TS Breakfast Scheme : విద్యార్థులకు దసరా గిఫ్ట్, అక్టోబర్ 24 నుంచి సీఎం అల్పాహార పథకం అమల్లోకి!
TS Breakfast Scheme : రాష్ట్రం వ్యాప్తంగా 1 నుంచి 10వ తరగతి వరకూ ప్రభుత్వ పాఠశాల్లో ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని అమలుచేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అక్టోబర్ 24 నుంచి ఈ పథకం అమలుకానుంది.
TS Breakfast Scheme : సీఎం కేసీఆర్ దసరా కానుకగా ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సంపూర్ణ అల్పాహారాన్ని అందించాలని ఇటీవలే నిర్ణయించారు. కాగా ఈ కార్యక్రమం అక్టోబర్ 24 నుంచి అమలు చేయనున్నారు. " ముఖ్యమంత్రి అల్పాహార " కార్యక్రమానికి ప్రతీ సంవత్సరం 400 కోట్ల రూపాయలను ప్రభుత్వం దసరా కానుకగా విడుదల చేయనుంది.
తమిళనాడు ప్రేరణతో
ఈ పథకం అమలు సాధ్య సాధనలకై రాష్ట్ర ఉన్నతాధికారులు తమిళనాడులో అమలు అవుతున్న అల్పాహార పథకం విధివిధానాలను పరిశీలించి ముఖ్యమంత్రి కేసీఆర్ కు నివేదికను సమర్పించారు. తమిళనాడులో కేవలం ప్రాథమిక పాఠశాలల్లోనే ఈ పథకం అమలు చేస్తుండగా తెలంగాణ ప్రభుత్వం 1 నుంచి 10వ తరగతి వరకు ఒకేసారి అమలు చేయాలని నిర్ణయించింది.
అల్పాహార మెనూ
- సోమవారం - గోధుమ రవ్వ ఉప్మా, చట్నీ
- మంగళవారం - బియ్యం రవ్వ కిచిడీ, చట్నీ
- బుధవారం - బొంబాయ్ రవ్వ ఉప్మా, సాంబార్
- గురువారం - రవ్వ పొంగల్, సాంబార్
- శుక్రవారం - మిల్లెట్ రవ్వ కిచిడీ, సాంబార్
- శనివారం - గోధుమ రవ్వ కిచిడీ, సాంబార్
తెలంగాణ వ్యాప్తంగా
తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్నీ ప్రభుత్వ పాఠశాలలు, ఎయిడెడ్ స్కూల్స్, మోడల్ స్కూల్స్ లోని మొత్తం 23,05,801 మంది విద్యార్థులకు " ముఖ్యమంత్రి అల్పాహారం " పథకం అమలు చేయనున్నారు. జిల్లాలో చాలామంది పేద పిల్లలు గ్రామీణ ప్రాంతాల నుంచి ఉదయం ఖాళీ కడుపుతో బడులకు వస్తున్నారు. దానివల్ల నీరసం,రక్తహీనత, పోషకాహార లోపం సమస్యలు విద్యార్థులను బాధిస్తున్నాయి. ఫలితంగా విద్యార్థులు చదువులకు దూరం అవుతున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం గుర్తించి ఈ పథకానికి శ్రీకారం చుట్టింది." ముఖ్యమంత్రి అల్పాహార" పథకం పట్ల అటు విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.