PM Modi AP Tour : ఇవాళ తిరుమలకు ప్రధాని మోదీ - షెడ్యూల్ వివరాలివే
26 November 2023, 7:39 IST
- Prime Minister Narendra Modi News : తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ఉన్న ప్రధాని మోదీ… ఇవాళ తిరుమల రానున్నారు. ఆయన సాయంత్రం 6.50 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. ప్రధాని పర్యటనకు సంబంధించి ఏపీ ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లను చేసింది.
ప్రధాని మోదీ
PM Modi AP Tour Updates: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ ఏపీలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన టూర్ షెడ్యూల్ ఖరారైంది. ఇవాళ సాయంత్రం 5:45నిమిషాలకు తిరుపతికి బయలుదేరనున్నారు. రాత్రి తిరుమలలో బస చేస్తారు. సోమవారం ఉదయం 8 గంటల నుంచి 8.45 మధ్య శ్రీవారిని దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత తిరుమల నుంచి రేణిగుంట విమానాశ్రయానికి వెళ్తారు. 1:30 నిమిషాలకు హైదరాబాద్ లోని హకీంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.
స్వాగతం పలకనున్న సీఎం జగన్
ప్రధాని నరేంద్ర మోదీ ఏపీకి రానున్న నేపథ్యంలో… ఇవాళ సాయంత్రం 5 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనున్నారు ముఖ్యమంత్రి జగన్. ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి జగన్ స్వాగతం పలకనున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి తిరిగి తాడేపల్లిలోని తన నివాసానికి సీఎం చేరుకుంటారు. అయితే ప్రధాని పర్యటన వేళ… ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేకంగా ఆయన సమావేశమవుతారా..? రాష్ట్రానికి సంబంధిచిన అంశాలపై చర్చిస్తారా..? లేక ప్రోటోకాల్ ప్రకారం కేవలం స్వాగతం పలకడానికి మాత్రమే వెళ్తారా అనే చర్చ కూడా వినిపిస్తోంది.
మోదీ పర్యటన నేపథ్యంలో విస్తృత ఏర్పాట్లను చేసింది ఏపీ ప్రభుత్వం. ఇప్పటికే ఏర్పాట్లపై సీఎం జవహర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వివరాలను కూడా వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోడి ఈనెల 26వతేదీ సాయంత్రం వాయుసేన విమానంలో తిరుపరి విమాశ్రయానికి చేరుకుని తదుపరి తిరుమల వెళ్ళి రాత్రి బస చేస్తారన్నారు. 27వతేదీ ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న అనంతరం తిరుపతి నుండి హైదరాబాదు బయలుదేరి వెళతారని పేర్కొన్నారు.కావున ప్రధాని పర్యటనకు సంబంధించి కట్టుదిట్టమైన విస్తృత ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల అధికారులను సిఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు.
ప్రధాని మోదీ తిరుపతి విమానాశ్రయం నుండి తిరుమల కొండపైకి చేరుకునే రోడ్డు మార్గం వెంబడి విస్తృతమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని పోలీస్ శాఖ అధికారులను ఆదేశించారు. అలాగే 27వ తేదీ ఉదయం తిరుమలలో స్వామి వారిని దర్శించుకునే సమయంలో వీవీఐపీల పర్యటనల నిబంధనల ప్రకారం అవసరమైన పటిష్ట ఏర్పాట్లు చేయాలని టిటిడి ఈఓ ధర్మారెడ్డిని ఆయన ఆదేశించారు.ఇంకా ప్రధాని పర్యటనకు సంబంధించి వివిధ శాఖల పరంగా చేపట్టాల్సిన ఏర్పాట్లన్నిటినీ ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
సోమవారం తెలంగాణలోని మహబూబాబాద్ చేరుకుని మధ్యాహ్నం 12:45 బహిరంగ సభలో పాల్గొంటారు ప్రధాని మోదీ. అనంతరం కరీంనగర్ బయలుదేరి.. 2:45నిమిషాలకు బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సాయంత్రం 4:40కి హైదరాబాద్ చేరుకొని.. 5 గంటల నుంచి 6 గంటల వరకు నిర్వహించే రోడ్ షోలో మోదీ పాల్గొంటారు.