Tirumala : శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబరు 27న బ్రేక్ దర్శనాలు రద్దు
24 November 2023, 18:07 IST
- Tirumala Tirupati Devasthanams: శ్రీవారి భక్తులకు అలర్ట్ ఇచ్చింది టీటీడీ. నవంబరు 27న బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
తిరుమల
TTD Latest News : తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబరు 27న బ్రేక్ దర్శనాలు రద్దు అయ్యాయి. పరిపాలన కారణాల వల్ల బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఫలితంగా నవంబరు 26వ తేదీన(ఆదివారం) సిఫారసు లేఖలు స్వీకరించబడని స్పష్టం చేసింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాలని కోరింది.
2024 ఫిబ్రవరి నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను నవంబరు 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేసింది. తిరుమల, తిరుపతిలోని గదుల కోటాను నవంబరు 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచింది.
నవంబరు 27న శ్రీవారి సేవ కోటా విడుదల
మరోవైపు 2024 ఫిబ్రవరి 16న రథసప్తమి పర్వదినానికి సంబంధించిన శ్రీవారి సేవ స్లాట్లను నవంబరు 27న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. 18 నుండి 50 ఏళ్ల వరకు వయోపరిమితి ఉన్నవారు మాత్రమే ఈ స్లాట్లను బుక్ చేసుకునేందుకు అర్హులు.
అదేవిధంగా, తిరుమల, తిరుపతిలో భక్తులకు స్వచ్ఛంద సేవ చేసేందుకు గాను 2024 జనవరి, ఫిబ్రవరి నెలలకు సంబంధించిన శ్రీవారి సేవ, నవనీత సేవ కోటాను నవంబరు 27న మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేస్తారు. అదేరోజు మధ్యాహ్నం 3 గంటలకు పరకామణి సేవ కోటాను టీటీడీ విడుదల చేయనుంది. ఈ సేవలను www.tirumala.org వెబ్సైట్లో భక్తులు బుక్ చేసుకోవచ్చు.