కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తొలిసారి "తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం"
కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఢిల్లీలోని డాక్టర్ బిఆర్.అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో జూన్2న ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
రాష్ట్రం ఏర్పడిన ఎనిమిదేళ్ల తర్వాత కేంద్ర ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని అధికారికంగా నిర్వహించనుంది. గురువారంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో ఈ వేడుకల్ని నిర్వహించనున్నారు. కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి నేతృత్వంలో జరిగే వేడుకలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి మీనాక్షి లేఖీ కూడా పాల్గొననున్నారు.
కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటి సారి తెలంగాణ దినోత్సవాన్ని , తెలంగాణ ఆవిర్భవించిన రోజు నిర్వహిస్తోంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను వివరించడంతో పాటు దేశంలో కొత్తగా ఏర్పడిన రాష్ట్రం నేపథ్యాన్ని వివరించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణకు ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మంగ్లీతో పాటు హేమచంద్రలతో సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఏక్ భారత్, శ్రేష్ట్ భారత్లో భాగంగా హర్యానా చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ప్రదర్శిస్తారు. తెలంగాణ జానపద నృత్య ప్రదర్శనలతో పాటు, రాష్ట్ర సాంస్కృతిక వైభవానికి అద్దం పట్టే కార్యక్రమాలను నిర్వహించనున్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75ఏళ్లు పూర్తైన నేపథ్యంలో నిర్వహిస్తోన్న అజాదీ కా అమృత్ మహోత్సవాలతో పాటుతెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని కూడా కేంద్రం ఘనంగా నిర్వహిస్తోంది.
టాపిక్