YV Subbareddy On BJP : టీడీపీ ట్రాప్ లో పడిన బీజేపీ, అమిత్ షా మాట్లాడింది టీడీపీ స్క్రిప్టే- వైవీ సుబ్బారెడ్డి
12 June 2023, 15:39 IST
- YV Subbareddy On BJP : బీజేపీ టీడీపీ ట్రాప్ లో పడిందని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. అమిత్ షా టీడీపీ నేతల మాటలనే నిన్న సభలో చెప్పారని విమర్శించారు.
వైవీ సుబ్బారెడ్డి
YV Subbareddy On BJP : ఏపీ రాజకీయాలు మళ్లీ హీటెక్కాయి. దిల్లీ నుంచి వచ్చిన బీజేపీ పెద్దలు ఏపీలో బహిరంగ సభల్లో పాల్గొంటూ.. సీఎం జగన్ ను టార్గెట్ చేశారు. దేశంలోనే మోస్ట్ అవినీతి ప్రభుత్వం వైసీపీదని విమర్శలు చేశారు. తాజాగా సీఎం జగన్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ బీజేపీ అండదండలు ఏపీకి అవసరంలేదన్నారు. బీజేపీ నేతల విమర్శలపై స్పందించిన వైసీపీ నేత, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి... బీజేపీ టీడీపీ ట్రాప్ లో పడిందన్నారు. సోమవారం విశాఖపట్నంలో పర్యటించిన ఆయన మీడియాలో మాట్లాడుతూ...టీడీపీ నేతల మాటలనే కేంద్ర హోంమంత్రి అమిత్షా ఆదివారం బీజేపీ సభలో చెప్పారన్నారు. అమిత్షా సభా వేదికపై ఉన్నవారంతా టీడీపీ నేతలే అని విమర్శించారు. వాళ్లంతా టీడీపీ నుంచి బీజేపీకి జంప్ అయిన నేతలే అని సుబ్బారెడ్డి అన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ పై ఎందుకు మాట్లాడలేదు?
2014-19 వరకు టీడీపీతో అంటకాగిన బీజేపీ... టీడీపీ ప్రభుత్వ అవినీతిలో భాగస్వామే అన్నారు. విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణపై అమిత్ షా ఎందుకు మాట్లాడలేదని అంటూ వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. విశాఖ నగరానికి వచ్చిన అమిత్ షా ఈ ప్రాంతం గురించి ఒక్క మాట కూడా చెప్పకపోవడం దారుణమని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. గతంలో ఏపీ ఇచ్చిన హామీలలో ఏం నెరవేర్చారో దానికి అమిత్ షా సమాధానం చెప్తే సంతోషించేవాళ్లమని వైవీ సుబ్బారెడ్డి అన్నారు.
సీఎం జగన్ కూడా
పల్నాడులో జగనన్న విద్యా కానుక పంపిణీ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సభలో సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు బీజేపీ అండదండలు లేకపోవచన్నారు. ఏపీలో సామాజిక అన్యాయానికి, సామాజిక న్యాయానికి మధ్య యుద్ధం జరుగుతోందన్నారు. గతంలో ఇదే బడ్జెట్లో చేసిన స్కాములకు, వైసీపీ అందిస్తున్న స్కీములకు మధ్య జరుగుతున్న యుద్ధం అన్నారు. ఎల్లో మీడియా విష ప్రచారాలకు, ఇంటింటికి కల్పించిన మంచి పనులకు మధ్య యుద్ధం అన్నారు. ఈ కురుక్షేత్ర మహా సంగ్రామం, పేదలకు పెత్తందారులకు మధ్య జరుగుతోందన్నారు. తనకు బాబు మాదిరి దత్తపుత్రుడి అండదండలు లేవని, జగన్కు బీజేపీ అండగా ఉండకపోవచ్చని, జగన్ వీళ్లెవరిని నమ్ముకోలేదని దేవుని ఆశీస్సులు, ప్రజల చల్లని దీవెనలు మాత్రమే నమ్ముకున్నానన్నారు. ప్రజలకు చేసిన మంచిని మాత్రమే నమ్ముకున్నానని, దుష్ప్రచారాలు నమ్మొద్దని, ఇంట్లో మంచి జరిగిందో లేదో మాత్రమే పరిగణలోకి తీసుకోవాలన్నారు. ఇంట్లో మంచి జరిగితే మీరే సైనికుల్లా వైసీపీ వెంట నిలవాలని కోరారు.