Tirupati Zoo Park : తిరుపతి జూపార్క్లో విషాదం.. వ్యక్తిని చంపిన సింహం
15 February 2024, 17:10 IST
- Tirupati SV Zoo Park Incident: తిరుపతి జూలో విషాద ఘటన వెలుగు చూసింది. సెల్పీ ట్రై చేసేందుకు లయన్ ఎన్క్లోజర్లోకి వెళ్లిన వ్యక్తిని సింహం చంపేసింది.
తిరుపతి జూలో విషాదం
Tirupati SV Zoo Park Incident: తిరుపతిలోని ఎస్వీ జూపార్క్లో విషాదం చోటు చేసుకుంది. లయన్ ఎన్క్లోజర్లోకి చొరబడిన ఓ వ్యక్తి…. సింహతో సెల్ఫీ ట్రై చేశాడు. ఈ సమయంలో ఒక్కసారిగా సింహం దాడి చేసేందుకు ప్రయత్నించింది. భయపడిన అతను… చెట్టుపైకి ఎక్కగా దానిపై నుంచి కిందపడటంతో సింహం అతని తల భాగంపై దాడి చేసి చంపేసింది. మృతుడిని రాజస్థాన్కు చెందిన వ్యక్తిగా గుర్తించారు.దాడి చేసిన సింహాన్ని ఎన్క్లోజర్ కేజ్ బంధించారు.
ఈ ఘటనలో చనిపోయిన వ్యక్తిని రాజస్థాన్ లోని అల్వార్ జిల్లాకు చెందిన గుజ్జర్ (34 ) గా గుర్తించారు. జూను సందర్శించేందుకు ఒక్కడే వచ్చినట్లు గుర్తించారు. ఎన్ క్లోజర్ లోకి వెళ్లటానికి వీలు లేనప్పటికీ ఒక్కసారిగా వెళ్లిపోయాడు. అతడు వెళ్తున్న సమయంలో అక్కడ 200 మీటర్ల దూరంలో ఉన్న అబ్జర్వర్ వెంటనే … అప్రమత్తమయ్యాడు. అపేందుకు ప్రయత్నం చేసేలోగా… ఎన్ క్లోజర్ లోపలికి వెళ్లిపోయాడు.
ఈ ఎన్క్లోజర్లో ఒక ఆడ, రెండు మగ సింహాలు ఉన్నాయి. ఇందులోని మగ సింహం ఎన్ క్లోజర్ లోకి వెళ్లిన గుజ్జర్ పై దాడికి దిగింది. దాని నుంచి తప్పించుకునేందుకు చెట్టు ఎక్కినప్పటికీ అతని ప్రయత్నాలు ఫలించలేదు. అతడిని వెంటాడి ప్రాణాలను తీసినట్లు తెలిసింది.
జూ అధికారులు, స్థానిక పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. స్థానిక ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించారు. జూ ప్రాంగణంలోకి గుజ్జర్ వచ్చిన దృశ్యాలను గమనించారు అధికారులు. అయితే సింహల ఎన్ క్లోజర్ల దగ్గర సీసీ కెమెరాలు అందుబాటులో లేవు. మృతుడి మానసిక పరిస్థితి బాగాలేదని, మద్యం మత్తులో ఉన్నాడని వార్తలు రాగా.. దీనిపై పోలీసులు ఎలాంటి ప్రకటన చేయలేదు. పోస్టుమార్టం రిపోర్టు తర్వాత వివరాలను వెల్లడించనున్నారు.