Lokesh Returned: 22రోజుల తర్వాత ఢిల్లీ నుంచి రాజమండ్రి చేరుకున్న నారా లోకేష్…
06 October 2023, 10:03 IST
- Lokesh Returned: టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాజమండ్రి చేరుకున్నారు. సెప్టెంబర్ 14న ఢిల్లీ వెళ్లిన లోకేష్ గురువారం సాయంత్రం విజయవాడ చేరుకున్నారు. నేడు ములాఖత్లో చంద్రబాబుతో భేటీ కానున్నారు.
ఏపీకి తిరిగి వచ్చిన నారా లోకేష్
Lokesh Returned: టీడీపీ నాయకుడు నారా లోకేష్ గురువారం సాయంత్రం రాజమండ్రి చేరుకున్నారు. ఢిల్లీ నుంచి విజయవాడ వచ్చిన లోకేష్ నేడు రాజమండ్రి వెళ్లనున్నారు.. నేడు కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబుతో భేటీ కానున్నారు. సెప్టెంబర్ 14న చివరిసారి లోకేష్ తండ్రితో భేటీ అయ్యారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, నందమూరి బాలకృష్ణలతో కలిసి జైల్లో బాబుతో భేటీ అయ్యారు.
గురువారం రాత్రి ఎంపీ కేశినేని నానితో కలిసి దిల్లీ నుంచి విజయవాడ చేరుకున్న లోకేష్కు ఎయిర్పోర్ట్లో అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. విమానాశ్రయంలో లోకేశ్కు తెదేపా జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు, గన్నవరం పార్టీ ఇన్ఛార్జ్ యార్లగడ్డ వెంకట్రావు, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, మాజీ ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకరరావు, బోడే ప్రసాద్, బోండా ఉమామహేశ్వరరావు, ఇతర ముఖ్యనాయకులు స్వాగతం పలికారు.
సెప్టెంబర్ 9వ తేదీన ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు.ఈ కేసులో అరెస్టైన చంద్రబాబు అప్పటి నుంచి జ్యుడిషీయల్ రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు.
22 రోజుల తర్వాత ఢిల్లీ నుంచి రాజమండ్రి విచ్చేసిన టీడీపీనేత నారా లోకేశ్ , శుక్రవారం ఉదయం 11 గంటలకు సెంట్రల్ జైలులో చంద్రబాబుతో ములాఖత్ అవుతారు. ఆయనతోపాటు కుటుంబసభ్యులు, పార్టీ నేతలు కూడా చంద్రబాబును కలువనున్నారు.
చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో న్యాయ నిపుణులతో చర్చించడంతో పాటు జాతీయ రాజకీయ పార్టీలను కలిసేందుకు నారా లోకేష్ సెప్టెంబర్ నెల 14న న్యూఢిల్లీకి వెళ్లారు. అప్పటి నుండి లోకేష్ ఢిల్లీలోనే ఉన్నారు. హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో చంద్రబాబుకు ఊరట దక్కుతుందని భావించినా అలా జరగలేదు. మరోవైపు చంద్రబాబు జైల్లో ఉండటంతో లోకేష్ పాదయాత్ర కూడా సెప్టెంబర్ 9 నుంచి నిలిచిపోయింది. గత నెలలో ప్రారంభించాలని భావించిన చివరి నిమిషంలో దానిని రద్దు చేశారు.
అక్టోబర్ 9వ తేదీన లోకేష్ మరోసారి ఢిల్లీకి వెళ్తారు. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసుపై చంద్రబాబు దాఖలు చేసిన ఎస్ఎల్పీ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరగనున్న నేపథ్యంలో లోకేష్ ఢిల్లీ వెళ్లనున్నారు.