Polavaram Project: టీటీపీ, వైసీపీ ప్రభుత్వాల నిర్ణయాలే పోలవరానికి శాపం - విష్ణువర్థన్ రెడ్డి
30 July 2023, 13:13 IST
- BJP Vishnu Vardhan Reddy : పోలవరం ప్రాజెక్ట్ విషయంలో టీడీపీ, వైసీపీ విఫలం అయ్యాయని విమర్శించారు బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి. ప్రాంతీయ పార్టీల దురాశకు జాతీయ ప్రాజెక్టు పోలవరం దుస్థితే సాక్ష్యమని దుయ్యబట్టారు.
విష్ణువర్థన్ రెడ్డి
BJP Vishnu Vardhan Reddy: ప్రాంతీయ పార్టీల దురాశకు జాతీయ ప్రాజెక్టు పోలవరం దుస్థితే సాక్ష్యమన్నారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి. పేనుకు పెత్తనం ఇస్తే తలంతా కొరికేసిందనే సామెత పోలవరం విషయంలో రెండు పార్టీల తీరు సరిపోయిందని ఎద్దేవా చేశారు. పైగా నిధులు ఇవ్వటం లేదంటూ కేంద్రంపై నిందలు వేయటం తప్పా చేసిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం కడితే రీఎంబర్స్ చేయనని కేంద్రం చెప్పిందా ? అని సూటిగా ప్రశ్నించారు.
"దేశంలో 100 శాతం కేంద్ర నిధులతో నిర్మాణం చేస్తున్న జాతీయ ప్రాజెక్ట్ ఎందుకు తీసుకున్నారు..? కేంద్రం ప్రతీ పైసా ఇస్తాం నిర్మించుకోండని భరోసా ఇస్తే 2014-19 వరకూ టీడీపీ ప్రభుత్వం ఏం చేసింది..? చేసిన పని తక్కువ- పబ్లిసిటీ రాజకీయం ఎక్కువ. 2018 కల్లా పూర్తి చేస్తామన్నారు మధ్యలో కాంట్రాక్టర్లను మార్చి సమయాన్ని వృధా చేశారు. అడిగినన్ని నిధులు రీఎంబర్స్ చేసినా పూర్తి చేయలేకపోయారు. టీడీపీకి చేత కాదని ప్రజలు వైసీపీకి అధికారం ఇస్తే అతని కంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్లుగా మారింది పరిస్థితి ఉంది" అంటూ విష్ణువర్థన్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
అరకొరగా జరుగుతున్న పనుల్ని కూడా రివర్స్ టెండర్ పేరుతో రివర్స్ చేసేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగేళ్లలో ప్రాజెక్టులో పనులు జరగకపోగా.. చేసిన పనుల్నే మళ్లీ చేయాల్సి వస్తోందని చెప్పారు. "డయాఫ్రం వాల్, గైడ్ బండ్ మళ్లీ కట్టాలా ? పోలవరం ప్రాజెక్ట్ అధారిటీ చెప్పిన సలహాలు వినకుండా ఇష్టారాజ్యంగా చేసుకుని ఏపీ జీవనాడితో ఆటాడుకున్నారు. ఎలా చూసినా రెండుప్రభుత్వాలు అహంతో తీసుకున్న నిర్ణయాలే పోలవరానికి శాపం. నిధులన్నీ కేంద్రం ఇస్తుందని చట్టంలో ఉంటే నిర్మించుకోవడం చేతకాని అసమర్థ ప్రభుత్వాలు మీ రెండు పార్టీలు. కేంద్రంపై నిందలేసి పోలవరం భారం దించేసుకోవడానికే ప్రజలు వైకాపాకు అధికారం ఇచ్చింది ? అధికారం ఉన్నా ప్రాజెక్టు పూర్తి చేయకుండా విపక్షాలు పై రాజకీయ విమర్శలు చేయడం వైకాపా వైఫల్యం. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం రావాలి , పోలవరం కావాలి " అంటూ విష్ణువర్థన్ రెడ్డి ట్వీట్ లో రాసుకొచ్చారు.