Pawan Kalyan : జగన్ ఏపీ భవిష్యత్తు కాదు, ఆయనో విపత్తు- పవన్ కల్యాణ్
04 October 2023, 19:40 IST
- Pawan Kalyan : తాను పదవులపై ఆశపడి రాజకీయాల్లోకి రాలేదని పవన్ కల్యాణ్ అన్నారు. వైసీపీ కేసులకు తాను భయపడనన్నారు. జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉన్నానన్నారు.
పవన్ కల్యాణ్
Pawan Kalyan : ఓట్లు కోసమే వైసీపీ ప్రభుత్వం పథకాలు అమలు చేస్తుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. కృష్ణా జిల్లా పెడనలో వారాహి యాత్రలో భాగంగా పాల్గొన్న పవన్...వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. సీఎం జగన్ది రూపాయి పావలా ప్రభుత్వమని విమర్శించారు. సీఎం జగన్ ఒంట్లో పావలా దమ్ము లేదన్నారు. రాష్ట్రంలో రాబోయేది జనసేన-టీడీపీ ప్రభుత్వమేనన్నారు. డబ్బులిస్తే అభివృద్ధి జరిగినట్టా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి మార్గాలేవి? అని నిలదీశారు. తాను పదవులపై ఆశపడి ఉంటే 2009లోనే ఎంపీ పదవిలో ఉండేవాడినన్నారు. నిధుల మళ్లింపులో ఏపీదే అగ్రస్థానమని కేంద్రం చెబుతోందన్నారు. వైసీపీ ప్రభుత్వం ఉపాధి కూలీల పొట్ట కొట్టిందని ఆరోపించారు. ఈ ప్రభుత్వంపై ప్రశ్నించే వారిపై పలు రకాల కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఎక్కువ రాజద్రోహం కేసులు ఏపీలోనే పెడుతున్నారన్నారు. ఇలాంటి కేసులకు భయపడితే తాను రాజకీయాల్లోకి ఎందుకు వస్తానని పవన్ అన్నారు. జగన్ ఏపీ బంగారు భవిష్యత్తు కాదు, ఆయనో విపత్తు అని విమర్శించారు.
నన్ను అరెస్ట్ చేసినా పర్లేదు
"చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు నేను ఏసీబీ కోర్టుకు వెళ్తానని మీకు ఎవరు చెప్పారు. పోలీసులు వైసీపీకి కొమ్ముకాయకండి. ప్రధానమంత్రి, కేంద్రమంత్రులను నేను ఎన్నోసార్లు కలిశాను. జగన్ గురించి చెప్పాలనుకుంటే ఎప్పుడో చెప్పేవాడిని. ఎక్కడ ట్యాక్స్ కట్టలేదో జీఎస్టీ వాళ్లకు తెలుసు. అలాంటిది ఏపీలో ఏం జరుగుతుందో కేంద్రానికి, ప్రధానికి తెలుస్తుంది. కానీ వారి పరిస్థితులు ఏంటో అర్థం చేసుకోవచ్చు. పులివెందుల అంటే ఒకప్పుడు సరస్వతి నిలయం, చదువులు నేల ఇప్పుడు గొడవలకు కేంద్రం చేశారు. నేను వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నాను. నన్ను అరెస్టు చేసిన పర్లేదు. ఎక్కడికైనా వస్తాను. ప్రజలు డబ్బులను వాలంటీర్లకు దోచిపెడుతున్నారు. లక్షల కోట్లు జగన్ దోచేశారని తెలిసినా ఆయనను సీఎం చేశాము." - పవన్ కల్యాణ్
ఇళ్ల పేరుతో రూ.4 వేల కోట్లు దోచేశారు
రాష్ట్రంలో 28 లక్షల ఇళ్లు కడతామని చెప్పి 3 లక్షల ఇళ్లే కట్టారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఇళ్ల పేరుతో రూ.4 వేల కోట్లు దోచేశారని ధ్వజమెత్తారు. ప్లాస్టిక్పై నిషేధం పేరుతో తన ప్లెక్సీలను మాత్రమే నిషేధించారని పవన్ అన్నారు. నా సినిమాలు, పుట్టినరోజు వచ్చినప్పుడే ప్లాస్టిక్పై వైసీపీ వాళ్లకు నిషేధం గుర్తుకు వస్తుందన్నారు. ఏపీలో కులభావన ఎక్కువ, జాతి భావన తక్కువ అని పవన్ అన్నారు. విభజన సమయంలో కొనకళ్ల నారాయణపై దాడి చేశారని, ఆ ఘటన తాను మర్చిపోలేదన్నారు. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు వైసీపీ తరిమికొట్టాలన్నారు. ఏపీ ప్రజలు గర్వంగా తలెత్తుకుని బతికేలా చేయడమే తన ఆశయం అన్నారు. పెడనలో జనసేన కార్యకర్తలను కట్టి కొట్టారని, వాటన్నింటికీ స్థానిక ఎమ్మెల్యే జోగి రమేష్ సమాధానం చెప్పాల్సిన రోజు వస్తుందన్నారు. జనసేన, టీడీపీ కార్యకర్తలు కలిసి పనిచేయాలని పవన్ సూచించారు. రెండు పార్టీలు ఉమ్మడిగా పనిచేస్తేనే వైసీపీని ఎదుర్కొగలమన్నారు.
ఎన్డీఏ కూటమి నుంచి బయటకు!
2024 ఎన్నికలకు పరస్పర సహకారం చేసుకోవాల్సిన అవసరం ఉందని పవన్ అన్నారు. జనసేన-టీడీపీ కూటమికి కేంద్రంలోని బీజేపీ మద్దతు ఉండాలన్నారు. తనకు ఇబ్బందిగా ఉన్నా భాగస్వామ్య కూటమి నుంచి బయటకు వచ్చి టీడీపీకి మద్దతు ఇవ్వడం తప్పలేదని పవన్ కల్యాణ్ అన్నారు. టీడీపీ అనుభవం, జనసేన పోరాటం వైసీపీని కాలరాస్తాయన్నారు. టీడీపీ బలహీనమైన పరిస్థితుల్లో ఉన్నపుడు, ఆ పార్టీ అనుభవం రాష్ట్రానికి అవసరమని జనసేన మద్దతు తెలిపిందన్నారు. అయితే ఎన్డీఏ నుంచి బయటకు వస్తున్నట్లు పవన్ సంకేతాలు ఇచ్చారా? అని చర్చ జరుగుతోంది.