Telangana Assembly Sessions : ఈ నెల 6 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
TS Assembly Sessions 2022: ఈ నెల 6 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. బీఏసీ సమావేశాల్లో ఎన్ని రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలనే దానిపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
Telangana Assembly Sessions 2022: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు ముహుర్తం ఖరారైంది. ఈ నెల 6వ తేదీ నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం పదకొండున్నర గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
ట్రెండింగ్ వార్తలు
బీఏసీలో నిర్ణయం...
TS Assembly BAC Meeting: ఇక సమావేశాలు ఎన్ని రోజులు నిర్ణయిస్తారనే దానిపై క్లారిటీ రాలేదు. అయితే అదే రోజు బీఏసీ సమావేశం జరగనుంది. ఈ భేటీలోనే ఎన్నిరోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.
మరోవైపు కొద్దిరోజులుగా రాష్ట్రంలోచోటు చేసుకున్న పరిణామాలపై చర్చకు ప్రతిపక్ష పార్టీల సభ్యులు పట్టుబట్టే అవకాశం ఉంది. అయితే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలు, అరెస్ట్, హైదరాబాద్ లో పరిణామాలపై కూడా సభలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. బీజేపీ శాసనసభపక్షనేతగా ఉన్న రాజాసింగ్ ను అసెంబ్లీ నుంచి బహిష్కరించాలని ఎంఐఎం డిమాండ్ చేసింది. ఇదే విషయంపై స్పీకర్ కు లేఖ కూడా రాసింది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై సభలో చర్చకు వచ్చే అకాశం లేకపోలేదు.
Telangana Cabinet Meeting: ఈ నెల మూడో తేదీన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది.ఈ సమావేశంలో అసెంబ్లీలో ప్రవేశ పెట్టే బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. మరోవైపు శనివారం సాయంత్రం తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ఎల్పీ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలతో పాటు దేశంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల్లో టీఆర్ఎస్ అనుసరించనున్న పాత్రపై టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులకు ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్ధేశం చేయనున్నారు.
ఏపీలో కూడా...
Andhrapradesh Assembly Sessions 2022: అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ఏపీ ప్రభుత్వం కూడా కసరత్తు మొదలుపెట్టింది. ఈ నెలలలోనే నిర్వహించాలని యోచిస్తోంది. ఈనెల 3వ వారంలో జరిగే అవకాశం ఉంది. వారం రోజుల పాటు నిర్వహించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
ఈనెల 7వ తేదీ ఆ రాష్ట్ర మంత్రిమండలి భేటీ కానుంది. మంత్రి వర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికీ మూడు రాజధానుల విషయంలో సందిగ్ధత నెలకొనే ఉంది. ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఈ విషయంలో మల్లగుల్లాలు పడుతున్న సర్కార్... ఓసారి బిల్లు తీసుకొచ్చింది. కానీ కోర్టుల జోక్యం, అమరావతి రైతుల నిరసనల నేపథ్యంలో వెనక్కి తీసుకుంది. అయితే మరోసారి బలమైన బిల్లుతో ముందుకొస్తామని శాసనసభ వేదికగా సీఎం జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మధ్య కాలంలోనూ మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చింది. పలువురు మంత్రులు కూడా కీలకమైన ప్రకటనలు చేస్తూ వచ్చారు. అయితే 7వ తేదీన జరిగే భేటీలో కూడా మూడు రాజధానుల అంశం చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అన్ని కుదిరితే శాసనసభ ముందుకు బిల్లు వచ్చే ఛాన్స్ కూడా ఉందనే టాక్ నడుస్తోంది.
సంబంధిత కథనం