TPCC: 'రాజ్ భవన్ ముట్టడి' ఉద్రిక్తం… కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జ్-high tension at raj bhavan over congress protest ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tpcc: 'రాజ్ భవన్ ముట్టడి' ఉద్రిక్తం… కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జ్

TPCC: 'రాజ్ భవన్ ముట్టడి' ఉద్రిక్తం… కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జ్

HT Telugu Desk HT Telugu
Jun 16, 2022 01:09 PM IST

టీపీసీసీ పిలుపునిచ్చిన ‘రాజ్‌భవన్‌ ముట్టడి’ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. కాంగ్రెస్‌ శ్రేణులు వివిధ మార్గాల్లో పెద్ద ఎత్తున రాజ్‌భవన్‌కు వెళ్లేందుకు యత్నించారు. ఓ ద్విచక్రవాహనాన్ని కూడా తగలబెట్టారు. రేవంత్ రెడ్డితో పాటు ముఖ్య నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రాజ్ భవన్ వద్ద ఉద్రిక్తత
రాజ్ భవన్ వద్ద ఉద్రిక్తత

high tension at raj bhavan: రాహుల్ గాంధీ ఈడీ విచారణ ఖండిస్తూ తెలంగాణ కాంగ్రెస్ చేపట్టిన ‘రాజ్‌భవన్‌ ముట్టడి’ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. పలు మార్గాల్లో పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. ఓ దశలో ఖైరతాబాద్‌ కూడలి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆర్టీసీ బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. బస్సుపైకి ఎక్కి మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

పోలీసుల అదుపులో రేవంత్ రెడ్డి …

రాజ్ భవన్ ముట్టడి దృష్ట్యా పోలీసులు ముందుస్తుగానే చర్యలు చేపట్టారు. ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున బారికేడ్లు ఏర్పాటు చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, జగ్గారెడ్డి, గీతారెడ్డి, భట్టి విక్రమార్కతో పాటు పలువురు నేతలు రాజ్ భవన్ పై వస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. రేవంత్‌రెడ్డిని స్టేషన్‌కు తరలిస్తుండగా కార్యకర్తలు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు, ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో కొందరు కార్యకర్తలు సొమ్మసిల్లిపడిపోయారు.

బైక్ కు నిప్పు….

 ఖైరతాబాద్‌లో  కాంగ్రెస్ నేత ఆందోళన మరింత ఉద్రిక్తతకు దారి తీసింది. రోడ్డుపై యువజన కాంగ్రెస్ నేతలు బైక్‌కు నిప్పు పెట్టారు. బస్సులను అడ్డుకుని నిరసనకు దిగారు. ఆర్టీసీ బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. ఫలితంగా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.

పోలీసుల లాఠీఛార్జ్....

రాజ్‌భవన్‌లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించి కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు లాఠీ ఛార్జ్ కి దిగారు. రాజ్ భవన్ పరిసర ప్రాంతాల్లో నిరసనకారులు ఉండకుండా చెదరగొట్టారు. పోలీసుల లాఠీ ఛార్జ్ ను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.

ఎస్సై చొక్కా పట్టుకున్న రేణుకా చౌదరి….

కార్యకర్తలను అడ్డుకునే క్రమంలో పోలీసులు రేణుకాచౌదరిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఆమెకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఓ దశలో రేణుకా చౌదరి ఎస్సై కాలర్‌ పట్టుకున్నారు. అయితే పోలీసులు ఆమెను అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

మొత్తంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన రాజ్ భవన్ ముట్టడి రణరంగంగా మారింది. కీలక నేతలను అదుపులోకి తీసుకున్నప్పటికీ… రాజ్ భవన్ పరిసర ప్రాంతాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం