AP CMO Signs Duped : ఏపీ సీఎంవోలో డిజిటల్ సంతకాలు కొట్టేసి, 66 ఫేక్ పిటిషన్లు-ఐదుగురిని అరెస్టు చేసిన సీఐడీ
12 August 2023, 13:48 IST
- AP CMO Signs Duped : ఏపీ సీఎంవో కార్యదర్శుల డిజిటల్ సంతకాలు దుర్వినియోగం చేసిన కేసులో ఐదుగురిని అరెస్ట్ చేశారు. సీఎంవో కార్యదర్శుల లాగిన్ తో 66 ఫేక్ సీఎం పిటిషన్లు ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఏపీ సీఎంవో డిజిటల్ సంతకాల కేసు
AP CMO Signs Duped : ఏపీ సీఎం కార్యాలయంలో డిజిటల్ సంతకాల దుర్వినియోగం సంచలనం రేపింది. ఈ కేసులో ఐదుగురిని అరెస్టు చేసినట్లు సైబర్ క్రైమ్, సీఐడీ ఎస్పీ హర్ష వర్ధన్ రాజు తెలిపారు. గత కొంతకాలంగా సీఎంవో అధికారుల డిజిటల్ సంతకాలు ఉపయోగించి సీఎం పిటిషన్లు జనరేట్ చేశారు నిందితులు. ఈ విషయంపై సీఎంవో అధికారుల నుంచి వచ్చిన ఫిర్యాదుతో ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. సీఎంవోలోని రేవు ముత్యాల రాజు, ధనుంజయ్ రెడ్డి, సీఎస్ జవహర్ రెడ్డి పేషీల్లో పనిచేస్తున్న కొందరు డిజిటల్ సంతకాలు దుర్వినియోగం చేశారు. ఈ కేసులో కనమర్ల శ్రీను, గుత్తుల సీత రామయ్య, నలజల సాయి రామ్, భూక్యా చైతన్య నాయక్, అబ్దుల్ రజాక్ అరెస్టు చేసినట్లు సీఐడీ ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు.
అసలేం జరిగిందంటే?
గత కొన్ని నెలలుగా సీఎంవోలో ఉన్న కార్యదర్శుల ఈ-ఆఫీస్ లాగిన్ యూసర్ నేమ్, పాస్ వర్డ్ లను వినియోగించి ఎమ్మెల్యే, ఎంపీల అభ్యర్థనలను సీఎంవో కార్యదర్శులకు తెలియకుండా సీఎం పిటిషన్లు తయారీ చేస్తున్నారు. ఈ-ఆఫీస్ ద్వారా కార్యదర్శుల డిజిటల్ సంతకాలను ఉపయోగించి సీఎం పిటిషన్లను సంబంధిత శాఖలకు పంపిస్తున్నారు. ఈ కేసులో ప్రథమ ముద్దాయి అయిన కనమర్ల శ్రీను (ముత్యాల రాజు IAS పేషీలో మాజీ DEO) ఈ- ఆఫీస్ లోని అనుభవంతో వ్యక్తిగత ఆర్థిక ప్రయోజనాల కోసం సీఎం పిటిషన్లను ఏ శాఖకు కావాలంటే ఆ శాఖ సెక్రెటరీ టు సీఎం సంతకాలను కాపీ, పెస్ట్ చేసి పంపించేవాడు. అలాగే ఈ-ఆఫీస్ లో ప్రాసెసింగ్ కోసం కనమర్ల శ్రీను, నలజల సాయి రామ్ (జవహర్ రెడ్డి పేషీలో డీఈవో), గుత్తుల సీతారామయ్య (ధనుంజయ రెడ్డి పేషీలో అడెంటర్), డీఈవో చైతన్య (ముత్యాలరాజు IAS పేషి) అలాగే అబ్దుల్ రజాక్ (జవహర్ రెడ్డి పేషీలో డీఈవో) వీరంతా కలిసి ఒక ప్లాన్ ప్రకారం అభ్యర్థుల నుంచి అర్జీలు తీసుకోవడం, ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థన లేఖలను సేకరించడం వాటిని ఈ-ఆఫీస్ లో అప్లోడ్ చేసేవాళ్లు. ఇలా చేసేందుకు డబ్బులు తీసుకుని వీళ్లంతా పంచుకోవడం చేశారు.
ఉద్యోగం నుంచి తొలగించినా
ఫిబ్రవరి నెలలో ముత్యాలరాజు పేషీలో పని చేస్తున్న డీఈవో కనమర్ల శ్రీను తయారు చేసిన హోండిపార్ట్మెంట్ కి చెందిన ఒక సీఎం పిటిషన్ ధనుంజయ్ రెడ్డి పేషీకి రాగా దానిపై అనుమానంపై క్రాస్ చెక్ చేశారు. అయితే ఈ పని కనమర్ల శ్రీను చేశాడని, శాఖపరమైన విచారణ చేసి నిర్ధారించుకుని అతనిని ఉద్యోగం నుంచి తొలగించారు. ఉద్యోగంలో నుంచి తొలగించిన తర్వాత కూడా శ్రీను ముత్యాలరాజు పేషీలో పని చేసే డీఈవో చైతన్య సహకారంతో లాగిన్ పాస్ వర్డ్ తెలుసుకుని మరో మూడు సీఎంపీలను ఈ-ఆఫీసు లాగిన్ నుంచి వివిధ శాఖలకు పంపాడు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు ఆ ఫైల్స్ ను వెనక్కి తీసుకున్నారు. ఈ పని శ్రీను చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించుకుని, మిగిలిన కార్యదర్శలు వారి శాఖలలోని లాగిన్స్ చెక్ చేసుకోగా సుమారుగా 66 సీఎంపీలు ఫేక్ అని గుర్తించి రిపోర్ట్ తయారు చేసి సీఐడీ అధికారులు ఇచ్చారు.
66 ఫేక్ సీఎం పిటిషన్లు
ఏపీ సీఐడీ విచారణలో ఐదుగురు నిందితులను గుర్తించారు. ఒకరితో ఒకరికి సంబంధాలు ఉన్నాయని అదే విధంగా ఫైల్ ప్రాసెసింగ్ కి వీళ్ల మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు గుర్తించామని సీఐడీ ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. వీళ్లు ఒక్కొక్క ఫైల్ ప్రాసెస్ చేయడానికి రూ.30 వేలు నుంచి 50 వేలు వరకు వసూలు చేసి సాయి రామ్, సీతారాం, రజాక్ కమిషన్ కింద కొంత మొత్తం ఉంచుకుని శ్రీనుకు రూ.25 వేలు వరకు ముట్టజెప్పి సీఎంపీలను ఈ-ఆఫీసు నుంచి చేయించేవారు. శ్రీనును సీఎంవో నుంచి తొలగించిన తర్వాత కూడా బయట నుంచి సీఎంపీలు తయారీ చేశాడు. పూనం మాలకొండయ్య పేషీ ఈ -ఆఫీసు ద్వారా దొంగిలించిన లాగిన్ పాస్వర్డ్ లు ఉపయోగించి 66 సీఎంపీలు అప్లోడ్ చేశాడు. సులువుగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ నేరానికి పాల్పడినట్లు నిందితులు ఒప్పుకోవడంతో వీళ్లని కస్టడీలోకి తీసుకుని, జుడీషియల్ రిమాండ్ కి తరలిస్తామని సీఐడీ ఎస్పీ తెలిపారు.