MLAs Trap Case ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం....
MLAs Trap Case టిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్ సోదాలు కొనసాగుతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్, హరియాణా, కేరళ, కర్ణాటకతో పాటు హైదరాబాద్లోనూ సిట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం 7 బృందాలుగా వివిధ ప్రాంతాల్లో ఏక కాలంలో సోదాలు నిర్వహిస్తుయి. హరియాణాలో రామచంద్రభారతి నివాసంతో పాటు కర్ణాటకలోని పుత్తూరులో ఆయనకు సంబంధించిన ఇంటిలో కూడా సోదాలు నిర్వహించారు. తిరుపతిలో సింహయాజికి ఆశ్రమానికి వెళ్లిన మరో బృందం సోదాలు చేస్తోంది.హైదరాబాద్లోని నందకుమార్కు చెందిన ఇల్లు, హోటళ్లలో సోదాలు నిర్వహించారు.
MLAs Trap Case ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టిన వ్యవహారంలో దేశవ్యాప్తంగా సోదాలు జరుగుతున్నాయి. 7 ప్రత్యేక బృందాలతో సిట్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఫిల్మ్ నగర్లోని నందకుమార్కు చెందిన డెక్కన్ కిచెన్ హోటల్, షేక్పేట్, చైతన్యపురిలోని ఇళ్ళలో సోదాలు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రామచంద్ర భారతికి చెందిన హర్యానాలోని ఫరీదాబాద్, ఆయన ఎక్కువగా తిరిగే కేరళలో ఆదివారం కూడా సోదాలు నిర్వహించారు. రామచంద్రభారతి కుటుంబ సభ్యులు, రాజకీయ సన్నిహితులు, ఫ్రెండ్స్ నుంచి సమాచారం సేకరించినట్లు తెలిసింది. దీంతో పాటు ఏపీలోని తిరుపతిలో సింహయాజికి చెందిన పలు ప్రాంతాల్లో కొంతమందిని విచారించినట్లు చెబుతున్నారు.
నందకుమార్ నివాసంలో సోదాలు..
తెలంగాణ ఎమ్మెల్యేలకు ఎర కేసులో కీలక పాత్ర పోషించిన హైదరాబాద్కు చెందిన నందకుమార్కు చెందిన పలు ప్రాంతాల్లో సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఫిల్మ్నగర్ ఆదిత్య హిల్టాప్ అపార్ట్మెంట్లోని ఆరో అంతస్తులో ఉన్న నందకుమార్ ఇంట్లో దాదాపు ఆరు గంటలపాటు సోదాలు చేశారు. ఆ సమయంలో నందకుమార్ భార్య, కుమారుడు ఇంట్లోనే ఉన్నారు. ఇల్లంతా గాలించిన పోలీసులు పలు పత్రాల్ని తీసుకెళ్లినట్లు తెలిసింది. కొంత కాలంగా వారి ఇంటికి ఎవరెవరు వచ్చారనే కోణంలో సీసీ కెమెరాల ఫుటేజిని పరిశీలించినట్లు సమాచారం.
చైతన్యపురి, ఫిల్మ్నగర్లలోనూ మరో రెండు బృందాలు సోదాల్లో నిమగ్నమయ్యాయి. చైతన్యపురిలో నందకుమార్ తల్లిదండ్రులు నివసించే ఇంటితో పాటు ఫిల్మ్నగర్ కూడలిలోని అతడి హోటల్ దక్కన్ కిచెన్లో రాత్రి పొద్దుపోయే వరకు సోదాలు నిర్వహించారు. నిందితులు ఇదే హోటల్లో బస చేసి ఉంటారనే అనుమానంతో ఆ వివరాలు సేకరించే ప్రయత్నాలు చేస్తున్నారు.
మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో సిట్ దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. హైదరాబాద్ తో సహా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, హర్యానాలో సిట్ అధికారుల సోదాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. సిట్ అధికారులు వస్తున్నారన్న విషయం తెలుసుకున్న ఓ వైద్యుడు పరారయ్యాడు. కేరళకు చెందిన వైద్యుడు ముగ్గురు నిందితుల్లో ఒకరైన రామచంద్ర భారతికి సన్నిహితుడిగా సిట్ అధికారులు గుర్తించారు.
వైద్యుడి ఆశ్రమానికి వెళ్లిన సిట్ అధికారులు...అక్కడున్న స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పోలీసులు వస్తున్నారని ఆశ్రమంలోని ఇన్ చార్జ్ సమాచారం అందించడంతోనే వైద్యుడు తప్పించుకున్నాడని చెబుతున్నారు. కేరళ పోలీసుల సాయంతో ఆశ్రమం ఇన్ చార్జీని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు పరారీలో ఉన్న వైద్యుడు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సదరు వైద్యుడు ఆచూకీ తెలిస్తే.. సిట్ అధికారుల దర్యాప్తులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు.
మరోవైపు తిరుపతికి చెందిన సింహయాజికి నగరంలోని ఓ జాతీయ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధి బంధువు తిరుపతి నుంచి హైదరాబాద్ రావడానికి విమానం టికెట్ బుక్ చేసినట్టు సిట్ గుర్తించింది. దర్యాప్తులో భాగంగా సోదాల అనంతరం మరికొంత మందిని అరెస్టు చేసే అవకాశాలున్నాయని పోలీసులు చెబుతున్నారు.
ఇప్పటికే సేకరించిన ఆధారాలతో సంబంధిత వ్యక్తులను విచారించేందుకు సిట్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. న్యాయపరమైన చిక్కులు రాకుండా సీనియర్ లాయర్ల సలహాలు తీసుకుంటున్నారు. నిందితులు ప్రస్తావించిన వ్యక్తులకు తమ దగ్గర ఉన్న ఆధారాలతో ఏ సెక్షన్స్ కింద నోటీసులు ఇవ్వాలనే వివరాలను తెలుసుకుంటున్నారు. ఈ కేసులో వారికి నేరుగా సంబంధం ఉంటే నిందితులకు జారీ చేసిన విధానంగానే సీఆర్పీసీ 41 కింద నోటీసులు ఇచ్చి విచారించనున్నారు. ఢిల్లీ కేంద్రంగా కుట్ర జరిగిందనే అనుమానాలతో రామచంద్ర భారతిపైనే సిట్ ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు తెలిసింది.
ఇప్పటికే ఫామ్ హౌస్లో సేకరించిన వీడియో ఫుటేజ్, ఆడియో కాల్ రికార్డులకు సంబంధించి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ మరో రెండ్రోజుల్లో ఏసీబీ కోర్టుకు అందనుంది. నివేదికలను మొత్తం సీల్డ్ కవర్లో సిట్కు అందజేసే అవకాశాలు ఉన్నాయి. ఫోరెన్సిక్ రిపోర్ట్లో పేర్కొన్న వివరాలు, ఆడియో కాల్స్లో రికార్డ్ అయిన నెంబర్ల వారిగా సంబంధిత వ్యక్తులను వివరణ కోరే అవకాశాలు ఉన్నాయి. మరికొద్ది రోజుల్లోనే అనుమానితులను పోలీసులు విచారించే అవకాశాలు ఉన్నాయి
బెదిరింపులపై ఎమ్మెల్యేల ఫిర్యాదు….
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో రామచంద్ర భారతి, సింహయాజీ, నందకుమార్లపై పెట్టిన కేసులను విత్ డ్రా చేసుకోవాలని కొంతమంది తమను బెదిరిస్తున్నారని ఎమ్మెల్యేలు బీరం హర్షవర్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజు, పైలెట్ రోహిత్ రెడ్డి, రేగ కాంతారావు పేర్కొన్నారు. ఫోన్లు చేసి, మెసేజ్లు పెట్టి బెదిరిస్తున్నారంటూ కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి బంజారా హిల్స్లో, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గచ్చిబౌలిలో, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి రాయదుర్గంలో, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఘట్కేసర్ పోలీస్ స్టేషన్లలో వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. అక్టోబర్ 26 నుంచి కొంతమంది ఫోన్ చేసి కేసు విత్డ్రా చేసుకోవాలని, లేదంటే అంతు చూస్తామని బెదిరిస్తున్నారని ఎమ్మెల్యేలు చెబుతున్నారు.