Kakinada News : సాగునీరు అందక పొలాలకు బీటలు, కాకినాడ జిల్లాలో రైతుల అవస్థలు!
09 August 2023, 14:30 IST
- Kakinada News : కాకినాడ జిల్లాలో వింత పరిస్థితి నెలకొంది. వర్షాకాలంలో కూడా సాగునీరు లేక పొలాలు బీటలు వారిపోతున్నాయి. గొల్లప్రోలు మండలంలోని గ్రామాలకు ఆధారమైన చెరువుకు నీటి సరఫరా లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు చెబుతున్నారు.
పొలాలకు బీటలు
Kakinada News : వర్షాకాలంలో చెరువులు, వాగులు పొంగి పొర్లుతూ ఉండే పరిస్థితి ప్రతీ ఏటా కనిపించేది. నిన్న మొన్నటి వరకూ తెలంగాణలో భారీ వర్షాలకు గోదావరి పొంగి లంక గ్రామాలు నీట మునిగాయి. కానీ కాకినాడ జిల్లాలో వింత పరిస్థితి కనిపిస్తుంది. గొల్లప్రోలు మండలంలోని 10 గ్రామాలు సాగు, తాగు నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గొల్లప్రోలు మండలంలోని ఏకే మల్లవరం సహా చుట్టుపక్కల 10 గ్రామాలకు వ్యవసాయమే ఆధారం. జులై నెలలో కురిసిన వర్షాలకు నీరు అందుతుందన్న నమ్మకంతో అప్పులు తెచ్చి వరి నాట్లు వేశారు రైతులు. అయితే ఆ తర్వాత పరిస్థితి మారిపోయింది. గత పదిరోజులుగా చినుకు కూడా పడలేదు. దీంతో పంటపొలాలు ఎండిపోయాయి. ఎకరానికి రూ.15-20 వేలు పెట్టుబడులు పెట్టామని, ఇప్పుడు పూర్తిగా ఎండిపోయాయని రైతులు లబోదిబోమంటున్నారు. కనీసం తాగడానికి నీరు లేదని, పశువులకు కూడా నీరు దొరకడంలేదంటున్నారు. చెరువులు, తూములకు మరమ్మతులు లేకపోవడంతో నీరు వచ్చే సదుపాయంలేకపోయిందని అంటున్నారు. నీరు అందక పొలాలు బీటలు వారుతున్నాయని అధికారులను అడిగితే పట్టించుకోవట్లేదని వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆత్మహత్యలే శరణ్యం అంటున్నారు రైతులు.
ఎండిపోతున్న వరి పొలాలు
కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం ఏకే మల్లవరంలో ఉన్న సుమారు 1300 ఎకరాల విస్తీర్ణంలో గల ఆర్ ఆర్ బీ చెరువు ఉంది. గొల్లప్రోలు, తొండంగి, కొత్తపల్లి మండల పరిధిలో పది గ్రామాలకు ఈ చెరువే ఆధారం. సుమారు 20 వేల ఎకరాలు ఆయకట్టుకు ఈ చెరువు ద్వారా సాగునీరు అందుతుంది. సాధారణంగా జూన్, జులై నెలలలో కురిసే వర్షాలతో పాటు పీబీసీ ద్వారా వచ్చే గోదావరి నీటితో చెరువును నింపుతారు. ఈ ఏడాది వర్షాలు అంతగా లేకపోవడంతో చెరువులోకి నీరుచేరలేదు. ఇటీవల భారీ వర్షాలతో ఏకే మల్లవరం సహా చుట్టుపక్కల గ్రామాల్లో రైతులు తమ పొలాలను దమ్ము చేసుకుని వరి సాగుచేశారు. అయితే రెండు వారాలుగా వర్షాలు లేకపోవడంతో వరి మడులు ఎండిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. చెరువులో 13 తూములకు సరైన మరమ్మతులు లేకపోవడంతో నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో పంటలు ఎండిపోవడం ప్రారంభం అయింది. కొన్ని చోట్ల వరి పొలాలు బీటలు వారుతున్నాయి. ఏకే, ఏపీ మల్లవరం గ్రామాల్లో సుమారు 1400 ఎకరాలకు సాగునీరు అందని పరిస్థితి ఏర్పడిందని రైతులు తెలిపారు.
పొలాలకు బీటలు
నీళ్లు లేక పొలాలు బీటలు వారాయని ఇరిగేషన్ అధికారులు దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడంలేదని రైతులు ఆరోపిస్తున్నారు. సాగునీరుకు ఇబ్బంది ఉండదని చెప్పడంతో వెదజల్లు పద్ధతిలో వరి వేశామని, కానీ ఇప్పుడు అధికారులు నీరు వదలడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పిఠాపురం బ్రాంచి కెనాల్ నుంచి గోదావరి నీరు రావడం లేదంటున్నారు. ఏలేరు నీరు మళ్లించకపోవడంతో ఆర్ఆర్ బీ చెరువుకు నీరు అందే మార్గాలు లేవని అంటున్నారు. పంట పొలాలు ఎండిపోవడమే కాకుండా పశువులకు తాగునీరు కూడా లభించని పరిస్థితి ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.