CM Jagan Review : క్యాలెండర్ ప్రకారం రైతులకు సాగునీరు, ప్రధాన ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ప్రత్యేక దృష్టి- సీఎం జగన్
19 June 2023, 18:32 IST
- CM Jagan Review : క్యాలెండర్ ప్రకారం రైతులకు సాగునీరు అందించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. పోలవరం గైడ్ బండ్ ప్రాంతాన్ని కేంద్ర బృందం పరిశీలించి , పలు సూచనలు చేసిందని అధికారులు సీఎంకు తెలిపారు.
సీఎం జగన్
CM Jagan Review : తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జలవనరుల శాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. క్యాలెండర్ ప్రకారం రైతులకు సాగునీరు అందించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్పై దృష్టి పెట్టాలన్నారు. సమీక్షలో భాగంగా అధికారులు పలు కీలక విషయాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే గోదావరి, కృష్ణాడెల్టా, తోటపల్లి కింద ప్రాంతాలకు సాగునీరు విడుదల చేశామని అధికారులు వెల్లడించారు. పోలవరం ఈసీఆర్ఎఫ్ డ్యాం నిర్మాణ ప్రాంతంలో పనులు చురుగ్గా సాగుతున్నాయని అధికారులు వెల్లడించారు. ఈసీఆర్ఎఫ్ డ్యాం గ్యాప్-1లో శాండ్ ఫిల్లింగ్, వైబ్రోకాంపాక్షన్ పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు.
కుంగిన గైడ్ బండ్ ను పరిశీలించిన కేంద్ర బృందం
గైడ్బండ్లో కుంగిన ప్రాంతాన్ని కేంద్ర బృందం పరిశీలించిందని అధికారులు సీఎం జగన్ కు తెలిపారు. నేల స్వభావం వల్లే గైడ్బండ్ కుంగి ఉండవచ్చని కమిటీ అభిప్రాయం వ్యక్తం చేసిందన్నారు. దెబ్బతిన్న ప్రాంతంపై కేంద్ర అధికారులు సూచనలు చేశారన్నారు. పోలవరం తొలిదశకు కేంద్రం రూ.12911.15 కోట్లు ఇచ్చేందుకు నిర్ణయించిందన్నారు. పోలవరం ముంపు బాధితుల తరలింపునకు ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు సీఎంకు తెలిపారు. గైడ్ బండ్లో కుంగిన ప్రాంతాన్ని పరిశీలించారని కేంద్ర బృందం, నేల స్వభావంలో మార్పులకు కారణం కావొచ్చని కమిటీ వెల్లడించిందన్నారు. దెబ్బతిన్న ప్రాంతాన్ని రాక్ డంప్తో సిమెంట్ స్లర్రీతో నింపాలని, గేబియన్స్తో సపోర్టు ఇవ్వాలని కమిటీ సూచించిందని అధికారులు సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ఆ మేరకు పనులు చేపడతామన్నారు.
ప్రాజెక్టుల పురోగతిపై సీఎం జగన్ ఆరా
ప్రభుత్వం ప్రాధాన్యతగా నిర్దేశించుకున్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రత్యేక దృష్టిపెట్టాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ప్రతి 15 రోజులకోసారి పనుల ప్రగతిని సమీక్షించాలన్నారు. వెలగొండ, వంశధార, అవుకు సహా ప్రాధాన్యతా ప్రాజెక్టుల్లో పరిస్థితులను సీఎం జగన్ సమీక్షించారు. ఈ ప్రాజెక్టుల ప్రగతిని సీఎంకు అధికారులు నివేదించారు. అవుకు రెండో టన్నెల్ నిర్మాణం పూర్తికావొచ్చిదని, చివరిదశలో లైనింగ్ కార్యక్రమం ఉందని, ఆగస్టులో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రికి వెల్లడించారు. అవుకు ద్వారా 20 వేల క్యూసెక్కుల కృష్ణా వరదజలాలను రాయలసీమకు తరలించవచ్చని తెలిపారు. వరదలు సమయంలో నీరు వృథాగా సముద్రంలో కలవకుండా కరవు ప్రాంతాలకు తరలించే అవకాశం ఉంటుందని తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టు పనులపై పురోగతిని అధికారులు సీఎంకు వివరించారు. మొదటి టన్నెల్ పూర్తయ్యిందని, రెండో టన్నెల్ పనులు కూడా కొలిక్కివస్తున్నాయన్నారు. వెలిగొండ ప్రాజెక్టులో భాగంగా గొట్టిపాడు డ్యాం, కాకర్ల డ్యాం, తీగలేరు అప్రోచ్ ఛానల్, తీగలేరు హెడ్ రెగ్యులేటర్, ఈస్ట్రన్ మెయిన్ కెనాల్ హెడ్ రెగ్యులేటర్ పనులు దాదాపుగా పూర్తికావొచ్చాయని అధికారులు స్పష్టంచేశారు.