Shift to Vizag : జగన్ సర్కార్ మరో ముందడుగు... విశాఖలో ప్రభుత్వ శాఖలకు భవనాలు కేటాయింపు
23 November 2023, 18:30 IST
- Visakhapatnam Capital : విశాఖలో అధికారుల క్యాంప్ కార్యాలయాలను గుర్తించింది ఏపీ సర్కార్. రిషికొండ మిలినియం టవర్స్లో మంత్రులు, అధికారుల క్యాంపు కార్యాలయాలను గుర్తిస్తూ ఆదేశాలను జారీ చేసింది.
విశాఖలో అధికారుల క్యాంప్ కార్యాలయాలు గుర్తింపు
Visakhapatnam Capital: ఏపీలో విశాఖ నుంచే పరిపాలన దిశగా మరో అడుగు ముందుకేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రిషికొండ మిలీనియం టవర్స్లో మంత్రులు, అధికారుల క్యాంప్ కార్యాలయాలను గుర్తించింది. భవనాల వినియోగంపై అధికారుల కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఉత్తర్వులను జారీ చేశారు.మొత్తం 2 లక్షల 27వేల చదరపు అడుగుల ప్రభుత్వ భవనాల స్థలాలు గుర్తించారు.
ముఖ్యమంత్రి, మంత్రులు ఉత్తరాంధ్రలో సమీక్షలకు వెళ్లినప్పుడు ఉపయోగించేందుకు మిలినియం టవర్స్లో A, B టవర్స్ను కేటాయించినట్లు ఉత్తర్వుల్లో వెల్లడించారు. వివిధ శాఖలకు చెందిన సొంత భవనాలను ఆయా శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు, కార్యదర్శులకు కేటాయించారు. సొంత భవనాలు లేని శాఖలు, అధికారుల కార్యాలయాలకు మిలినియం టవర్స్ను వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
రాజధాని నగరాన్ని విశాఖపట్నం తరలించాలనే ముఖ్యమంత్రి ఆలోచన 2019 డిసెంబర్లో తెరపైకి వచ్చింది.అభివృద్ధి ఒకే చోట కేంద్రీకృతమై ఉండకూడదనే తలంపుతో రాష్ట్రంలోని మూడు ప్రాంతాల మధ్య హేతుబద్ధమైన అభివృద్ధి కల్పించడానికి పరిపాలనా వ్యవహారాలను విశాఖపట్నం నుంచి నిర్వహించాలని యోచించిన సంగతి తెలిసిందే. రాజధాని తరలింపు నిర్ణయం వెనుక కారణాలు ఏమున్నా,అన్ని ప్రాంతాలకు అమోదయోగ్యమైన అభివృద్ధి తమ నినాదమని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. విశాఖలో పరిపాలనా రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని, అమరావతిలో శాసన రాజధాని కొనసాగిస్తామని ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. నిజానికి ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతిలో రాజధాని నిర్మాణాన్ని నిలిపి వేసింది. దాదాపు లక్ష కోట్ల రుపాయలు ఖర్చయ్యే రాజధానిని ఒక ప్రాంతానికి కేంద్రీకృతం చేయడం తగదని వైసీపీ ప్రభుత్వం భావించింది. కానీ కోర్టుల జోక్యంతో ప్రక్రియ ఆగిపోవటమే కాదు… ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గింది.
కొద్దిరోజుల పాటు రాజధాని అంశంపై సెలైంట్ గా ఉంటూ వచ్చిన వైసీపీ సర్కార్…. విశాఖ నుంచి పాలన సాగించే దిశగా అడుగులు వేస్తూ వచ్చింది. ఇందులో భాగంగా ప్రభుత్వ పెద్దలు కూడా పలుమార్లు ప్రకటన చేస్తూ వచ్చారు. వైజాగ్ కే షిఫ్ట్ అవుతానంటూ జగన్ కూడా పలుమార్లు ప్రకటించారు. నిజానినికి ముఖ్యమంత్రి ఎక్కడ్నుంచైనా పని చేసే అవకాశం ఉంటుంది. అయితే అది వ్యక్తిగతం మాత్రమే అవుతుంది. కానీ తాజాగా పరిపాలనా యంత్రాంగాన్ని కూడా వైజాగ్ కు షిఫ్ట్ చేసే పనిలో పడింది సర్కార్. కానీ అధికారికంగా వైజాగే రాజధానిగా ప్రకటిస్తూ ఏమైనా ఉత్తర్వులు జారీ చేస్తారా లేక మరో కొత్త బిల్లు ఏదైనా తీసుకువస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.