Women Park : ఫస్ట్ ఉమెన్ పార్క్ ఇదే.. పురుషులకు నో ఎంట్రీ..
తెలంగాణలో తొలి మహిళా, పిల్లల పార్కు హైదరాబాద్లో ప్రారంభమైంది. ఇక్కడకు పురుషులను అనుమతించరు. మహిళలు, పిల్లలు మాత్రమే రావాల్సి ఉంటుంది.
కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ (కెపిహెచ్బి)-ఫేజ్ 3లో మహిళలు, పిల్లల కోసం ప్రత్యేకంగా నిర్మించిన పార్క్ ప్రారంభమైంది. తెలంగాణలోనే ఇది మొట్టమొదటి ఉమెన్ అండ్ చిల్డ్రన్ పార్క్. అనేక వినోద కార్యక్రమాలను ఈ పార్క్ లో ఉంటాయి. మహిళలు, 10 సంవత్సరాలలోపు పిల్లలకు మాత్రమే ఇందులోకి అనుమతి ఉంటుంది.
పిల్లల కోసం ఆట స్థలాలు, ఓపెన్ జిమ్, వాకింగ్ ట్రాక్లు, యోగా ప్రాంతం, కిట్టీ పార్టీల కోసం ప్రత్యేకంగా స్థలాలు ఏర్పాటు చేశారు. ఈ పార్క్లో అనేక సౌకర్యాలు ఉన్నాయి.
'చిన్న వ్యాపారాలు నిర్వహించే మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రదర్శనలు నిర్వహించడానికి మేం ఒక ప్రాంతాన్ని కూడా కేటాయించాం.' అని GHMC అధికారి ఒకరు తెలిపారు. స్వయం సహాయక సంఘాల మహిళల కోసం వర్క్షాప్లు మరియు శిక్షణా శిబిరాలు నిర్వహించడానికి ప్రణాళికలు జరుగుతున్నాయని తెలిపారు. మునిసిపల్ బాడీ వారికి ఎంబ్రాయిడరీ మరియు హ్యాండ్బ్యాగ్లు, ఇతర ఉత్పత్తుల తయారీలో కూడా శిక్షణ ఇవ్వాలని యోచిస్తోందన్నారు.
1.5 ఎకరాల విస్తీర్ణంలో ఈ పార్కును కేపీహెచ్బీ, గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) రూ. 1.7 కోట్లతో అభివృద్ధి చేశాయి. రెండు సంస్థలు ఖర్చును పంచుకుంటాయి. 'హౌసింగ్ బోర్డు భూమిలో పార్క్ అభివృద్ధి చేశాం. పిల్లల ఆట స్థలం, ఓపెన్ జిమ్ను GHMC అభివృద్ధి చేయగా, వాకింగ్ ట్రాక్, కాంపౌండ్ వాల్ను బోర్డు నిర్మించింది.' అని GHMC అధికారి ఒకరు తెలిపారు. ఇలాంటి ఉమెన్ అండ్ చిల్డ్రన్ పార్క్ను సెరిలింగంపల్లి, ఎల్బీ నగర్లో ఇదే తరహాలో అభివృద్ధి చేస్తున్నారు.