BJP AP : ఇవాళ ఏపీకి అమిత్ షా.. విశాఖ వేదికగా వైసీపీని టార్గెట్ చేస్తారా..?
11 June 2023, 8:14 IST
- Amith Sha Andhrapradesh Tour: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇవాళ ఏపీ పర్యటనకు రానున్నారు. విశాఖలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన స్పీచ్ పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
అమిత్ షా (ఫైల్ ఫొటో)
BJP Andhrapradesh: ఆంధ్రప్రదేశ్ లోనూ పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టింది బీజేపీ హైకమాండ్. ఎన్నికలకు ఏడాది సమయం ఉన్న నేపథ్యంలో... రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలను అంచనా వేస్తూ అడుగులు వేసే పనిలో పడింది. ఇప్పటికే ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఏపీలో పర్యటించారు. శనివారం శ్రీకాళహస్తి వేదికగా జరిగిన సభలో పాల్గొన్న నడ్డా... వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇదిలా ఉంటే... ఇవాళ కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా విశాఖకు రానున్నారు. సాయంత్రం జరగనున్న బీజేపీ మహాజన సంపర్క్ అభియాన్ సభలో పాల్గొననున్నారు.
రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు అగ్ర నేతలు ఏపీకి రావటం ఆసక్తికంగా మారింది. అయితే విశాఖలో తలపెట్టిన సభలో అమిత్ షా ఏం మాట్లాడబోతున్నారనేది చర్చనీయాంశంగా మారింది. మోదీ తొమ్మిదేళ్ల పాలనను వివరించటంతో పాటు ఏపీలోని వైసీపీ ప్రభుత్వ తీరుపై ఎలా స్పందిస్తారనేది టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ గా మారింది. నడ్డా బాటలోనే వైసీపీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తారా...? కీలకమైన రాజధానిపై ఏమైనా స్పందిస్తారా..? వంటి అంశాలపై చర్చ మొదలైంది. పదే పదే కుటుంబ పార్టీలు అని చెప్పే బీజేపీ.... తెలుగుదేశం పార్టీని ఏమైనా కార్నర్ చేస్తుందా...? లేదా...? అనేది ఇప్పుడు ఆసక్తిని రేపుతోంది. ఈ మధ్యనే చంద్రబాబు ఢిల్లీకి వెళ్లటం.... బీజేపీ పెద్దలతో భేటీలు అయిన నేపథ్యంలో.... ప్రస్తుతం సీన్ ఎలా ఉండబోతుందనే దానిపై పలు అంచనాలు కూడా వ్యక్తమవుతున్నాయి. విశాఖ సభలో నడ్డా ప్రసంగానికి కొనసాగింపుగా అమిత్షా స్పీచ్ ఉంటుందా?.. అన్నది రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.
అమిత్ షా షెడ్యూల్…
విశాఖ వేదికగా సాయంత్రం 4 గంటలకు జరగనున్న బీజేపీ మహాజన సంపర్క్ అభియాన్ సభలో పాల్గొంటారు అమిత్ షా. రాత్రి 7 గంటలకు పోర్టు గెస్ట్ హౌస్లో బస చేస్తారు. 8 గంటలకు సాగరమాల కన్వెన్షన్ హాల్లో పార్టీ శ్రేణులతో సమావేశం కానున్నారు అమిత్షా. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్తారు.
మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనకు కూడా రానున్నారు. ఈ మేరకు జూన్ 15వ తేదీన ఖమ్మం వేదిగా భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. దాదాపు లక్ష మందితో సభను నిర్వహించాలని బీజేపీ తెలంగాణ భావిస్తోంది. ఈ సభ కోసం ఇప్పటికే ఏర్పాట్లను సిద్ధం చేసే పనిలో పడింది. ఇక జూన్ 25వ తేదీన నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలో జరిగే బీజేపీ సభకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా హాజరుకానున్నట్లు పార్టీ వర్గాల సమాచారం మేరకు తెలుస్తోంది.