమాచారం.
ఆసియాకప్ సూపర్-4 కీలక మ్యాచ్లో ఉత్కంఠ పోరులో శ్రీలంకపై పాకిస్థాన్ పరాజయం పాలైంది. వర్షం ప్రభావం వల్ల మ్యాచ్ను 42 ఓవర్లకు కుదించారు అంపైర్లు. ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 7 వికెట్లకు 252 పరుగులు చేసింది. డక్ వర్త్ లూయిస్ పద్దతిలో రెండు వికెట్ల తేడాతో శ్రీలంక గెలిచింది. చివరి బంతికి విజయం సాధించింది. చివరి రెండు బంతులకు ఆరు పరుగులు కావాల్సి ఉండగా.. లంక ప్లేయర్ చరిత్ అసలంక ఫోర్, ఆ తర్వాత రెండు రన్స్ తీశాడు. దీంతో శ్రీలంక గెలిచింది. సూపర్-4లో రెండో పరాజయంతో ఆసియాకప్ టోర్నీ నుంచి పాకిస్థాన్ నిష్క్రమించింది.