Cm Jagan Delhi Tour: పోలవరం తాజా అంచనాలు అమోదించాలని కేంద్రానికి జగన్ విజ్ఞప్తి
06 October 2023, 7:02 IST
- Cm Jagan Delhi Tour: పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను అమోదించడంతో పాటు ప్రాజెక్టు మొదటి దశ నిర్మాణానికి అవసరమైన నిధులను విడుదల చేయాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు ఏపీ సిఎం జగన్ విజ్ఞప్తి చేశారు.
కేంద్రమంత్రి నిర్మలాసీతాారామన్తో సిఎం జగన్
Cm Jagan Delhi Tour: దిల్లీ పర్యటనలో ఉన్న సిఎం జగన్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్తో గురువారం సాయంత్రం భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టు పనుల నిర్వహణ కోసం ముందస్తుగా రూ.12,911.15 కోట్ల విడుదల చేసినందుకు హర్షం వ్యక్తం చేశారు. అదే సమయంలో ప్రాజెక్టు తాజా అంచనాలకు అమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు.
లైడార్ సర్వే ప్రకారం అదనంగా 36 ఆవాసాల్లో ముంపు కుటుంబాలను రక్షిత ప్రాంతాలకు తరలించాల్సి ఉందని, గతేడాది జులైలో వచ్చిన భారీ వరదల వల్ల తలెత్తిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తొలిదశ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా చేయాల్సిన పనులకు సంబంధించి అంచనాలు రూపొందించినట్లు కేంద్ర మంత్రికి సిఎం వివరించారు.
పోలవరం తొలి దశ పూర్తి చేయడానికి ఇంకా రూ.17,144.06 కోట్లు అవసరమవుతాయని, ఆ మొత్తాన్ని విడుదల చేయాలని కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.1,355 కోట్లను కూడా తిరిగి చెల్లించాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంకోసం రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధులనుంచి ఖర్చుచేసినట్లు గుర్తు చేశారు.
ఢిల్లీ పర్యటనలో కేంద్ర విద్యుత్ శాఖమంత్రి ఆర్కే సింగ్తో ముఖ్యమంత్రి జగన్ సమావేశం అయ్యారు. తెలంగాణ నుంచి రాష్ట్రానికి రావల్సిన విద్యుత్ బకాయిలు రూ.7,359 కోట్లను ఇప్పించాలని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు. పెద్ద మొత్తంలో ఉన్న నిధుల బకాయిలు ఏపీ జెన్కో, డిస్కంలకు గుదిబండల్లా మారాయని వివరించారు.
30 రోజుల్లోగా ఏపీకి బకాయిలు చెల్లించాలంటూ గతేడాది ఆగస్టు, 29న కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినా తెలంగాణ రాష్ట్రం హైకోర్టును ఆశ్రయించిందని వివరించారు. ఈ అంశం ఇప్పుడు న్యాయ వ్యవస్థ పరిధిలోకి వెళ్లిందని, తెలంగాణ నుంచి ఆ నిధులు వచ్చేలా చూడాలని కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి కోరారు.
ముఖ్యమంత్రి కలిసిన అనంతరం కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ విలేకరులతో మాట్లాడుతూ ఏపీలో విద్యుత్ రంగం అభివృద్ధిపై ముఖ్యమంత్రి జగన్తో చర్చించినట్లు తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ రంగం పరిస్థితిపై కేంద్రం సంతృప్తిగా ఉందన్నారు. రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ పథకానికి (ఆర్డీఎస్ఎస్కు) ఏపీ అర్హత సాధించిందని చెప్పారు. తెలంగాణ నుంచి ఏపీకి రావల్సిన విద్యుత్ బకాయిలపై అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు కేంద్ర మంత్రి నిరాకరించారు.
వామపక్ష తీవ్రవాదంపై నేడు సమీక్ష…
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో వామపక్ష తీవ్రవాదంపై శుక్రవారం జరిగే సమీక్షలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొంటారు. ఈ సమీక్ష తర్వాత అమిత్ షాతో ముఖ్యమంత్రి జగన్ సమావేశమవుతారని ప్రచారం జరుగుతోంది.