CM KCR On Next Election : 2024 ఎన్నికల్లో దిల్లీ గడ్డపై వచ్చేది మన ప్రభుత్వమే.. దేశానికి ఫ్రీ కరెంట్ ఇస్తాం-cm kcr comments on bjp in nizamabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cm Kcr On Next Election : 2024 ఎన్నికల్లో దిల్లీ గడ్డపై వచ్చేది మన ప్రభుత్వమే.. దేశానికి ఫ్రీ కరెంట్ ఇస్తాం

CM KCR On Next Election : 2024 ఎన్నికల్లో దిల్లీ గడ్డపై వచ్చేది మన ప్రభుత్వమే.. దేశానికి ఫ్రీ కరెంట్ ఇస్తాం

HT Telugu Desk HT Telugu
Sep 05, 2022 05:24 PM IST

CM KCR On PM Modi : 2024 ఎన్నికల్లో దిల్లీ గడ్డపై మన ప్రభుత్వమే రాబోతోందని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. నాన్ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందని జోస్యం చెప్పారు. ఎమ్మెల్యేలను కొనటం, ప్రభుత్వాలను కూలదోయటమే మోదీ చేస్తున్న ఏకైక పని విమర్శించారు.

సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్

రైతుల భూములు తీసుకుని కార్పొరేట్‌ కంపెనీలకు అప్పగించాలని చూస్తున్నారని సీఎం కేసీఆర్ అన్నారు. ఎరువుల ధరలు, వ్యవసాయ ఖర్చులు విపరీతంగా పెరిగాయన్నారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగడంతో సాగు భారంగా మారిందని మండిపడ్డారు. నిజామాబాద్‌లో కొత్త కలెక్టరేట్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ప్రారంభోత్సవంలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి, సభాపతి పోచారం పాల్గొన్నారు. నిజామాబాద్‌లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూడా కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు.

కేంద్రప్రభుత్వం ఎన్‌పీఏల పేరుతో వ్యాపారులకు రూ.12 లక్షల కోట్లు దోచిపెట్టిందని కేసీఆర్ ఆరోపించారు. రైతులకు మాత్రం ఉచితాలు ఇవ్వొద్దని ప్రధాని మోదీ చెబుతున్నారని మండిపడ్డారు. 1.20 లక్షల కోట్లు ఖర్చయ్యే ఉచిత విద్యుత్ ఇవ్వొద్దని మోదీ చెప్తున్నారన్నారు. 2024లో భాజపా ముక్త్‌ భారత్‌ ఉండాలని వ్యాఖ్యానించారు.'దేశం కోసం తెలంగాణ నుంచే పోరాటం ప్రారంభం కావాలి. బావి దగ్గర మీటర్లు పెట్టమనే సర్కారుకు మీటర్లు పెట్టి సాగనంపాలి. 8 ఏళ్లల్లో మోదీ సర్కారు ఒక్క ప్రాజెక్టు గానీ, పరిశ్రమగానీ నిర్మించిందా?. దేశంలో ఉన్నవాటినే మోదీ వరసగా అమ్ముకుంటూ వస్తున్నారు. ఎమ్మెల్యేలను కొనటం, ప్రభుత్వాలను కూలదోయటమే మోదీ చేస్తున్న ఏకైక పని.' అని కేసీఆర్ విమర్శించారు.

మనచుట్టూ ఏం జరుగుతుందో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలని సీఎం కేసీఆర్ కోరారు. 1956లో జరిగిన చిన్న పొరపాటు వల్ల ఎంతో నష్టపోయామని గుర్తు చేశారు. 60 ఏళ్లు పోరాటం చేసి మళ్లీ తెలంగాణను సాధించుకున్నామని తెలిపారు. స్వాతంత్య్రానికి పూర్వమే హైదరాబాద్‌ సంస్థానంలో ఎంతో అభివృద్ధి కనిపించేదన్నారు. దేశం మొత్తం ఆశ్చర్యపోయే విధంగా తెలంగాణను అభివృద్ధి చేసుకుంటున్నామన్నారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు మరే రాష్ట్రంలోనూ లేవని అన్నారు.

దేశ రాజకీయాలపై నిజామాబాద్ సభలో కేసీఆర్ ప్రత్యేకంగా మాట్లాడారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్దామా అని ప్రజలను అడిగారు. కేంద్రం మంటలు పెడుతుందని విమర్శించారు. 2024 ఎన్నికల్లో నాన్ బీజేపీ ప్రభుత్వం వస్తుందని జోస్యం చెప్పారు. తెలంగాణ మాదిరి దేశంలో ఫ్రీ కరెంట్ ఇస్తామని కేసీఆర్ అన్నారు. ఒక్కొక్కటి చేస్తూ.. తెలంగాణలో ముందుకు వెళ్తున్నాం.. భారతదేశం కూడా అలానే వెళ్లాలి. మతపిచ్చితో ఉన్న బీజేపీని ఇంటికి సాగనంపాలని పిలుపునిచ్చారు.

'దేశ రాజకీయాల్లోకి రావాలని జాతీయస్థాయి రైతు నాయకులు అడుగుతున్నారు. తెలంగాణ ప్రజలు దీవిస్తే జాతీయ రాజకీయాల్లోకి వెళ్తాను. నిజామాబాద్‌ గడ్డ నుంచి జాతీయ రాజకీయ ప్రస్థానం ప్రారంభిస్తాను. కాలువల్లో నీరు పారాలో? మతపిచ్చితో రక్తం పారాలో ప్రజలు ఆలోచించాలి. జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి రూ.10 కోట్లు చొప్పున మంజూరు చేస్తాం. దళితబంధు కార్యక్రమాన్ని నిరంతరంగా ముందుకు తీసుకెళ్తాం.' అని సీఎం అన్నారు.

రైతులకు ఉచితంగా 24 గంటల విద్యుత్‌ ఏ రాష్ట్రంలోనూ ఇవ్వట్లేదు. 3600 గిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా మార్చేసుకున్నాం. కేంద్రంలోని బీజేపీ ఇప్పుడు రైతుల మోటార్ల లెక్కలు తీయమంటోంది. రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలని నరేంద్రమోదీ చెప్తున్నారు. రైళ్లు, విమానాలు, ప్రభుత్వ సంస్థలు విక్రయించి ఇప్పుడు రైతుల మీద పడ్డారు. అభివృద్ధి అనేది నిరంతరం జరుగుతుంది. గొప్ప దేశమనుకునే అమెరికాలోనూ సమస్యలున్నాయి. నిజామాబాద్ లో మరికొన్ని పనులు జరగాల్సి ఉంది. నిజామాబాద్ అర్బన్ కోసం 100 కోట్లు ప్రకటిస్తున్నాను. ఎమ్మెల్యేల ఫండ్ తోపాటుగా తలో 10 కోట్లు అదనంగా ఇస్తాం.

- సీఎం కేసీఆర్

IPL_Entry_Point