TRS MLAs Trap : సీబీఐతో విచారణ జరిపించాలి.. హైకోర్టులో బీజేపీ పిటిషన్
టీఆర్ఎస్కు చెందిన నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు అంశం హాట్ టాపిక్ గా మారింది. ఓవైపు పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. మరోవైపు బీజేపీ కోర్టుమెట్లెక్కింది. గురువారం హైకోర్టులో పిటీషన్ వేసింది. సీబీఐతో విచారణ చేయించాలని కోరింది.
Four TRS MLAs Trap ase: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కథతో... టీఆర్ఎస్, బీజేపీల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. దమ్ముంటే సిట్టింగ్ జడ్జితో విచారింతాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తుండగా... అధికార టీఆర్ఎస్.. కమలం నేతలను టార్గెట్ చేస్తోంది. ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నించటాన్ని ఖండిస్తూ ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. ఇదిలా ఉండగా... తెలంగాణ బీజేపీ... హైకోర్టును ఆశ్రయించింది. ఈ వ్యవహరంపై ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేసింది.
ఈ మేరకు బీజేపీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి ఈ పిటిషన్ వేశారు. బీజేపీ పార్టీ ప్రతిష్ట దెబ్బ తీసే విధంగా వ్యవహరిస్తున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు. మునుగోడు బైపోల్ నేపథ్యంలో తమ పార్టీకి వస్తున్న ఆదరణ చూడలేకనే టీఆర్ఎస్ కుట్ర చేసిందని తెలిపారు. మొత్తం ఎనిమిది మందిని ప్రతివాదులుగా చేర్చారు. తెలంగాణ ప్రభుత్వం, డీజీపీ, సైబరాబాద్ సీపీ, రాజేంద్రనగర్ ఏసీపీ,మొయినాబాద్ ఎస్ హెచ్ వో, కేంద్రం, సీబీఐని ప్రతివాదులగా పిటీషన్ లో చేర్చారు.
టీఆర్ఎస్ నిరసనలు…
మొయినాబాద్ ఫామ్ హౌజ్ ఘటనపై టీఆర్ఎస్ తీవ్రంగా స్పందిస్తోంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా టీఎర్ఎస్ నిరసనలు చేపట్టింది. మరోవైపు అధికార TRS పార్టీకి చెందిన ఆ నలుగురు ఎమ్మెల్యేలు ప్రస్తతం ప్రగతి భవన్ లోనే ఉన్నట్లు సమాచారం. వారు ఇవాళ మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. మరోవైపు కేసీఆర్ కూడా మాట్లాడానున్నట్లు సమచారం.
ఇదిలా ఉంటే ఫామ్ హౌజ్ కొనుగోళ్ల వ్యవహారాన్ని కేసీఆర్ డ్రామాగా బీజేపీ నేతలు అభివర్ణిస్తున్నారు.ఈ వ్యవహారానికి సంబంధించి సిట్టింగ్ జడ్జితో విచారణకు డిమాండ్ చేస్తోంది. కేసీఆర్ యాదాద్రి నర్సింహ స్వామిపై ఒట్టేసి చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించి ఆడియో, వీడియో టేపులను బయటపెట్టాలని అన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిందని చెబుతున్నదంతా ప్రగతిభవన్ ప్లాన్ అని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి విమర్శించారు. మునుగోడు ఉపఎన్నిక కోసం ఇంత డ్రామా అవసరమా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ నేతలు చెబుతున్న పేర్లను తొలిసారి వింటున్నామని వ్యాఖ్యానించారు.
రూ. 400 కోట్ల రూపాయలతో నలుగురు అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే భారీ డీల్ను హైదరాబాద్ పోలీసులు బుధవారం భగ్నం చేసిన విషయం తెలిసిందే. మధ్యవర్తులను మొయినాబాద్ ఫామ్హౌజ్లో సాక్ష్యాధారాలతో సహా పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది.