TTD Board Meeting : శ్రీవాణి ట్రస్ట్ నిధులు దుర్వినియోగం కాలేదు, అసత్య ఆరోపణలు చేస్తే కఠిన చర్యలు - వైవీ సుబ్బారెడ్డి
19 June 2023, 16:19 IST
- TTD Board Meeting : టీటీడీ పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అదనపు లడ్డూ కౌంటర్ల నిర్మాణంతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణాలకు నిధులు కేటాయించారు. శ్రీవాణి ట్రస్ట్ నిధులపై అసత్య ఆరోపణలు సరికాదని వైవీ సుబ్బారెడ్డి అన్నారు.
టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
TTD Board Meeting : టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన పాలక మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పాలకమండలి నిర్ణయాలను ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాకు వెల్లడించారు. తిరుమలలో రూ.4.15 కోట్లతో అదనపు లడ్డు కౌంటర్లు నిర్మిస్తామని తెలిపారు. హెచ్.వి.సి ప్రాంతంలో ఉన్న 144 గదులను రూ.2.35 కోట్లతో ఆధునీకరణ చేయనున్నట్లు ప్రకటించారు. జీఎంసీ, ఎస్ఎంసీ ఉప విచారణ కార్యాలయాలను రూ.1.88 కోట్లతో ఆధునీకరణ చేస్తామన్నారు. మూడేళ్ల పాటు వేస్ట్ మేనేజ్మెంట్ నిర్వహణ టెండర్ను ఎల్టీఈ సంస్థకు రూ.40.50 కోట్లకు కేటాయించినట్లు తెలిపారు. రూ.20.50 కోట్లతో సేవాసదన్, వకుళమాతతో పాటు పలు గదుల నిర్వహణను ప్రైవేట్ సంస్థకు అప్పగించాలని నిర్ణయించింది టీటీడీ.
ఆలయాల నిర్మాణాలకు నిధులు కేటాయింపు
ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయంలో రూ.4 కోట్లతో అన్నదాన భవనం నిర్మాణం చేయనున్నామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. రూ.3.55 కోట్లతో పోలీస్ క్వార్టర్స్ అభివృద్ధి చేయనున్నారు. రూ.2 కోట్లతో నగిరిలోని బుగ్గ ఆలయంలో కళ్యాణ మండపం నిర్మాణం, కర్నూలు జిల్లా అవుకు మండలంలో రూ.4.18 కోట్లతో శ్రీవారి ఆలయ నిర్మాణం చేయనున్నట్లు తెలిపారు. తిరుమలలో స్టైన్ లెస్ స్టీల్ బిన్లు ఏర్పాటు రూ.3.10 కోట్లు కేటాయించారు. రూ.5 కోట్లతో ఎస్వీ వేదిక్ యూనివర్సిటీలో స్టాఫ్ క్వార్టర్స్ నిర్మించనున్నారు. రూ.7 కోట్లతో టీటీడీలోని అన్ని విభాగాలలో నూతన కంప్యూటర్ ఏర్పాటు చేయనున్నారు. స్విమ్స్ ఆధునీకరణకు నిధులు కేటాయింపు, 1200 బెడ్స్తో అస్పత్రిని నిర్మించనున్నట్లు టీటీడీ పాలకమండలి తెలిపింది. రూ.6.65 కోట్లతో తిరుచానూరు పుష్కరిణి అభివృద్ధి చేయనున్నారు. గుజరాత్ లోని గాంధీనగర్, ఛత్తీస్గఢ్ రాయపూర్లో శ్రీవారి ఆలయాలు నిర్మించాలని పాలక మండలి నిర్ణయించింది.
శ్రీవాణి ట్రస్ట్ పై వస్తున్న ఆరోపణలపై స్పందించిన వైవీ సుబ్బారెడ్డి
తిరుమల శ్రీవాణి ట్రస్ట్ వస్తున్న ఆరోపణలపై టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. రాజకీయ ఉద్దేశాలతో టీటీడీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. శ్రీవాణి ట్రస్టు నిధులను వైసీపీ నేతలు దోచుకుంటున్నారని ఆరోపిస్తున్నారన్నారు. దేశంలో శ్రీవారి ఆలయ నిర్మాణాలతో పాటు హిందూ ధార్మిక ప్రచారం కోసం శ్రీవాణి ట్రస్ట్ను ప్రారంభించామని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. శ్రీవాణి ట్రస్టు నిధులతో రాష్ట్రంతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో 2445 ఆలయాలు నిర్మించామన్నారు. త్వరలోనే శ్రీవాణి ట్రస్ట్ నిధులపై శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు. శ్రీవాణి ట్రస్ట్ నిధులు దుర్వినియోగం కాలేదన్నారు. దాతలు అందించిన ప్రతీ రూపాయికి రశీదులు ఇస్తామన్నారు. శ్రీవాణి ట్రస్ట్ పై నిరాధార ఆరోపణలు చేస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.