Budget 2023: ఇల్లు నిర్మించుకోవాలనుకునే వారికి కేంద్రం గుడ్న్యూస్.. నిధుల కేటాయింపులో భారీ పెంపు
01 February 2023, 12:21 IST
- Budget 2023 live updates : 2023-24 కేంద్ర బడ్జెట్ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ప్రభుత్వ ప్రాధాన్యతలను వెల్లడించారు.
నిర్మలా సీతారామన్
Budget 2023 live updates : ప్రధాన మంత్రి అవాస్ యోజన (PM Awas Yojana)కు నిధుల కేటాయింపును కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.79,000 కోట్లను కేటాయించింది. ఈ విషయాన్ని పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ (Union Budget) ప్రసంగంలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ప్రకటించారు. గతేడాది బడ్జెట్లో రూ.48,000 కోట్ల కేటాయించగా.. ఈసారి ఏకంగా 66 శాతం నిధులను కేంద్రం అధికం చేసింది. ఏకంగా రూ.79వేల కోట్లను ప్రధాన మంత్రి అవాస్ యోజనకు కేటాయించింది. దీంతో ఇల్లు కట్టుకోవాలని, కొనుగోలు చేయాలని వేచిచూస్తున్న దేశ ప్రజలకు లబ్ధి చేకూరనుంది. అలాగే ఏడు రంగాలకు ఈ బడ్జెట్లో అధిక ప్రాధాన్యతనిస్తున్నామంటూ.. సప్త్రిషి (Saptrishi)ని ప్రకటించారు నిర్మలా సీతారామన్.
నిర్మలమ్మ చెప్పిన ఏడు రంగాలివే..
ప్రపంచమంతా భారత దేశంవైపే చూస్తోందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అమృతకాలంలో తొలి బడ్జెట్ను అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా రూపొందించినట్టు వెల్లడించారు. బడ్జెట్ 2023లో ప్రధానంగా ఏడు రంగాలకు ప్రాధాన్యతనిచ్చామని స్పష్టం చేశారు. ఈ ఏడింటిని సంయుక్తంగా సప్త్రిషి (Saptrishi)గా అభివర్ణించారు. ఆర్థిక సాధికారత, యువతకు ఉద్యోగాల కల్పనతో పాటు ముఖ్యమైన రంగాలు ఆ ఏడింటిలో ఉన్నాయి. వారి జాబితా ఇదే..
- సమ్మిళిత అభివృద్ధి
- చివరి మైలు వరకు చేరుకోవడం (అందరికీ ప్రయోజనాలు)
- మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు
- పూర్తి సామర్థ్యాన్ని వినియోగించడం
- హరితవృద్ధి (గ్రీన్ గ్రోత్)
- యువ శక్తి
- ఆర్థిక రంగం
ఈ ఏడు రంగాలను తాము ఈ బడ్జెట్లో ప్రాధాన్యతగా తీసుకున్నామని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. దేశ ప్రజల ఆర్థిక సాధికారతను గణనీయంగా పెంచేందుకు ఈ అమృత కాలాన్ని వినియోగించుకుంటామని స్పష్టం చేశారు.
ఈ ఏడు రంగాల గురించి బడ్జెట్ ప్రసంగంలో వివరంగా చెప్పారు నిర్మలా సీతారామన్. దేశ ప్రజలందరికీ ప్రయోజనాలు అందించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈశాన్య రాష్ట్రాలు, జమ్ము కశ్మీర్ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.
2023-24 ఆర్థిక బడ్జెట్లో రైల్వే కేటాయింపులు గణనీయంగా పెరిగాయి. రూ.2.40లక్షల నిధులను కేంద్ర కేటాయించింది. 2013-14తో పోలిస్తే ఇది 9 రెట్లు అధికమని నిర్మలా సీతారామన్ చెప్పారు.