Nara Lokesh Padayatra : లోకేశ్ పాదయాత్రలో మరోసారి ఉద్రిక్తత- టీడీపీ, వైసీపీ శ్రేణులు పరస్పర దాడి!
03 September 2023, 16:58 IST
- Nara Lokesh Padayatra : టీడీపీ నేత నారా లోకేశ్ పాదయాత్రలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. నిడమర్రు మండలం మందలపర్రులో టీడీపీ, వైసీపీ శ్రేణుల ఘర్షణకు దిగాయి. వైసీపీ శ్రేణుల రాళ్ల దాడిలో టీడీపీ నేత కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి.
నారా లోకేశ్ పాదయాత్రలో ఉద్రిక్తత
Nara Lokesh Padayatra : నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో కొనసాగుతోంది. అయితే లోకేశ్ పాదయాత్రలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ, టీడీపీ నేతలు పరస్పరం దాడులకు దిగారు. నిడమర్రు మండలం మందలపర్రులో లోకేశ్ పాదయాత్ర సమయంలో వైసీపీ నేతలు ఫ్లెక్సీలు చూపారు. వైసీపీ నేతలు ప్లెక్సీలు చూపుతూ కవ్వింపు చర్యలకు పాల్పడ్డారని టీడీపీ నేతలు వారిని అక్కడి నుంచి తరిమికొట్టారు. దీంతో టీడీపీ, వైసీపీ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. టీడీపీ నేతల కార్లపై వైసీపీ శ్రేణులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో టీడీపీ నేత కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. టీడీపీ, వైసీపీ వర్గీయులతో ఘర్షణకు కాసేపు ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను శాంతింపజేశారు.
ఆక్వా రైతులను ఆదుకుంటాం
టీడీపీ ప్రభుత్వం రాగానే ఆక్వా రంగాన్ని గాడిలో పెడతామని నారా లోకేశ్ అన్నారు. ఆక్వా ఎగుమతుల్లో రాష్ట్రాన్ని నంబర్ వన్గా నిలిపింది టీడీపీ అన్నారు. ఉంగుటూరు నియోజకవర్గం చిననిండ్రకొలను క్యాంప్ సైట్ నుంచి 203వ రోజు పాదయాత్రను లోకేశ్ ఆదివారం ప్రారంభించారు. స్థానిక ఆక్వా రైతులు తమ ఇబ్బందులను నారా లోకేశ్ కు తెలిపారు. 15 ఏళ్లుగా చేపల సాగు చేస్తున్నామని, గత మూడేళ్లుగా సరైన ధర లేక సుమారు రూ.3 లక్షల నష్టం పోయామని అప్పారావు అనే రైతు లోకేశ్ వద్ద వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందడం లేదని ఆవేదన చెందారు. గిట్టుబాటు ధర, కోల్డ్ స్టోరేజ్లు ఏర్పాటు చేస్తే రైతుకు మేలు జరుగుతుందన్నారు. సీఎం జగన్ మాటలు కోటలు దాటుతాయి కానీ పనులు మాత్రం గజం కూడా ముందుకు సాగదని లోకేశ్ ఎద్దేవా చేశారు. ఉంగుటూరు నియోజకవర్గం చిననిండ్రకొలనులోని మెయిన్ రోడ్డు దుస్థితిని చూపిస్తూ లోకేశ్ సెల్ఫీ దిగారు. ఇక్కడ గుంతలు తప్ప రోడ్డు ఎక్కడుందని ఎద్దేవా చేశారు.
వైసీపీ బ్యానర్లు కట్టిన పోలీసులు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో పోలీసులు అత్యుత్సాహం చూపారు. ఉంగుటూరు నియోజకవర్గంలో యువగళం స్వాగత ఫ్లెక్సీలను తొలగించిన పోలీసులు వైసీపీ బ్యానర్లు ఏర్పాటు చేశారని టీడీపీ నేతలు ఆరోపించారు. ఉంగుటూరు నియోజకవర్గం గణపవరం మండలంలో వైసీపీ బ్యానర్లు ఎందుకు కడుతున్నారని యువగళం బృందం పోలీసులను నిలదీసింది. పై అధికారుల ఒత్తిడితో తప్పక చేస్తున్నామని పోలీసులు వీడియో తీస్తున్న టీడీపీ నేతలకు బదులిచ్చారు. వీడియో బయట పెట్టొద్దని చాలా సేపు టీడీపీ నేతలను కోరారు. వైసీపీ బ్యానర్లు పడిపోతే వాటిని టీడీపీ వాళ్లు తొలగించారనే ఆరోపణలు రాకుండా తాము ఆ బ్యానర్లు సరిచేస్తున్నామని పోలీసులు వివరణ ఇచ్చారని టీడీపీ శ్రేణులు అంటున్నాయి.
.