Chandrababu Letter : మిగ్ జామ్ తుపానును జాతీయ విపత్తుగా ప్రకటించండి, ప్రధానికి చంద్రబాబు లేఖ
10 December 2023, 13:54 IST
- Chandrababu Letter : మిగ్ జామ్ తుపాను ఏపీలోని 15 జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపిందని చంద్రబాబు ప్రధాని మోదీకి లేఖ రాశారు. రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని, సాయం అందించాలని కోరారు. మిగ్ జామ్ తుపాను జాతీయ విపత్తుగా ప్రకటించాలని కోరారు.
రైతులను పరామర్శించిన చంద్రబాబు(File Photo)
Chandrababu Letter : ఏపీలో మిగ్ జామ్ తుపాను అల్లకల్లోలం సృష్టించిన విషయం తెలిసిందే. తుపాను ప్రభావంతో లక్షల ఎకరాల పంటలు నాశనం అయ్యాయి. సరిగ్గా పంట చేతికి వచ్చే సమయానికి తుపాను ముంచేసిందని రైతులు కన్నీళ్లు పెడుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు. మిగ్ జామ్ తుపాను కారణంగా నష్టపోయిన ఏపీ ప్రజలను ఆదుకోవాలని ప్రధాని మోదీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. మిగ్ జామ్ తుపానును జాతీయ విపత్తుగా ప్రకటించి సాయం అందించాలని కోరారు. ఏపీలోని 15 జిల్లాల్లో తుపాను తీవ్ర ప్రభావం చూపించిందని, రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. సుమారుగా 22 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని లేఖలో తెలిపారు. తుపాను కారణంగా భారీగా ఆస్తి నష్టం జరిగిందని, ఆరుగురు సైతం ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.
రూ.10 వేల కోట్ల నష్టం
మిగ్ జామ్ తుపాను వల్ల సుమారు రూ.10 వేల కోట్ల మేర పంట నష్టం వాటిల్లిందని ప్రాథమిక అంచనా అని చంద్రబాబు అన్నారు. దాదాపు 770 కి.మీ మేర రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని, నీటిపారుదల, విద్యుత్, కమ్యూనికేషన్ రంగాలకు నష్టం వాటిల్లిందన్నారు. వ్యవసాయ రంగంతో పాటు ఆక్వా రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారని లేఖలో ప్రధాని మోదీకి తెలిపారు. ఏపీలో మిగ్ జామ్ తుపాను నష్టం అంచనాకు కేంద్ర బృందాన్ని పంపాలని, కేంద్రం అందించే సాయం త్వరగా అందించాలని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు.
లేఖలో చంద్రబాబు ప్రస్తావించిన అంశాలు
ఏపీలోని 15 జిల్లాల్లో తుపాను తీవ్ర ప్రభావం చూపింది. తుపాను ప్రభావంతో 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. ఈ గాలులు ప్రజల జీవనాన్ని దెబ్బతీశాయి. తుపాను వల్ల ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రాథమిక అంచనాల మేరకు రాష్ట్రంలో 22 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. పంటలు దెబ్బతినడంతో పాటు చాలా చోట్ల పశువులు చనిపోయాయి. ఆస్తి నష్టం జరిగింది. తుపాను మిగిల్చిన నష్టంతో నలుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.
మత్స్యకార పడవలు, వలలు కొట్టుకుపోయాయి. తుపాను ప్రభావంతో ఏపీతో పాటు తమిళనాడు సైతం తీవ్రంగా నష్టపోయింది. తుపాను తీవ్రత, నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని మిగ్ జామ్ తుపానును జాతీయ విపత్తుగా ప్రకటించాలి. తుపాను నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక బృందాన్ని పంపాలి. జాతీయ విపత్తుగా ప్రకటిస్తే బాధితులకు మెరుగైన సహాయం అందుతుంది. మీ ప్రకటనతో బాధితులలో విశ్వాసాన్ని నింపే అవకాశం కలుగుతుంది"- చంద్రబాబు నాయుడు