Chandrababu : సీఎం జగన్ రాయలసీమ ద్రోహి, సాగునీటి ప్రాజెక్టులకు తీరని అన్యాయం - చంద్రబాబు
26 July 2023, 15:21 IST
- Chandrababu : రాయలసీమకు సీఎం జగన్ తీరని ద్రోహం చేస్తున్నారని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. రాయలసీమ ప్రాజెక్టులకు నిధులు కేటాయించడంలేదని, సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు.
చంద్రబాబు
Chandrababu : రాయలసీమకు వైసీపీ ప్రభుత్వం తీరని ద్రోహం చేస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. బుధవారం ఆయన రాయలసీమ ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటెషన్ ప్రదర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... సీఎం జగన్ రాయలసీమ ద్రోహి అంటూ విమర్శించారు. రాయలసీమ ప్రాజెక్టులకు జగన్ తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. ఎన్టీఆర్ తెచ్చిన తెలుగు గంగ ప్రాజెక్టుతో రాయలసీమ అభివృద్ధి మొదలైందన్నారు. నీటి కోసం దేశాలు, రాష్ట్రాల మధ్య యుద్ధాలు జరిగాయని గుర్తుచేశారు. సాగునీటి ప్రాజెక్టులపై టీడీపీ ప్రభుత్వం రూ.68,293 కోట్లు ఖర్చు పెట్టిందన్నారు. కానీ వైసీపీ ప్రభుత్వం కేవలం రూ.22,165 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని ఆరోపించారు. నీటి పారుదల శాఖను వైసీపీ ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని విమర్శించారు.
సీమకు జగన్ ద్రోహం
రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను వైసీపీ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని చంద్రబాబు ఆరోపించారు. దేశంలో ఏ రాష్ట్రానికీ లేనివిధంగా ఏపీకి నీటి వనరులు మనకు ఉన్నాయన్నారు. నదులు అనుసంధానం చేస్తే ప్రతి ఎకరాకు నీరు ఇవ్వొచ్చన్నారు. నీటిపారుదల శాఖను నాశనం చేసిన వైసీపీ ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ సీమకు తీరని ద్రోహం చేశారని చంద్రబాబు మండిపడ్డారు. కృష్ణ, గోదావరి నదుల అనుసంధానం వల్ల రాష్ట్రానికి మేలు కలుగుతుందన్నారు. అనంతపురం లాంటి జిల్లాల్లో పదేళ్లల్లో ఎనిమిదేళ్లు వేరుశెనగ పంటలు ఎండిపోయిన పరిస్థితులు ఉండేవని, అలాంటి సమయంలో రాయలసీమ ప్రజలకు ఎన్టీఆర్ తెలుగు గంగ ప్రాజెక్టు తెచ్చారన్నారు. హంద్రీ - నీవా, గాలేరు నగరి ప్రాజెక్టులకు అంకురార్పణ చేశారని గుర్తుచేశారు. హంద్రీ -నీవా ప్రాజెక్టు కోసం టీడీపీ రూ. 4 వేల కోట్లకు పైగా ఖర్చు పెడితే, వైసీపీ ప్రభుత్వం రూ.500 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిందన్నారు.
పట్టిసీమ ఘనత టీడీపీదే
పట్టిసీమ ద్వారా సీమకు నీటిని తరలించిన ఘనత టీడీపీకి చెందుతుందని చంద్రబాబు అన్నారు. నదుల అనుసంధానం చేపట్టాలని అప్పటి ప్రధాని వాజ్ పేయిను కోరామన్నారు. గంగా-కావేరీ నదుల అనుసంధానం సూచించామన్నారు. ఏపీ విభజన తర్వాత పోలవరం ద్వారా కృష్ణా-గోదావరి నదుల అనుసంధానం కోసం ప్రయత్నించామన్నారు. నదుల అనుసంధానంతో ఏపీలో ప్రతీ ఎకరాకు నీరు అందించే ప్రయత్నం చేశామని చంద్రబాబు అన్నారు. టీడీపీ ప్రభుత్వం మొత్తం బడ్జెట్ లో 9.63 శాతం ఇరిగేషన్ కోసం కేటాయింపులు చేసిందన్నారు. కానీ వైసీపీ ప్రభుత్వం మొత్తం బడ్జెట్ లో కేవలం 2.35 శాతం మాత్రమే ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఖర్చు పెట్టిందని చంద్రబాబు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల కేటాయింపులు తగ్గించిందని ఆరోపించారు.