MP Vijaya Sai Reddy : తెలంగాణ తరహాలోనే టీడీపీ జెండా ఆంధ్రాలో కూడా పీకేశారా..?
19 November 2023, 11:01 IST
- MP Vijaya Sai Reddy On TDP : తెలుగుదేశం పార్టీపై సెటైర్లు విసిరారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. తెలంగాణ తరహాలోనే టీడీపీ జెండా ఆంధ్రాలో కూడా పీకేశారా…? అంటూ ట్వీట్ చేశారు.
ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు
YSRCP MP Vijaya Sai Reddy On TDP : కొద్దిరోజులుగా బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరిని తెగ టార్గెట్ చేస్తున్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. తెలుగుదేశం పార్టీకి ముడిపెడుతూ…. విమర్శనాస్త్రాలను సంధిస్తున్నారు. సమయం, సందర్భాన్ని బట్టి…. ఇరుకున పెట్టేలా ట్వీట్లు చేస్తున్నారు. తాజాగా మరోసారి తెలుగుదేశం పార్టీతో పాటు పురందేశ్వరిని విమర్శలు గుప్పించారు విజయసాయిరెడ్డి. తెలంగాణ తరహాలోనే టీడీపీ జెండా ఆంధ్రాలో కూడా పీకేశారా? లేక టీడీపీ భారమంతా పురంధేశ్వరిపైనే పెట్టారా? అంటూ ట్వీట్ చేశారు.
“చంద్రబాబుకు అనారోగ్యం - బెయిల్ షరతులు సరే. పార్టీలో లోకేష్ - భువనేశ్వరి గారు అందరూ ఏమయ్యారు? ఇక టీడీపీ పనైపోయిందని నిర్ధారణకు వచ్చారా! తెలంగాణ తరహాలోనే టీడీపీ జెండా ఆంధ్రాలో కూడా పీకేశారా? లేక టీడీపీ భారమంతా పురంధేశ్వరిపైనే పెట్టారా? ఆమె సొంత పార్టీ బీజేపీని ముంచడంలో దిట్ట కావచ్చేమో కానీ బావ గారి పార్టీ టీడీపీని బతికించడంలో కాదు సుమా!” అంటూ సైటెర్లు విసిరారు ఎంపీ విజయసాయిరెడ్డి.
“బిజెపి అభ్యర్థిగా పురంధేశ్వరి గారు 2019లో విశాఖపట్నం లోక్ సభ స్థానంలో సాధించిన ఓట్లు చూస్తే కళ్లు తిరిగి కింద పడిపోవాల్సిందే. మేడంకు NOTAకు పడిన ఓట్ల కంటే కొద్దిగా ఎక్కువ వచ్చాయి. 33,892 ఓట్లు మాత్రమే రావడంతో డిపాజిట్ కోల్పోయారు. అయినా రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలిగా నియమించి బిజెపి పెద్ద సాహసమే చేసింది” అంటూ తన పోస్టులో రాసుకొచ్చారు ఎంపీ విజయసాయిరెడ్డి.
ప్రతి పేదవాడు ఇది మా ప్రభుత్వమని చెప్పుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి పాలన సాగుతోందని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూములపై పేదలకు సర్వహక్కులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కల్పిస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ పదాలకు అర్థం చెబుతూ 34 లక్షల ఎకరాలకు పైగా పేదలకు హక్కులను కల్పిస్తున్నారని చెప్పారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ) గ్రాఫిక్స్ దుర్వినియోగం ద్వారా దేశంలోని కొంతమంది ప్రముఖ వ్యక్తులు టార్గెట్ అవుతున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే దీనిపై దృష్టి సారించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దుర్వినియోగం కారణంగా దేశంలోని భద్రతా సంస్థల ముందు కొత్త సవాళ్లు తలెత్తాయనడంలో సందేహం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సవాళ్లను ఎదుర్కోవాలంటే మనం సిద్దంగా ఉండాలన్నారు. ఏఐ ఆధునిక గ్రాఫిక్ టెక్నాలజీలను తప్పుగా, చట్టవిరుద్ధంగా ఉపయోగించడం ద్వారా అనైతిక నేరపూరిత కార్యకలాపాలకు పాల్పడుతూనే ఉంటారని ఆందోళన వ్యక్తం చేశారు.