AP Police : దీపావళి వేళ పటాసుల షాపులకు కీలక ఆదేశాలు - ఏపీ పోలీసుల రూల్స్ ఇవే
11 November 2023, 10:23 IST
- AP Police On Fire crackers :దీపావళి పండుగను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని ఏపీ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు పోలీస్ కమిషనర్లు, జిల్లా ఎస్పీలకు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.
ఏపీ పోలీసుల ఆంక్షలు
Andhrapradesh Police: రాష్ట్ర వ్యాప్తంగా గతంలో దీపావళి సందర్భంగా జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం బాణసంచా తయారుచేయు/విక్రయించే దుకాణాల విషయంలో ఏపీ పోలీసులు దృష్టి పెట్టారు. ఈ మేరకు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి…. పోలీసులు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. నిర్వహకులతో సమావేశలు నిర్వహించి, ఎవరైనా అనుమతి లేకుండా బాణ సంచా/టపాసులను ఇళ్లల్లో, షాపులలో, జన సముదాయాల మధ్య గోడౌన్లలో స్టాకు అనుమతి లేకుండా నిల్వలు చేసిన లేదా లైసెన్సు లేకుండా అనధికార విక్రయాలు జరిపిన బాణాసంచా విక్రయించే దుకాణదారులు పోలీసులు సూచించిన నియమ నిబంధనలను తప్పని సరిగా పాటించకపోయినా వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్లు, జిల్లా ఎస్పీలను ఆదేశించారు.
మరోవైపు గోదావరి జిల్లాలో స్థానికంగా లభించే దీపావళి మందు గుండు సామాగ్రి తయారీ, స్టోరేజ్ గోడౌన్లు, అమ్మకాలు జరిగే ప్రదేశాల పైన ఇప్పటికే ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడంతో పాటు ఆకస్మిక తనిఖీలు చేపట్టడం జరిగింది.రాష్ట్రం లో ఎక్కడైనా అక్రమంగా మందు గుండు సామాగ్రి తయారీ చేసిన, విక్రయాలు జరుపుతున్నట్లు సమాచారం ఉంటే ప్రజలు వెంటనే డయల్ 100/112 కి గాని మీ దగ్గర లోని స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
ఇప్పటి వరకు నమోదైన కేసులు:
దీపావళి మండే గుండు సామాగ్రి నిల్వ చేసుకునేందుకు 239 లైసెన్సులు జారీ. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా దీపాల సందర్భంగా విక్రయాలు జరుపుకునేందుకు ఇప్పటివరకు అధికారికంగా 3856 షాపులకు లైసెన్సు మంజూరు. లైసెన్సులు పొంది నిబంధనలు అతిక్రమించిన వారిపై మూడు కేసులు.(02 కాకినాడ, 01 నంద్యాల) నమోదు చేయడం జరిగింది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా అక్రమంగా నిలువ, తయారీ, విక్రయాలకు సంబంధించి 44 ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి 60 కేసులు నమోదు చేయడం జరిగింది.
- గతంలో జరిగిన ఘటనలో ప్రమేయం ఉన్న వ్యక్తులను గుర్తించి ఇప్పటివరకు 1223 మందిని బైండోవర్ చేయడంతో పాటు 429 మందికి నోటీసులు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 42,36,400 రూపాయల విలువైన దీపావళి మందు గుండు సామాగ్రిని స్వాధీనం చేసుకోవడం జరిగింది.
పాటించాల్సిన నిబంధనలివే:
1. బాణాసంచా నిల్వచేసే కేంద్రాల నిర్వాహకులు, తయారీ చేసేవారు, విక్రయాలు చేసేవారు తప్పనిసరిగా లైసెన్సు కలిగి ఉండాలి.
2. బాణసంచా సామాగ్రి తయారీ, నిల్వ కేంద్రాలు ప్రజల నివాస ప్రాంతాలకు నిర్దిష్ట దూరంలో ఉండాలి.
3. ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ అన్నింటినీ తప్పనిసరిగా పాటించాలి.
4. పై వాటిలో విధులు నిర్వహించే వారికి అగ్ని ప్రమాదం సంభవిస్తే తీసుకోవలసిన చర్యలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి
5. బాణాసంచా విక్రయ దుకాణాలను జనావాసాలకు, విద్యాసంస్థలకు, హాస్పిటల్స్ కు దూరంగా అధికారులు సూచించిన ప్రదేశంలోనే బాణాసంచా విక్రయాలు జరగాలి.
6. బాణాసంచా విక్రయ దుకాణాల మధ్య కనీస నిర్దిష్ట దూరం ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలి.
7. ప్రతీ దుకాణం వద్ద అగ్ని నిరోధక సిలెండర్లు, తగినంత పొడి ఇసుక, కావాల్సిన నీరు అందుబాటులో ఉండాలి.
8. మైనర్లను బాణసంచా నిల్వచేసే కేంద్రాల వద్ద మరియు తయారీ లేదా విక్రయ పనుల్లో వారిని వినియోగించరాదు.
9. లైసెన్స్ కలిగి ఉన్న విక్రయిదారులు లైసెన్స్ లేని వారికి విక్రయించి, తద్వారా ఏదైనా ప్రమాదం సంభవించినా, దానికి లైసెన్స్ దారులదే పూర్తి బాధ్యత వహించాలి.
10. లైసెన్స్ కలిగిన విక్రయాదారులు తమ లైసెన్స్ ను దుకాణం వద్ద తప్పనిసరిగా అందరికీ కనిపించే విధముగా ఉంచాలి.
11. అనుమతి పొందిన దుకాణదారులు అధికారులు సూచించిన సమయాల్లో మాత్రమే విక్రయాలు జరపాలి. ఆదే విధంగా దీపావళి రోజున సాయంత్రం 5 గంటల తరువాత ఎటువంటి అమ్మకాలను జరపరాదు.