JP Nadda : జగన్ వైఫల్యం వల్లే ఏపీకి రాజధాని లేకుండా పోయింది- అమరావతిపై జేపీ నడ్డా హాట్ కామెంట్స్
10 June 2023, 19:38 IST
- JP Nadda : దేశంలో మోస్ట్ అవినీతి పార్టీ వైసీపీ అని జేపీ నడ్డా విమర్శించారు. ఏపీలో జరగని స్కామ్ లేదన్నారు. జగన్ వైఫల్యం వల్లే ఏపీకి రాజధాని లేకుండా పోయిందన్నారు.
జేపీ నడ్డా
JP Nadda : పేదలు, ఎస్సీలు, రైతుల సంక్షేమ కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. శ్రీకాళహస్తిలో బీజేపీ బహిరంగ సభలో జేపీ నడ్డా మాట్లాడారు. ప్రధాని మోదీ ఎప్పుడూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేయరని స్పష్టం చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాలను బాధ్యతాయుతమైన రాజకీయాల వైపు మళ్లించారన్నారు. దేశమంతా అభివృద్ధి చేయాలనేదే ప్రధాని మోదీ విధానం అన్నారు. మోదీ ప్రధాని అయ్యే సమయానికి దేశంలో విద్యుత్ లేని గ్రామాలు 19 ఉండేవని, నేడు దేశంలో విద్యుత్ లేని గ్రామమే లేదన్నారు. గతంలో 59 గ్రామాలకు మాత్రమే ఫైబర్ నెట్ సౌకర్యం ఉంటే నేడు 2 లక్షలకు పైగా గ్రామాలకు ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులో వచ్చిందన్నారు. దేశంలో 50 కోట్ల మందికి కేంద్రం రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పించిందని గుర్తుచేశారు. ఉజ్వల పథకం కింద రూ.9 కోట్ల మందికి ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిందని జేపీ నడ్డా తెలిపారు.
వైసీపీ మోస్ట్ అవినీతి పార్టీ
దేశంలో మోస్ట్ అవినీతి పార్టీ వైసీపీ అని జేపీ నడ్డా విమర్శలు చేశారు. ఏపీలో జరగని అవినీతే లేదని మండిపడ్డారు. మైనింగ్ స్కామ్, లిక్కర్ స్కామ్, ఇసుక స్కామ్, ఎడ్యుకేషన్ స్కామ్ వైసీపీ హయాంలోనే జరుగుతుందన్నారు. నాలుగేళ్లుగా ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆరోపించారు. దేశంలో శాంతి భద్రతలను గాలికి వదిలేసిన రాష్ట్రం ఏపీ మాత్రమేనన్నారు. వైసీపీ చేతకాని తనం, జగన్ వైఫల్యం వల్లే ఏపీకి రాజధాని లేకుండా పోయిందన్నారు. ప్రధాని మోదీ శంకుస్థాపన చేసినా రాజధానిలో పనులు జరుగడం లేదన్నారు. రాజధానికి భూములు ఇచ్చిన అమరావతి రైతుల్ని ఇబ్బంది పెడుతున్నారని జేపీ నడ్డా మండిపడ్డారు.
కేంద్రం ఇళ్లకు వైసీపీ రంగులు- సోము వీర్రాజు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు... ఏపీలో అభివృద్ధి కనిపించడం లేదని విమర్శించారు. ప్రధాని మోదీ ఇచ్చే బియ్యంపై కూడా సీఎం జగన్ తన ఫొటోలు వేసుకుంటున్నారన్నారు. కేంద్రం నిధులు ఇస్తున్న ఇళ్లకు వైసీపీ రంగులు వేసుకుంటుందని ఆరోపించారు. ఏపీకి కేంద్రం 40 లక్షల ఇళ్లు గ్రాంట్ చేస్తే 20 లక్షలు కూడా నిర్మించలేదన్నారు. ప్రజల కోసం నిర్మించే రైల్వే లైన్ల కోసం పావలా వంతు నిధుల కూడా ఏపీ ప్రభుత్వం ఇవ్వడం లేదని సోము వీర్రాజు మండిపడ్డారు. గ్రామీణ సడక్ యోజన కింద కేంద్రం రోడ్లు వేయిస్తుంటే సీఎం జగన్ మాత్రం ఆ విషయం చెప్పడం లేదని సోము వీర్రాజు విమర్శించారు.
అధికారం ఒక సేవగా- పురంధేశ్వరి
ప్రజల శ్రేయస్సు కోసం పాలకులు పనిచేయాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. గత తొమ్మిది ఏళ్లలో దేశానికి బీజేపీ అందించిన అభివృద్ధి, సంక్షేమం ప్రజలందరూ గుర్తుంచుకోవాలన్నారు. శ్రీకాళహస్తి బహిరంగసభలో పురంధేశ్వరి మాట్లాడుతూ.. బీజేపీ అధికారాన్ని సేవగా మార్చి చేసే పని చేస్తు్న్న పార్టీ అన్నారు. 2014 కన్నా ముందు రోజుల్లో ప్రతి రోజు ఒక్కో స్కాం గురించి విన్నే వాళ్లమన్నారు. మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక్క స్కాం కూడా జరుగలేదన్నారు.