AP Caste Census : ఏపీలో సమగ్ర కుల గణన - నవంబరు 27 నుంచి ప్రక్రియ షురూ..!
12 November 2023, 7:57 IST
- AP Caste Census 2023:ఏపీలో సమగ్ర కుల గణనకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే కుల గణనకు కేబినెట్ ఆమోదం తెలిపగా… నవంబరు 27 నుంచి ప్రారంభించే దిశగా అడుగులు వేస్తోంది.
ఏపీలో కుల గణన 2023
AP Caste Census 2023 Updates: ఏపీలో సమగ్ర కుల గణనకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే కుల గణనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కలెక్టర్ల ఆధ్వర్యంలో ఆయా వర్గాల అభిప్రాయ సేకరణ, రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించింది. అయితే ఈనెల 27 నుంచి ప్రక్రియను ప్రారంభించాలని సర్కార్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియను పూర్తిగా డిజిటల్ విధానంలో చేపట్టడంతో పాటు…. ఇందుకోసం ప్రత్యేక ప్రశ్నావళితో యాప్ను సిద్ధం చేస్తోంది. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా ఈ కుల గణన నిర్వహించనున్నట్లు సమాచారం.
సంపూర్ణ సామాజిక సాధికారతే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం సమగ్ర కుల గణనకు శ్రీకారం చుట్టింది. సమాజంలో అణగారిన వర్గాల వారికి సామాజిక, రాజకీయ, ఆర్థిక, ఆరోగ్య, విద్యా ఫలాలు అందించేందుకు వీలుగా చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని వైసీపీ సర్కార్ తెలిపింది. దాదాపు శతాబ్దం తరువాత చేస్తున్న కుల గణన ద్వారా రాష్ట్రంలో మరిన్ని పేదరిక నిర్మూలన పథకాలు, మానవ వనరుల అభివృద్ధితో పాటు సామాజిక అసమానతలు రూపుమాపేలా ప్రణాళిక రూపొందించవచ్చని పేర్కొంది. ఆరు నెలల వ్యవధిలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని వైసీపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నవంబర్ 27 నుంచి ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తుంది.
ఈ కార్యక్రమాన్ని సమర్థంగా పూర్తిచేసేందుకు ప్రాంతీయ స్థాయిలోనే సన్నాహక సమావేశాలను నిర్వహించబోతుంది. బీసీ సంక్షేమ శాఖ పర్యవేక్షణలో ఇవన్నీ జరగనున్నాయి. జిల్లా స్థాయిలో 15, 16 తేదీల్లోనూ ప్రాంతీయ స్థాయిలో 17 నుంచి 24వ తేదీ వరకు రాజమహేంద్రవరం, కర్నూలు, విశాఖ, విజయవాడ, తిరుపతిలో సదస్సులు నిర్వహించనుంది.
కుల గణనపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కులగణన అమల్లో ఉంది. బీహార్ ప్రభుత్వం కులాల ఆధారంగా డేటాను సేకరించే ప్రయత్నాలు మొదలుపెట్టింది. పంజాబ్, ఒడిశా ప్రభుత్వాలు కూడా కుల గణనపై సమాచారాన్ని సేకరించేందుకు సర్వేలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఏపీ ప్రభుత్వం కూడా కుల గణనపై కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
సచివాలయాల ఉద్యోగులకు కుల గణన ప్రక్రియ పనిని అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. న్యాయపరమైన సమస్యలు తలెత్తే అవకాశాలు ఉండడంతో వాలంటీర్లను ఇందులో భాగస్వామ్యం చేయడంలేదని తెలుస్తోంది. సచివాలయ ఉద్యోగులు తమ పరిధిలోని ప్రతి ఇంటిని సందర్శించి, సమాచారాన్ని సేకరిస్తారు. వీరు సేకరించిన సమాచారంపై అధికారులు రీవెరిఫికేషన్ కూడా నిర్వహిస్తారు. ప్రతి సచివాలయ పరిధిలో 10 శాతం ఇళ్లల్లో రీవెరిఫికేషన్ చేస్తారు. ఓ ప్రత్యేక అధికారితో రీవెరిఫకేషన్ చేస్తారు.