Krishna Water Dispute: కృష్ణా జలాల ట్రైబ్యునల్ పై సుప్రీం కోర్టును ఆశ్రయించాలని ఏపీ ప్రభుత్వ నిర్ణయం
10 October 2023, 6:19 IST
- Krishna Water Dispute: కృష్ణా జలాల పంపిణీపై ఏపీ,తెలంగాణల మధ్య మరో ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీం కోర్టులో సవాలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర క్యాబినెట్ నిర్ణయంపై ఉన్నత స్థాయిలో సిఎం జగన్ సమీక్షించారు.
కృష్ణా జలాల వివాదంపై సిఎం ఉన్నత స్థాయి సమీక్ష
Krishna Water Dispute: తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణాజలాల పున:పంపిణీ చేయాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై సీఎం ఉన్నతస్థాయి సమావేశం నిర్ణయించారు. బచావత్ ట్రైబ్యునల్ తీర్పు వెలువడిన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నదీజలాల పంపిణీ కోసం మరో ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలనే నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. మరోవైపు తెలంగాణకు నీటి కేటాయింపుల్లో అన్యాయం జరిగిందని 2013లో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన కేటాయింపుల్లో మిగులు జలాల్లో వాటా కోల్పోయామని తెలంగాణ భావిస్తోంది.
కేంద్రం నిర్ణయం నేపథ్యంలో కృష్ణజలాలపై కేంద్రం జారీ చేసిన తాజా విధివిధానాలను ముఖ్యమంత్రి వైయస్.జగన్ ఉన్నతస్థాయిలో సమీక్షించారు. సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలన్న నిర్ణయం నేపథ్యంలో నీటిపారుదల శాఖ అధికారులు, న్యాయనిపుణులతో సీఎం భేటీ అయ్యారు.
కృష్ణా నదీజలాల పంపిణీపై గతంలో ఇచ్చిన కేటాయింపులపై సమగ్రంగా చర్చించిన సీఎం, కృష్ణా నదీజలాల వివాదాల ట్రైబ్యునల్ -2 తీర్పుద్వారా మిగులు జలాల కేటాయింపుల్లోనూ నష్టంపై చర్చించారు. ఈ పరిణామాలతో రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగిస్తాయని అధికారులు వివరించారు. రాష్ట్ర విభజన చట్టాన్ని మీరి, తాజా మార్గదర్శకాలు ఉన్నాయని అధికారులు వివరించారు.
కేంద్రం జారీచేసిన నోటిఫికేషన్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఉల్లంఘించేలా ఉందన్న అధికారులు సిఎం దృష్టికి తీసుకు వచ్చారు. సెక్షన్ 89 లో పేర్కొన్న అంశాలకు పూర్తిగా విరుద్ధంగా ఉందని, రాష్ట్ర విభజనకు ముందు చేసిన కేటాయింపులకు కట్టుబడి ఉండాలని విభజన చట్టం చెప్తుందని, ఇప్పుడు దాన్ని ఉల్లంఘించేలా కేంద్రం వైఖరి ఉందని వివరించారు.
ఇప్పటికే సుప్రీంకోర్టు ముందు పలు పిటిషన్లు పెండింగ్ ఉండగా కూడా గెజిట్ విడుదల చేశారని ఇరిగేషన్ అధికారులు సిఎంకు వివరించారు. అంతర్ రాష్ట్ర నదీజల వివాదాల చట్టంలో క్లాస్ 2 నుకూడా ఉల్లంఘించి ఈ విధివిధానాలు జారీచేశారని అధికారులు తెలిపారు. 2002కు ముందు చేసిన ట్రైబ్యునల్ కేటాయింపులను, పంపకాలను పునఃపరిశీలించరాదని చట్టం చెప్తున్నా.. దీనికి విరుద్ధంగా కేంద్రం విధివిధానాలు చేసిందని పేర్కొన్నారు.
గోదావరి నదీజలాల కేటాయింపుల్లో మరో బేసిన్కు తరలించుకోవచ్చన్న వెసులుబాటును పరిగణించి, ఏపీలో పోలవరంనుంచి తరలించే నీటిని పరిగణలోకి తీసుకుని ఆమేరకు తెలంగాణకు కృష్ణానదిలో అదనపు కేటాయింపులు చేయడం సమంజసం కాదని, ఇది రాష్ట్రానికి నష్టమని అధికారులు వివరించారు.
తెలంగాణలో కూడా 214 టీఎంసీలు తరలిస్తున్నా, వాటిని క్యాబినెట్ విధివిధానాల్లో పరిగణలోకి తీసుకోకపోవడంపై సమావేశంలో చర్చించారు. రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా ముందుకెళ్లాలని అధికారులకు సీఎం ఆదేశించారు. రాష్ట్ర ప్రయోజనాలకోసం రాజీ వద్దని, కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలపై గెజిట్ వెలువడిన నేపథ్యంలో మరోసారి ప్రధానమంత్రికి, హోంమంత్రికి లేఖలు రాయాలనికూడా సీఎం ఆదేశించారు.