MP Vijaya Sai Reddy : పురందేశ్వరి గారు... మీరు ముడుపులు తీసుకున్నది నిజం కాదా..? సీబీఐ విచారణకు సిద్ధమేనా..?
04 November 2023, 7:08 IST
- Vijaya Sai Reddy Vs Purandeswari : : బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరిని మరోసారి టార్గెట్ చేశారు ఎంపీ విజయసాయిరెడ్డి. ఓ విమానయాన సంస్థ అమ్మకం విషయంలో ముడుపులు తీసుకున్నది నిజం కాదా అని ప్రశ్నించారు.నిజాయితీని నిరూపించుకోవడానికి సీబీఐ విచారణకు సిద్ధమేనా..? అని సవాల్ విసిరారు.
ఎంపీ విజయసాయిరెడ్డి సవాల్
Vijaya Sai Reddy Vs Purandeswari : గత కొంతకాలంగా పురందేశ్వరి వర్సెస్ వైసీపీ అన్నట్టు మధ్య మాటల యుద్దం సాగుతున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు అరెస్ట్ నాటి నుంచి పురందేశ్వరిపై విమర్శలు గుప్పిస్తున్న విజయసాయిరెడ్డి… తాజాగా పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ఏకంగా ఓ సంస్థ అమ్మకం విషయంలో పురందేశ్వరి ముడుపులు తీసుకున్నారంటూ ఆరోపించారు. దానిపై సీబీఐ విచారణ సిద్ధమా అని ప్రశ్నించారు. 'X' (ట్విట్టర్) వేదికగా పురందేశ్వరికి పలు ప్రశ్నలను సంధించారు విజయసాయిరెడ్డి.
విజయసాయిరెడ్డి ఏమన్నారంటే..?
1 - పురందేశ్వరి పదవుల కోసం బీజేపీలోచేరి ఆ పార్టీని టీడీపీకి తాకట్టు పెట్టడానికి పనిచేస్తున్నారే కానీ ఆమెకు తన పార్టీపై ప్రేమ, అభిమానం లేవు. మొదట టీడీపీ..తర్వాత ఎన్టీఆర్ టీడీపీ, తర్వాత బీజేపీ, మళ్లీ కాంగ్రెస్...మళ్లీ బీజేపీ...ఇలా వరుసగా నాలుగుసార్లు పార్టీలు మారిన చరిత్ర పురందేశ్వరిది.
2 - బీజేపీలో చేరిన తర్వాతైనా ఆమె వల్ల ఒక్క ఓటు అయినా అదనంగా పార్టీకి వచ్చిందా అంటే...ఇంకా పార్టీ ఓట్లను టీడీపీకి మళ్లించారనే చెప్పాల్సి ఉంటుంది.
3 - ఎయిర్ ఇండియా ఇండిపెండెంట్ డైరెక్టర్ గా కేంద్రంలో ఒక బాధ్యతయతమైన పదవిలో ఉండి ఆ విమానయాన సంస్థ అమ్మకం విషయంలో మీరు మధ్యవర్తంచేసి ఆ సంస్థ నుంచి ముడుపులు తీసుకున్నది వాస్తవం కాదా? మీ నిజాయితీని నిరూపించుకోవడానికి సిబిఐ విచారణకు సిద్ధమేనా? ఆ మేరకు కేంద్రానికి రాయగలరా..?
4 - ఏపీలో మద్యం స్కాం అంటూ ఆరోపణలు చేసి, మీరు, మీ కుటుంబసభ్యులు మద్యం సిండికేట్ బ్రోకర్లతో మీ భర్త వెంకటేశ్వరరావు గారు, మీ కుమారుడు హితేష్, గీతం భరత్ బేరాలాడి ముడుపులు తీసుకున్నది నిజం కాదా ?హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్ట్రిక్ట్ లో అత్యంత ఖరీదైన విల్లాను ఎలా నిర్మిస్తున్నారు? ఆ విల్లాకు సొమ్ములు పెడుతున్నది ఎవరు?" అని పురందేశ్వరిని ప్రశ్నించారు ఎంపీ విజయసాయిరెడ్డి.
ఏపీలో మద్యం సరఫరా పేరుతో దందా చేస్తున్నారంటూ ఇటీవలే పురందేశ్వరి ఆరోపించారు. అదాన్ అనే కంపెనీ వెనుక ఎంపీ విజయసాయి రెడ్డి ఉన్నారని అన్నారు. ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పోరేషన్ లో వందకు పైగా కంపెనీలు రిజిస్టర్ అయ్యాయని చెప్పారు. వీటిలో 16 కంపెనీల ద్వారానే 74 శాతం మద్యం సేకరణ జరుగుతుందని అన్నారు. అదాన్ డిస్టలరీస్ 2019 లో హైదరాబాద్ సాగర్ సొసైటీ ప్లాట్ నెంబర్ 16 నుంచి లో ప్రారంభించారన్నారు. ఈ అదాన్ కంపెనీకి 1,160కోట్ల కేటాయింపు జరిగిందని వివరించారు. ఆదాన్ డిస్లరీస్ వెనుక విజయసాయిరెడ్డి ఉన్నట్లు మాకు సమాచారం ఉందని తెలిపారు.ఎస్పీవై అగ్రస్ సంస్థకు రూ. 1800 కోట్ల మేర సరఫరా ఆర్డర్స్ ఉన్నాయని, ఈ సంస్థ వెనుక మిధున్ రెడ్డిఉన్నారని పురంధరేశ్వరి ఆరోపించారు. ఈ వ్యాఖ్యలకు కూడా కొద్దిరోజుల కిందటే విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఆరోపణలు చేసే ముందు పురంధేశ్వరి ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని హితవు పలికారు. ఏ మాత్రం సంబంధంలేని ఇద్దరు వ్యక్తులపై పురంధేశ్వరి ఆరోపణలు చేయడం తగదన్నారు. లిక్కర్ విషయంలో ఆధారాలు లేకుండా తనపై, విథున్రెడ్డిపై విమర్శలు చేయడమేంటని నిలదీశారు. ఇదిలా ఉండగానే… పురందేశ్వరి టార్గెట్ గా విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.