TDP Jayaho BC: బీసీలకు ప్రత్యేక మ్యానిఫెస్టో విడుదల చేయనున్న టీడీపీ
29 December 2023, 13:04 IST
- TDP Jayaho BC: ఏపీలో బీసీలకు ప్రత్యేకంగా మేనిఫెస్టో విడుదల చేయాలని నిర్ణయించినట్టు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చెప్పారు. పార్టీ కార్యాలయంలో జయహో బీసీ పేరిట ప్రత్యేక కార్యక్రమాల షెడ్యూల్ను విడుదల చేశారు.
టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
TDP Jayaho BC: టీడీపీ బలమైన ఓటు బ్యాంకులుగా ఉన్న బీసీ సామాజిక వర్గాలకు చేరువయ్యేందుకు తెలుగు దేశం పార్టీ ప్రణాళికలు రూపొందిస్తోంది. జయహో బీసీ పేరుతో ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు నారా లోకేష్ ప్రకటించారు.
బీసీలంటే బలహీనులు కాదు.. బలవంతులన్నదే టీడీపీ నినాదమని, జయహో బీసీ పేరిట జనవరి 4న టీడీపీ ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. చంద్ర బాబు నిర్వహించే వర్క్ షాప్ ద్వారా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు తెలిపారు.
పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల్లో క్షేత్ర స్థాయికి వెళ్తామని, క్షేత్రస్థాయి చైతన్య కార్యక్రమాల తర్వాత జయహో బీసీ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.
బీసీలకు రక్షణ చట్టం పేరిట మినీ మేనిఫెస్టోలో ఇప్పటీకే ప్రాధాన్యం కల్పించామన్నారు. బీసీ సామాజిక వర్గాలకు ప్రత్యేక మ్యానిఫెస్టో ప్రకటిస్తామన్నారు. ఏపీలో బీసీల ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని ఆరోపించారు.
పార్టీ ఆవిర్భావం నుంచీ టీడీపీలో బీసీలకు సముచిత స్థానం కల్పించారని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బీసీలను ఇబ్బంది పెట్టారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో 10 శాతం రిజర్వేషన్ తగ్గించారని ఆరోపించారు.
ప్రభుత్వ నిర్ణయంతో 16 వేల బీసీలకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకుండా చేసిందన్నారు. 8 వేల ఎకరాలు బీసీల అసైన్డ్ భూములను కూడా వెనక్కి తీసుకున్నారని, ఆదరణ పథకాన్ని వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు.
ఆదరణ పథకం ద్వారా పనిముట్లు అందలేదని పాదయాత్రలో చెప్పారని, 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశామన్నారని వాటికి నిధులు.. విధుల్లేవని ఎద్దేవా చేశారు. జీవో 217 తీసుకొచ్చి మత్స్యకారుల వెన్నెముక విరగ్గొట్టారని చెప్పారు.
పట్టు రైతులకు కనీసం సబ్సిడీ ఇచ్చే పరిస్థితిలో కూడా ఈ ప్రభుత్వం లేదని, బీసీల సోదరుల తరపున పోరాడుతున్న టీడీపీ నాయకత్వంపై కేసులు పెట్టి వేధించారన్నారు. టీడీపీకి పని చేస్తున్న బీసీ నాయకులందరిపైనా అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు.
వైసీపీ పాలనలో యనమల, అయ్యన్న, కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడుపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. రాష్ట్రంలో బీసీలకు శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలు అందజేస్తామని, బీసీ ఉప కులాలకు ప్రత్యేకనిధి ఏర్పాటు చేసి వారికే ఖర్చు చేస్తామన్నారు.