Polavaram Poru Keka: బీజేపీతో దోస్తీతో పవన్ ఎవరిని ఉద్దరిస్తారన్న సిపిఎం
23 June 2023, 8:21 IST
- Polavaram Poru Keka: పోలవరం ముంపు బాధితుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు ప్రాజెక్టులో నీటిని నిల్వ చేయొద్దనే డిమాండ్తో సిపిఎం చేపట్టిన పోరుకేక నాలుగో రోజుకు చేరింది. ప్రాజెక్టు బ్యాక్ వాటర్లో మునిగిపోనున్న లక్షలాది మందికి న్యాయం చేసే వరకు పోరాటం తప్పదని ఆ పార్టీ ప్రకటించింది.
పోలవరం పోరుకేకలో సిపిఎం నాయకులు
Polavaram Poru Keka: పోలవరం ప్రాజెక్టు ముంపు సమస్యపై బిజెపి, వైసిపి స్పందించకపోతే పోలవరం జైత్రయాత్ర తప్పదని, ఆదివాసులు మూడో కన్ను తెరుస్తారు సిపిఎం ఏపీ కార్యదర్శి శ్రీనివాసరావు హెచ్చరించారు. పోలవరం ప్రాజెక్టు కోసం భూములు, ఇల్లు, తమ సర్వస్వం త్యాగం చేసిన నిర్వాసితుల హక్కులను కాల రాస్తే ఆదివాసీలు మూడో కన్ను తెరవడం ఖాయమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత కార్యదర్శి బి వెంకట్ హెచ్చరించారు.
పోలవరం నిర్వాసితులకు పరిహారం పునరావాసం కల్పించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన పోలవరం పోరు కేక మహా పాదయాత్ర కూనవరం మండలంలోని కొండరాజుపేట, ఆర్కూరు, రేపాక గ్రామాలలో పర్యటించింది. ఈ సందర్భంగా ఆర్కూరు సచివాలయం, రేపాక గ్రామ సెంటర్ లోనూ సమావేశాలను నిర్వహించారు. ఆర్కూరులో నిర్వహించిన సమావేశానికి వి ఆర్ పురం ఎంపీటీసీ పూణెం ప్రదీప్ అధ్యక్షత వహించారు. రేపాక గ్రామ సెంటర్లో నిర్వహించిన సమావేశానికి కూనవరం వైస్ ఎంపీపీ కొమరం పెంటయ్య అధ్యక్షత వహించారు.
పోలవరం ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన నిర్వాసితులు చేపట్టిన మహా పాదయాత్ర చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. కూనవరం, విఆర్ పురం మండలాల్లో ప్రజలు ప్రలోభాలకు సైతం నెరవకుండా ఎర్ర జెండా అభ్యర్థులను గెలిపించుకున్నారని అభినందించారు. మాజీ ఎమ్మెల్యేలు కుంజా బుజ్జి, సున్నం రాజయ్య, మాజీ ఎంపీపీ కారం శిరమయ్య అందించిన సేవలను గుర్తు చేశారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ప్రతిపాదించినప్పుడే పోలవరం నిర్వాసితుల పక్షాన నిలబడి నిర్వహించిన పోరాటాన్ని గుర్తు చేశారు. నాడు అసెంబ్లీ సాక్షిగా మునిగిపోయే ప్రాంతాల గ్రామాల ప్రజలను ఆదుకుంటామని అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన హామీని గుర్తు చేశారు. కానీ ఆచరణలో అమలుకు నోచుకోలేదన్నారు.
విభజన చట్టంలో జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం మొండి చేయి చూపిస్తుందని మండిపడ్డారు. 2019 ఎన్నికల ముందు ఈ ప్రాంతంలో పర్యటించిన వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలను ఆదుకుంటామని ఇచ్చిన హామీ పూర్తిగా విస్మరించారన్నారు. ప్రాజెక్టునిర్మాణం పూర్తి చేసి కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకు గతంలో టిడిపి, ప్రస్తుతం వైసిపి పోటీ పడుతున్నాయని విఎస్సార్ ఆరోపించారు.
ఎకరా భూమికి కేవలం రూ.1.15లక్షలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని అన్నారు. అధికారంలోకి వస్తే ఐదు లక్షల ఇస్తామంటూ చేసిన హామీని బుట్ట దాఖలు చేశారని, పోలవరం నిర్వాసితులకు అందజేసే పరిహారం పునరావాసం దయదాక్షిణ్యం కాదని మండిపడ్డారు. మహా పాదయాత్ర జులై 4వ తేదీ వరకు కొనసాగుతుందని అప్పటికి ప్రభుత్వం స్పందించకపోతే పాలకుల సంగతి తేల్చేందుకు నిర్వాసితులు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.
పునరావాసం పరిహారం కల్పించాకే తమ ఊరిలో కడుగు పెట్టాలని హెచ్చరిస్తూ ప్రతి ఊరి ముందు గ్రామ ప్రజలుబోర్డులు ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. ప్రాజెక్టు ఎప్పటికీ అతీగతీ లేకపోవడం పనికిమాలిన దద్దమ్మ ప్రభుత్వాల పనితీరుకు నిదర్శనమని మండిపడ్డారు. పరిహారం చెల్లింపునకు దశల పేరుతో మభ్యపెట్టారని ఆరోపించారు. గత ఏడాది వచ్చిన వరదలు లెక్కలు కాకి లెక్కలని తేల్చేశారు.
పెద్ద ఆర్కూరు, రాపాకలలో అర్హులను సైతం జాబితాలో చేర్చలేదని, గత టిడిపి ప్రస్తుత వైసీపీ ప్రాజెక్టు నిర్మాణానికి తహతహలాడుతూ కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకు పోటీ పడుతున్నాయని అన్నారు. మునిగిపోతున్న ప్రజల గురించి ఎందుకు పట్టడం లేదని ప్రశ్నించారు. నిర్వాసితుల కోసం జరిగే ఈ పోరాటంలో కలిసి రావాలని పిలుపునిచ్చారు.
పవన్ ఎవరిని ఉద్దరిస్తారు….
దళితులను, ముస్లింలను ,వెనుకబడిన తరగతులు, ఆదివాసీల హక్కులను కాలరాస్తున్న బిజెపితో చెలిమి చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవరిని ఉద్ధరిస్తారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి ప్రశ్నించారు. నీతి నిజాయితీ ఉంటే బిజెపితో తెగదంపులు చేసుకొని ప్రజల కోసం పని చేయాలని సూచించారు. పట్టిసీమలో ఎకరా భూమికి 50 లక్షలు ఇచ్చారని, ప్రాంతంలోనూ అదే రీతిగా రూ 50 లక్షల ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పోడు భూములకు సైతం అదేవిధంగా పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. గ్రామాలు ఖాళీ చేసే నాటికి18 సంవత్సరాల నిండిన యువతియువకులందరికీ కట్ ఆఫ్ డేట్ తొలగించిఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ చెల్లించాలని డిమాండ్ చేశారు.