wooden treadmill: అదరహో శ్రీనివాస్.. నాకు ఒకటి కావాలంటూ ఆనంద్ మహీంద్ర ట్వీట్
25 March 2022, 10:27 IST
- ఆ ట్రెడ్ మిల్... నెట్టింట్లో వైరల్ అయిపోయింది. కేటీఆర్ మనసు దోచేసింది.. అంతేనా ఇప్పుడు ఏకంగా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కంట్లో కూడా పడింది. ఈ వీడియోపై స్పందించిన ఆయన.. ఆంధ్రా ఆణిముత్యాన్ని ప్రశంసించాడు. తనకు ఒకటి కావాలంటూ ట్వీట్ చేశారు.
ట్రెడ్ మిల్ పై ఆనంద్ మహీంద్ర ట్వీట్
వుడెన్ ట్రెడ్ మిల్.. సోషల్ మీడియాను షేక్ చేస్తూనే ఉంది. తాజాగా ఆనంద్ మహీంద్ర కంట పడింది. తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్వీట్ తో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది ఈ క్రియేటివిటీ. పవర్ లేకుండా నడిచే ఈ వుడెన్ ట్రెడ్ మిల్ చూసి... కేటీఆర్ ఆశ్చర్యపోయారు. అంతేకాదు.. ఏకంగా వివరాలు కనుకోండి అంటూ అధికారులకు పరీక్ష కూడా పెట్టారు. ఎట్టకేలకు అతను.. ఆంధ్రప్రదేశ్ కు చెందిన కడిపు శ్రీనివాస్ అని తెలిసింది.
తాజాగా ఈ లోకల్ టాలెంట్ పై ఆనంద్ మహీంద్ర స్పందించారు. 'పవర్ తో నడిచే ట్రెడ్ మిల్స్ చాలా దొరుకుతుంటాయి. కానీ ఈ ట్రెడ్ మిల్ పూర్తిగా పవర్ లేకుండానే నడుస్తుంది. నిజానికి దీన్ని ఉడెన్ ట్రెడ్మిల్ అనడం కంటే ఓ కళా నిపుణుడు సృష్టించిన కళారూపంగా చూడాలి. తనకూ అలాంటిది ఒకటి కావాలంటూ' ట్విట్ లో రాసుకొచ్చారు.
ఆనంద్ మహీంద్రా ట్వీట్ పై నెటిజన్లు తమదైన స్టైల్ లో రియాక్ట్ అవుతున్నారు. కొద్ది సమయంలోనే భారీ సంఖ్యలో లైకులు, కామెంట్లు వచ్చాయి.
కళాకారుడి వివరాలు ఇవే...
కడిపి శ్రీనివాస్.. తూర్పుగోదావరి జిల్లా మండపేట పట్టణానికి చెందిన వడ్రంగి కళాకారుడు. చెక్కలతో ట్రెడ్ మిల్ రూపొందించి అబ్బురపరిచారు. దీనికోసం 60 బాల్ బేరింగ్ లు ఉపయోగించాడు. దీని తయారీకి రూ.12వేలు ఖర్చయిందని శ్రీనివాస్ తెలిపారు. ఈ పరికరాన్ని ఓ నెటిజన్ ట్విటర్లో పోస్ట్ చేయగా.. మంత్రి కేటీఆర్ స్పందించారు. వావ్ అంటూ కితాబునిచ్చారు. ఆ తరువాత ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తాజాగా ఆనంద్ మహీంద్ర కూడా ట్వీట్ చేయడంతో.. ఈ ఆంధ్రా ఆణిముత్యం నైపుణ్యం ప్రపంచం ముందుకు వచ్చేసింది.